పాడేరు: రంపచోడవరం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనుల అభ్యున్నతికి సంబంధించి ఒక్క కీలక ప్రకటన కూడా చేయకపోవడం బాధాకరమని గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ విమర్శించారు. ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా శుక్రవారం సాయంత్రం పాడేరు పాత బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివాసీ, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా రాధాకృష్ణ మాట్లాడుతూ, రంపచోడవరం పర్యటనలో 1/70 చట్టం పరిరక్షణ, జీవో నంబరు 3 పునరుద్ధరణ, గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ తవ్వకాల నియంత్రణ వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఎలాంటి ప్రకటన చేయకపోవడం నిరాశ కలిగించిందన్నారు. గిరిజన సమస్యలకు సంబంధించిన వినతిపత్రం అందజేయడానికి సిద్ధమైన ఆదివాసీ సంఘాల నాయకులను అక్రమంగా గృహనిర్బంధం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. గిరిజనుల చట్టాలు, హక్కుల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు కైవె కుమార్, దాస్, రాము, ఆశీర్వాదం, రూప, చిన్న, కార్తిక్, కృష్ణ, భాను తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన
కార్యదర్శి కూడా రాధాకృష్ణ


