స్థానికులకు అన్యాయంజరిగితే సహించం
● జేఏసీ సభ్యుల హెచ్చరిక
సీలేరు: ఈ ప్రాంతంలో నూతనంగా నిర్మించబోయే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులో దశాబ్దాలుగా నివసిస్తున్న స్థానికులకు అన్యాయం జరిగితే సహించేది లేదని జేఏసీ సభ్యులు హెచ్చరించారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సాండికోరి, బూసుకొండ, పార్వతీనగరంతో పాటు సీలేరు వాసులకు, ముఖ్యంగా చదువుకున్న యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రాజెక్టులో జీవో నంబరు 3 ప్రకారం స్థానిక ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో జెన్కో అతిథి గృహంలో జరిగిన సమావేశంలో చీఫ్ ఇంజనీర్ అందరికీ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు అధికారులు మాట మార్చడం బాధాకరమని పేర్కొన్నారు. స్థానిక యువతకు న్యాయం జరగకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే రోడ్లపైకి వచ్చి పోరాడుతామని జేఏసీ సభ్యులు స్పష్టం చేశారు.


