నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో ఎడగారులో వేసిన వరిపైరుకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు జనార్దన్, శ్రీరాములు, మూలి వెంగయ్య డిమాండ్ చేశారు. నెల్లూరులోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో ఎడగారులో రైతులు వరిసాగు చేశారన్నారు. ఏప్రిల్ నెలలో నిర్వహించిన సాగునీటి సలహా సంఘం సమావేశంలో సరిపోయినంత నీరు అందించేందుకు తీర్మానం చేశారని గుర్తుచేశారు. నేడు కొన్ని ప్రాంతాల్లో వరి కోత దశకు వచ్చిందని, మరికొన్నిచోట్ల చిరు పొట్ట దశకు వచ్చిందన్నారు. ఇప్పుడు పంటకు నీరు ఎంతో అవసరమన్నారు. అయితే కావలి, దక్షిణ కనుపూరు కాలువల కింద నీటి పారుదలకు తరచూ ఆటంకం కలుగుతోందన్నారు. సోమశిల ప్రాజెక్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు బృందంగా ఏర్పడి అవసరం లేనిచోట నీరు తగ్గించి, అవసరమైన రైతులకు అందించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమశిల రిజర్వాయర్లో నీటిమట్టం 13 టీఎంసీలకు తగ్గిపోతోందని, వెంటనే శ్రీశైలం నుంచి 10 టీఎంసీలను తీసుకొచ్చేలా మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంతో మాట్లాడాలని కోరారు.


