పాడేరు: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ జిల్లాలో వేగంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 85.25 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన పనిని కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి, మరణించిన వారు, గైర్హాజరైన వారు, నకిలీ ఓటర్లు మరియు ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారిని గుర్తించి, వారి పేర్లను జాబితా నుండి తొలగించే ప్రక్రియను చేపట్టామన్నారు. జిల్లాలోని గ్రామ సభల నిర్వహణను జాయింట్ కలెక్టర్ మరియు ఐటీడీఏ అధికారులు పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు.ఈ గ్రామ సభల్లో బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది, గ్రామ పెద్దల సమక్షంలో, నిబంధనలకు అనుగుణంగా మరణించిన, గైర్హాజరైన, నకిలీ ఓటర్లను గుర్తించి, వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి శాశ్వతంగా తొలగిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.


