వైఎస్సార్ సీపీ నాయకుడిపై దాడి
రాజవొమ్మంగి: వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి దాట్ల వెంకటేష్రాజుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సోమవారం రాత్రి కిండ్ర జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. రంపచోడవరంలో జరిగిన గణతంత్ర వేడుకలకు ఎంపీపీ గోము వెంకటలక్ష్మితో పాటు హాజరైన వెంకటేష్రాజు తిరిగి స్వగ్రామమైన రాజవొమ్మంగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి సమీపంలో కిండ్ర జంక్షన్ వద్ద వారి కారును దుండగులు ఆపారు. ఎందుకు ఆపారని అడిగేలోపే వెంకటేష్రాజును కారు నుంచి బయటకు లాగి పిడిగుద్దులు గుద్దారు. కుడిచేయి వంచేసి, దాడి చేశారు. ఈ ఘటనలో వెంకటేష్రాజు కుడి కంటిపై తీవ్ర గాయమైంది. ఈ హఠాత్తు పరిణామం నుంచి తెరుకున్న ఎంపీపీ వెంకటలక్ష్మి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను కూడా పక్కకు నెట్టేశారు. ఆమె చేతికి స్వల్ప గాయాలయ్యాయి. దుండగులు ఆయుధం తీసి హత్యా ప్రయత్నం చేయబోతుండగా, వెంకటేష్రాజుతో పాటు వెంకటలక్ష్మి తప్పించుకుని కారు ఎక్కి అతికష్టం మీద స్వగ్రామం చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జడ్డంగి ఎస్సై చినబాబు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు రామకృష్ణ, సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు మురళీకృష్ణ వచ్చి వెంకటేష్రాజును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతుండగా, మెరుగైన వైద్యం కోసం ఆయన్ని రాజమహేంద్రవరం తరలించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండే బాధితుని వద్ద ఉన్న డబ్బులు, బంగారాన్ని దండుగులు లాక్కున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు జడ్డంగి ఎస్సై చినబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ నాయకుడిపై దాడి


