అన్నదమ్ములను చిదిమేసిన కంటైనర్ లారీ
కశింకోట: మృత్యు రూపంలో వచ్చిన కంటైనర్ లారీ అన్నదమ్ములను బలి తీసుకుంది. వీరు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. మండలంలో తాళ్లపాలెం వద్ద జాతీయ రహదారిపై గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీఐ అల్లు స్వామి నాయుడు అందించిన వివరాల ప్రకారం... మండలంలోని తాళ్లపాలెంలో ఎస్బీఐ వద్ద యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వస్తున్న కంటైనర్ లారీ ముందు వెళ్తున్న స్కూటీని ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో స్కూటీపై వెళ్తున్న రాంబిల్లి మండలం దిమిలి గ్రామానికి చెందిన జనపరెడ్డి వెంకట తాతాజీ(51), సోదరుడు వెంకటేశ్వరరావు(47) కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్వగ్రామం దిమిలి నుంచి అనకాపల్లికి పని మీద వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో వెంకటేశ్వర కూలి కాగా, తాతాజీ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్గా అనకాపల్లిలో పని చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములైన తాతాజీ, వెంకటేశ్వరరావు మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పరారైన కంటైనర్ లారీని అనకాపల్లి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. ఎస్ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
దిమిలిలో విషాధ చాయలు
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలం దిమిలిలో గురువారం విషాద ఛాయలు అలుముకున్నాయి. దిమిలి గ్రామానికి చెందిన జనపరెడ్డి వెంకట తాతాజీ, వెంకటేశ్వరరావు కశింకోట మండలం తాళ్లపాలెంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో దిమిలిలోని వారి స్వగృహాల వద్ద మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తాతాజీకి భార్య, ఇద్దరు పిల్లలు, వెంకటేశ్వరరావుకు భార్య, కుమారుడు ఉన్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందడాన్ని వారి సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు కుటుంబాల్లోని పిల్లలు చిన్న వాళ్లు కావడంతో కుటుంబ పోషణ భారం కానుంది. ప్రభుత్వం స్పందించి వీరికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
అన్నదమ్ములను చిదిమేసిన కంటైనర్ లారీ
అన్నదమ్ములను చిదిమేసిన కంటైనర్ లారీ


