వసతి.. అధోగతి
పాత పాఠశాల భవనం కూల్చి వేయడంతో చీకటి పడితే నిద్రపోవడానికి జాగా లేకపోయింది. దీంతో ఇక్కడ చదువుకుంటున్న 125 మంది విద్యార్థులు కటిక చలిలో గజగజ వణుకుతూ 500 మీటర్ల దూరంలోని ఎంపీపీ పాఠశాలకు రాత్రి 10 గంటల ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లి నిద్రిస్తున్నారు. తిరిగి తెల్లవారుజామున 5 గంటలు కాగానే మళ్లీ రగ్గులు కప్పుకుని ఆదరాబాదరాగా మాతృ పాఠశాలకు వస్తున్నారు. గత నెలన్నరగా ఈ దయనీయ పరిస్థితిని విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల నిర్వహణ కోసం నిర్మించిన కొత్త భవనానికి అమర్చడానికి తీసుకొచ్చిన తలుపులు, కిటికీలు, ద్వార బంధాలన్నీ ఓ మూలన పడి ఉన్నాయి. కనీసం వాటిని కూడా అందుబాటులో ఉన్న ఐదు గదులకు అమర్చడం లేదు. ఈ భవనం నిర్మాణం కోసం ఎంతెంత నిధులు ఖర్చు చేశారనే దానిపై అప్పటి హెచ్ఎం నుంచి సమాధానం రాకుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల వెతలు తీర్చాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై ఎంఈఓ పి.శ్రీనివాసరావును వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాల భవన నిర్మాణానికి వెచ్చించిన నిధులు, ఇతరత్రా అంశాలపై అప్పటి హెచ్ఎంను వివరాలు కోరామన్నారు. దానికి అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.


