బలవంతపు భూ సేకరణపై రైతుల ఆందోళన
బుచ్చెయ్యపేట: బలవంతపు భూ సేకరణ పనులను అధికారులు నిలిపివేయాలని ఆర్. శివరాంపురం, అప్పంపాలెం గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. గురువారం రెండు గ్రామాల్లో రామాలయాల వద్ద రైతులు ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశ్రమలు ఏర్పాటుకు తమ గ్రామాల్లో భూ సేకరణ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారని, దీనికి తాము వ్యతిరేకమన్నారు. పరిశ్రమలకు తమ భూములను ఇచ్చేది లేదన్నారు. బలవంతపు భూ సేకరణ ఆపాలని, తమకు అన్నం పెడుతున్న భూములను లాక్కోవొద్దంటూ వేడుకున్నారు. ‘మాకు అన్నం పెట్టే భూములే మాకు ముద్దు, కంపెనీల కోసం చేపట్టే భూ సేకరణ మాకొద్దు, భూ సేకరణ కోసం చేపట్టే సర్వేలు మాకొద్దు’ అంటూ రైతులు నినాదాలు చేశారు. రైతుల భూ సమస్యలపై తప్ప పరిశ్రమల కోసం ఎటువంటి సర్వేలు తమ గ్రామాల్లో చేయొద్దని తహసీల్దార్ లక్ష్మికి రైతులు, రైతు సంఘ ప్రతినిధులు వినతి పత్రం అందించారు.


