బీమా ప్రక్రియను వేగవంతం చేయాలి
చింతపల్లి: మండలంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ప్రమాద బీమా నమోదు ప్రక్రియను సర్పంచ్లు, పార్టీ నాయకులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆపార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్ కోరారు. శుక్రవారం పెదబరడ పంచాయతీ పరిధిలోని కృష్ణాపురంలో సర్పంచ్ సమిడి గోపాల్ ఆధ్వర్యంలో ఎంపీటీసీలు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలు, నాయకుల సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రతి పంచాయతీలో అర్హులైన వారందరి బీమా పత్రాలను వెంటనే పూర్తి చేసేలా సర్పంచ్లు, ఎంపీటీసీలు చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి బూసరి కృష్ణారావు, పంచాయతీల విభాగం జిల్లా అధ్యక్షుడు సాగిన గంగన్నపడాల్, యువజన విభాగం కార్యదర్శి పరమేష్ తదితరులు పాల్గొన్నారు.


