పాడేరు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ వనుము చిట్టాబ్బాయ్కి విజయనగరం జిల్లా ఎస్.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా బదిలీ అయింది. ఐదేళ్ల క్రితం విశాఖపట్నం ప్రభుత్వ కృష్ణా కళాశాల నుంచి పదోన్నతిపై ఆయన ఇక్కడికి వచ్చారు.తన ఐదేళ్ల కాలంలో ఆయన కళాశాల రూపురేఖలను పూర్తిగా మార్చివేశారు. కళాశాలకు నాక్ బి–ప్లస్ గ్రేడ్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. కళాశాల అభివృద్ధి కోసం అధిక నిధులు మంజూరు చేయించి.. కంప్యూటర్ ల్యాబ్లు, ప్యానల్ బోర్డులు, పోడియాలు, ఇంటర్నెట్ సౌకర్యాలతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేశారు. కళాశాల ఆవరణను పచ్చదనంతో కళకళలాడేలా గార్డెన్ను ఏర్పాటు చేయడమే కాకుండా, కళాశాల స్థలాన్ని కాపాడేందుకు చుట్టూ ప్రహరీగోడ, ఫెన్సింగ్ నిర్మించారు. కళాశాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేసిన ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టాబ్బాయ్ని కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ప్రత్యేకంగా కలిసి వీడ్కోలు పలకడంతో పాటు ఆయన సేవలను అభినందించారు.


