పడక మరోచోట
పాఠాలు ఒకచోట..
ఆశ్రమ విద్యకు గ్రహణం పట్టింది.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు అసౌకర్యాల నడుమ చదువుకోవాల్సిన దుస్థితి వచ్చింది.. గత ప్రభుత్వంలో ‘నాడు– నేడు’ నిధులతో చేపట్టిన భవన నిర్మాణ పనులను నిలిపివేయడంతో లక్ష్యం నీరుగారుతోంది.. అటు ప్రభుత్వం వైఖరికి తోడు క్షేత్రస్థాయిలో అధికారుల బాధ్యతా రాహిత్యం విద్యార్థులకు శాపంలా మారింది. వారికి కష్టాలు తెచ్చిపెట్టింది. అడ్డతీగలలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
అడ్డతీగల: వసతి, విద్య ఒకేచోటే కల్పించి గిరిజనుల్లో అక్షర జ్ఞానం నింపేందుకు ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటయ్యాయి. అలాంటి చదువుల కోవెలలో అసౌకర్యాలు విసిగిపోయేలా చేస్తున్నాయి.. అడ్డతీగలలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను 1980లో నిర్మించారు. ఈ భవనంలో 8 గదుల్లో ఉండేవి. అక్కడే విద్యార్థులకు చదువు, వసతి కల్పించేవారు. అక్కడి విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణానికి రూ.1.30 కోట్లను ‘నాడు–నేడు’ పథకంలో మంజూరు చేసింది. దీనిని పాత పాఠశాల భవనానికి పక్కనే నిర్మించేందుకు పనులు చేపట్టారు. ఈ పనులు గత హెచ్ఎం పర్యవేక్షణలో జరిగాయి. కొత్త భవనంలో కింద అంతస్తులో ఐదు, పైఅంతస్తులో ఐదు గదులు ఉండేలా కార్యాచరణ చేశారు. అయితే అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ భవనం అంపూర్తిగానే ఉంది. దీనిని పూర్తి చేయించడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఒకటో అంతస్తు నిర్మించి రెండో అంతస్తులో పిల్లర్లు వేశారు. కానీ గోడలు, శ్లాబ్ వేయకుండా వదిలేశారు. మొదటి అంతస్తులో గదుల నిర్మాణం చేపట్టారు. కానీ ఫ్ల్లోరింగ్, కిటికీలు, తలుపులు, విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. ఈ భవనం పూర్తి చేయించకుండా ప్రభుత్వం నిధులను ఆపేసింది. దీనివల్ల అసౌకర్యాల నడుమ ఆ అసంపూర్తి భవనంలోనే తప్పనిసరి పరిస్థితిలో విద్యార్థులకు విద్యా బోధన జరుగుతోంది. ఇలా 125 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
ఉన్నది వదిలేసి.. కొత్తగా మొదలెట్టి
పాఠశాల తరగతి గదుల నిర్మాణం కోసం నిర్మిస్తున్న భవనాన్ని అసంపూర్తిగా వదిలేశారు. ఇదిలా ఉంటే పాఠశాల పాత భవనాన్ని గత డిసెంబర్లో కూలగొట్టారు. ఆ స్థానంలో రూ.2.75 కోట్ల అంచనాతో వసతి గృహం నిర్మాణానికి పనులు మొదలుపెట్టారు. వసతి గృహం కింద అంతస్తులో 7 గదులు, రెండో అంతస్తులో 7 గదులు నిర్మిస్తామని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. అయితే గతంలో పాత పాఠశాల భవనంలో తరగతుల నిర్వహణ, వసతి సౌకర్యం ఉండేది. ఇప్పుడు విధి లేక అసంపూర్తి భవనంలోనే 5 నుంచి 10 తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ భవనం మొదటి అంతస్తులో ఐదు గదుల్లో ఒకటి స్టాఫ్రూమ్గా, మరొకటి స్టోర్ రూమ్గా పాత తలుపులు అమర్చుకుని ఉపయోగిస్తున్నారు. మిగతా మూడు గదులకు తలుపులు, కిటికీలు లేవు. అరకొర సౌకర్యాల నడుమ విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజులు గడుపుతున్నారు.
అడ్డతీగల ఆశ్రమ పాఠశాలలో పరిస్థితి
125 మంది విద్యార్థుల దీనస్థితి
రూ.1.30 కోట్లు ఖర్చు చేసినా
పూర్తి కాని భవనం
అరకొర సౌకర్యాల నడుమ విద్యాభ్యాసం
పడక మరోచోట
పడక మరోచోట


