
ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ
మహారాణిపేట(విశాఖ): రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని, భవిష్యత్తులో ఎటువంటి భూ వివాదాలు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రీ సర్వేపై గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్లో ఎక్కువగా ఆర్వోఆర్, రీసర్వే, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, 22ఎ తొలగింపులు, ఇళ్ల స్థలాల మంజూరు కోసం దరఖాస్తులు వస్తున్నాయని, వాటిని పరిశీలించి, పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ మంత్రికి వివరించారు. విశాఖలో 22ఎ లో ఇళ్లు ఎక్కువగా ఉన్నాయని, ఈ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి, పరిష్కరానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీశంకర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు శ్రీలేఖ, సంగీత్ మహదూర్, మండల రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్