
ముగిసిన గవరపాలెం గౌరీపరమేశ్వరుల ఉత్సవం
అనకాపల్లి: స్థానిక గవరపాలెం గౌరీపరమేశ్వరుల అమ్మవారి ఉత్సవం శనివారం రాత్రి ఘనంగా ముగిసింది. అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సుమారుగా 3 లక్షల మంది ప్రజలు శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకూ ఉత్సవాన్ని తిలకించారు. గవరపాలెం సంతోషిమాత ఆర్చ్ పక్కన మందుగుండు సీతారామయ్య కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బాణసంచాను జనసేన నియోజకవర్గ నాయకుడు భీమరశెట్టి రాంకీ వెలిగించారు. ఉత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ఎం.శ్రావణి, పట్టణ సీఐ విజయకుమార్, ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటనారాయణలు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కొణతాల సంతోష్ అప్పారావునాయుడు, కార్యదర్శి కొణతాల శ్రీనివాసరావు, కోశాధికారి కొణతాల నూక మహాలక్ష్మీనాయుడు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ముగిసిన గవరపాలెం గౌరీపరమేశ్వరుల ఉత్సవం