సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు
రంపచోడవరం: ఐ.పోలవరం వద్ద ఉన్న తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆదివారం నిర్వహించారు. వేంకటేశ్వర స్వామివారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తూ తిరుమాడ వీధి సేవను జరిపారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రథసప్తమి నాడు సూర్యనారాయణమూర్తి అనుగ్రహం విశేషమని, సూర్యప్రభ వాహన సేవకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఆలయ అర్చకులు పార్ధు స్వామి, మణికంఠ స్వామి తెలిపారు. వాహన సేవ పూర్తయ్యాక సేవకులు, హాజరైన భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఏర్పాట్లను ఆలయ అధికారులు రూప్సాయి, ఢిల్లీ ప్రసాద్, విజిలెన్స్ అధికారులు పర్యవేక్షించారు.
కొత్త యూనిట్ల
అనుసంధానం పూర్తి
మోతుగూడెం: లోయర్ సీలేరు పొల్లూరు జల విద్యుత్ కేంద్రం ఐదు, ఆరు యూనిట్ల అనుసంధాన పనులు పూర్తయినట్లు డీఈ బాలకృష్ణ తెలిపారు. ఆదివారం ట్రయల్ రేస్ సంపు వద్ద ఆరో యూనిట్కు సంబంధించి నాలుగో గేటును అమర్చామన్నారు. ఐదు, ఆరు యూనిట్లకు సంబంధించి మొత్తం నాలుగు గేట్లు ఏర్పాటు చేయడంతో అనుసంధాన పనులు పూర్తయ్యాయన్నారు. డొంకరాయి జలాశయం గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి కెనాల్ ద్వారా ఫోర్ బై జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ఫోర్బై రిజర్వాయర్లో ఉన్న నీటిని పెన్స్టాక్ ద్వారా దిగువకు విడుదల చేసి ట్రయల్ రేస్ సంప్ను సగానికి నింపి నూతనంగా నిర్మించిన ఐదు, ఆరు యూనిట్లకు సంబంధించి గేట్ల పూర్తిగా మూసివేస్తామన్నారు. అప్పుడు ఈ యూనిట్లకు ఏమైనా గేట్ల ద్వారా బ్యాక్ వాటర్ వస్తుందేమో అని పరిక్షిస్తామని తెలిపారు. బ్యాక్ వాటర్ రాకపోతే సోమవారం నుంచే నాలుగు యూనిట్ల ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపారు.
శబరి నదిలో
యువకుడి గల్లంతు
చింతూరు: స్థానిక శబరినదిలో స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికంగా తాపీమేస్త్రిగా పనిచేస్తున్న చల్లా కృష్ణ కుమారుడు వెంకటరమణ (19) స్నేహితుడితో కలసి ఎయిర్టెల్ టవర్ సమీపంలో శబరినది వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో వెంకటరమణ స్నానం నిమిత్తం శబరినదిలోకి దిగి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం చీకటి పడే వరకూ గాలింపు చేపట్టినా ఫలితం లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
విద్యార్థి మృతి
మోతుగూడెం: రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి శనివారం మృతి చెందాడు. మోతుగూడెం ఎస్సై అబ్దుల్ నాజర్ హుస్సేన్ కథనం ప్రకారం.. చింతూరు మండలం మల్లెతోట ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నైకం భరత్, ఆరో తరగతి చదువుతున్న కిల్లో రమేష్బాబు శనివారం రాత్రి పది గంటల సమయంలో చింతూరులో రాజు క్యాంపునకు చెందిన కిలో ప్రసాద్ ఆటో ఎక్కి వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీలోని రాజు క్యాంపునకు బయలు దేరారు. ఈ ముగ్గురూ మద్యం తాగారు. మోతుగూడెం పంచాయతీ, కొల్లూరు గ్రామం దాటిన తరువాత మూలమలుపు వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వై.రామవరం మండలం బొడ్డగంటి పంచాయతీ రాజుక్యాంపునకు చెందిన భరత్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు
సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు


