ఆదివాసీలపై కేంద్రం సవతితల్లి ప్రేమ
● బడ్జెట్లో నిధుల కేటాయింపులో
తీవ్ర అన్యాయం
● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
లోకనాథం విమర్శ
పాడేరు రూరల్: కేంద్ర బడ్జెట్లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం విమర్శించారు. శుక్రవారం పాడేరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడంలో ఉన్న ఉత్సాహం, నిధుల కేటాయింపులో చూపడం లేదని మండిపడ్డారు. 2026 ఆర్థిక సంవత్సరానికి రూ.53 లక్షల కోట్ల బడ్జెట్లో, జనాభా ప్రాతిపదికన ఆదివాసీలకు రూ.4.60 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉండగా, నామమాత్రపు నిధులతో సరిపెట్టారని ఆరోపించారు. పీఎం జన్మన్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణానికి యూనిట్ ధరను రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. పెరిగిన ధరల దృష్ట్యా ప్రస్తుత నిధులు సరిపోవడం లేదన్నారు. గిరిజన యూనివర్సిటీ భవన నిర్మాణానికి తక్షణమే రూ.800 కోట్లు విడుదల చేయాలన్నారు. ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లోనే తరగతులు నిర్వహించడం దారుణమన్నారు. ఎన్నికల సభలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు జీవో నంబర్ 3ను పునరుద్ధరించి, గిరిజనులకు నూరుశాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాలరాసే హైడ్రో పవర్ ప్రాజెక్టుల జీవోలు (2, 13, 51) వెంటనే రద్దు చేసి, 1/70, పీసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బెర్రీ బోర్రర్ పురుగుతో నష్టపోయిన కాఫీ రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేంద్ర, జిల్లా కార్యదర్శి అప్పలనర్స, జిల్లా నాయకులు గంగరాజు, ఉమామహేశ్వరరావు, పోతురాజు, చిన్నయ్యపడాల్, లక్కు, త్రినాథ్ పాల్గొన్నారు.


