breaking news
Vedavati River
-
పరవళ్లతో పునరుజ్జీవం
సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా ఇసుక మేటలతో ఎడారిని తలపించిన వేదవతి నది ప్రస్తుతం జలకళ సంతరించుకుంది. గతేడాది ఆగస్టు 3 నుంచి ఈ ఏడాది జనవరి 9 వరకూ అంటే.. 159 రోజులపాటు కర్ణాటకలోని వాణివిలాస రిజర్వాయర్.. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)ల గేట్లను ఎత్తేశారంటే.. వేదవతి ప్రవాహ ఉధృతి ఏ స్థాయిలో సాగిందో అంచనా వేసుకోవచ్చు. వాణివిలాస రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 30.422 టీఎంసీలైతే.. ఆ రిజర్వాయర్లోకి 78.32 టీఎంసీల ప్రవాహం వచ్చింది. ఆయకట్టుకు నీళ్లందిస్తూ.. రిజర్వాయర్లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేస్తూ.. గేట్లు ఎత్తి దిగువకు 32.179 టీఎంసీలు విడుదల చేశారు. వాణివిలాస రిజర్వాయర్కు 109 కి.మీల దిగువన.. కర్ణాటక సరిహద్దుకు 1.5 కి.మీల దూరంలో అనంతపురం జిల్లాలో గుమ్మఘట్ట మండలంలో రెండు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)లోకి 2022 ఆగస్టు 3 నుంచి జనవరి 9 వరకూ 65.63 టీఎంసీల ప్రవాహం వస్తే.. ఆయకట్టుకు నీళ్లందిస్తూ, ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేస్తూ 62 టీఎంసీలను దిగువకు వదిలేశారు. ఆ జలాలు తుంగభద్ర మీదుగా శ్రీశైలం రిజర్వాయర్కు చేరాయి. అంటే.. బీటీపీ సామర్థ్యం కంటే 63 టీఎంసీలు ఎక్కువ వచ్చినట్లు స్పష్టమవుతోంది. 89 ఏళ్ల తర్వాత నిండిన ‘వాణివిలాస’ ► ఇక వేదవతిపై కర్ణాటకలో 1907లో నిర్మించిన వాణివిలాస రిజర్వాయర్ 1933, సెప్టెంబరు 2న నిండింది. ఆ తర్వాత గతేడాది ఆగస్టు 3న అంటే 89 ఏళ్ల తర్వాత నిండింది. దాంతో 50 వేల ఎకరాలకు ఖరీఫ్లో నీళ్లందించారు. ► ఇక అనంతపురం జిల్లాలో బీటీపీ ప్రాజెక్టు దశాబ్దం తర్వాత నిండింది. గతేడాది ఆగస్టు 8న 55,574 క్యూసెక్కుల ప్రవాహం డ్యామ్లోకి వచ్చింది. డ్యామ్ చరిత్రలో అంటే 1961 నుంచి ఇప్పటివరకూ గరిష్ట వరద ఇదే. ► వర్షాకాలం ముగియడంతో వరద ప్రవాహం నవంబర్లోనే తగ్గింది. ఆ తర్వాత నదిలో సహజసిద్ధ ప్రవాహం ప్రారంభమై.. ఇప్పటికీ కొనసాగుతోంది. దీన్నిబట్టి చూస్తే.. వేదవతి పునరుజ్జీవం పోసుకున్నట్లేనని పర్యావరణవేత్తలు విశ్లేషిస్తున్నారు. సబ్సర్ఫేస్ డ్యామ్లు, ఇసుక తవ్వకాల నియంత్రణతో.. ► కృష్ణా నదికి కోయినా, మలప్రభ, ఘటప్రభ, బీమా, తుంగభద్ర, మూసీ, పాలేరు, మున్నేరులతోపాటు వేదవతి కూడా ప్రధాన ఉప నది. కర్ణాటకలో చిక్మగళూరు జిల్లాలోని పశ్చిమ కనుమల్లో చంద్రవంక పర్వత శ్రేణుల్లో వేద, అవతి నదులు పురుడుపోసుకుని.. పుర వద్ద రెండు నదులు కలిసి వేదవతిగా మారి కర్ణాటకలో తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి.. రాష్ట్రంలో అనంతపురం, కర్నూల్ జిల్లాల మీదుగా 391 కి.మీలు ప్రవహించి.. బళ్లారి జిల్లా సిరిగుప్ప వద్ద తుంగభద్రలో కలుస్తుంది. ► కృష్ణా నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో 2,58,948 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించగా.. అందులో వేదవతి బేసిన్ విస్తీర్ణం 23,590 చ.కి.మీలు (9.1 శాతం). ► వేదవతి జన్మించే చంద్రవంక పర్వతాల్లోనూ.. ప్రవహించే హగరి లోయలోనూ వర్షాభావ పరిస్థితులవల్ల ప్రవాహం లేక ఇసుక మేటలతో జీవం కోల్పోయింది. దాంతో ఎగువ నుంచి వేదవతి ద్వారా కృష్ణా నదిలోకి పెద్దగా వరద ప్రవాహం చేరడంలేదు. ► గత నాలుగేళ్లుగా వేదవతి బేసిన్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. నదికి జీవం పోయాలనే లక్ష్యంతో వేదవతిపై అటు కర్ణాటక.. ఇటు రాష్ట్రంలో సబ్ సర్ఫేస్ డ్యామ్లు నిర్మించారు. ఇసుక తవ్వకాలను నియంత్రించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటం నదిలోకి వచ్చే వరదను నదీ గర్భంలోకి ఇంకింపచేయడంలో సబ్ సర్ఫేస్ డ్యామ్లు దోహదం చేశాయి. ఇసుక తవ్వకాలను నియంత్రించడంవల్ల నీటి ప్రవాహంతో వేదవతి జీవం పోసుకుంది. -
‘ఆర్డీఎస్, వేదవతి’ టెండర్లలో కుమ్మక్కు
సాక్షి, అమరావతి: రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) కుడి కాలువ పనులకు పెంచిన అంచనా వ్యయం రూ. 1,557.37 కోట్లు. ఈ టెండర్లో 4.75 శాతం ఎక్సెస్ (రూ. 1,631.34 కోట్లు)కు ఒక సంస్థ, 4.89 శాతం ఎక్సెస్ (రూ. 1,633.52 కోట్లు)కు మరో సంస్థ కోట్ చేస్తూ షెడ్యూలు దాఖలు చేశాయి. వేదవతి ఎత్తిపోతల పథకం పెంచిన అంచనా వ్యయం రూ. 1,536.28 కోట్లు. ఈ టెండర్లో రాజోలిబండలో రెండో సంస్థ 4.65 శాతం ఎక్సెస్ (రూ. 1,607.71 కోట్ల)కు, రాజోలిబండలో మొదటి సంస్థ 4.85 శాతం ఎక్సెస్ (రూ. 1,610.78 కోట్లు) కోట్ చేస్తూ షెడ్యూలు దాఖలు చేశాయి. ఈ రెండు టెండర్లలో ఆయా సంస్థలు దాఖలు చేసిన మొత్తాలను పరిశీలిస్తే ఏమనిపిస్తోంది? రెండు కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కైనట్లు స్పష్టమవుతోంది కదా! నిబంధనల ప్రకారమైతే ఈ టెండర్లను రద్దు చేయాలి. కానీ.. కాంట్రాక్టు సంస్థలను కుమ్మక్కయ్యేలా చక్రం తిప్పింది రాష్ట్ర ముఖ్యనేత కావడంతో కర్నూలు జిల్లా జలవననరుల శాఖ అధికారులు టెండర్లను రద్దు చేయలేదు. టెండర్లలో వెల్లడైన అంశాలను శనివారం కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)కి పంపారు. వేదవతి ఎత్తిపోతలను ఒక సంస్థకు, ఆర్డీఎస్ కుడి కాలువ పనులను మరో సంస్థకు కట్టబెట్టాలని సీవోటీపై ముఖ్యనేత తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. టెండర్లను పారదర్శకంగా నిర్వహించి ఉంటే కనీసం పది శాతం తక్కువ ధరలకే రెండు ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చేవారు. మొదట అంచనా వ్యయం పెంచేయడంతో ఖజానాకు రూ. 805.29 కోట్ల మేర తూట్లు పొడిచారు. ఆ తర్వాత కమీషన్ల కోసం స్వయంగా ఆ ముఖ్యనేతే కాంట్రాక్టర్లను కుమ్మక్కు చేయడం వల్ల.. భారీ ఎక్సెస్కు పనులు అప్పగించాల్సి రావడంతో రూ. 460.02 కోట్ల భారం పడింది. ఈ వ్యవహారంలో రూ. 750 కోట్లకుపైగా ముడుపులు మారనున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. విచ్చలవిడిగా అంచనాల పెంపు కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు ఎగువ నుంచి కాలువ తవ్వి నాలుగు టీఎంసీలు తరలించడం ద్వారా 40 వేల ఎకరాలకు నీళ్లందించే పనులకు రూ. 1,557.37 కోట్ల అంచనా వ్యయంతో గత నెల 31న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆర్డీఎస్ కుడి కాలువ కోసం 2,15,47,550.42 క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేపట్టాలి. 2018–19 ఎస్ఎస్ఆర్ ప్రకారం క్యూబిక్ మీటర్కు రూ. 120 చొప్పున మట్టి పనులకు రూ. 258.67 కోట్ల వ్యయం అవుతుంది. 4,40,261.88 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాలి. క్యూబిక్ మీటర్ కాంక్రీట్కు సగటున రూ.ఐదు వేలు చొప్పున రూ. 220.13 కోట్లు ఖర్చు అవుతుంది. నాలుగు దశల్లో నీటిని ఎత్తిపోయడానికి పంప్ హౌస్లు, ప్రెజర్మైన్ల కోసం రూ. 600 కోట్లకు మించి ఖర్చు కాదు. కాంట్రాక్టర్ లాభం పది శాతాన్ని కలుపుకున్నా సరే ఈ పనుల అంచనా వ్యయం రూ. 1,186.6 కోట్లకు మించదు. అంటే రూ. 370.77 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. దీనికి ఎక్సెస్ అదనం. ఇదే జిల్లాలో వేదవతి నదికి వరద వచ్చే రోజుల్లో రోజుకు 59.91 క్యూసెక్కుల చొప్పున 4.20 టీంఎసీలను ఎత్తిపోసి 80 వేల ఎకరాలకు నీళ్లందించే పనులకు రూ. 1,536.28 కోట్ల వ్యయంతో గత నెల 31న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో 1,66,17,781 క్యూబిక్ మీటర్ల మట్టి పనికి రూ. 199.41 కోట్ల వ్యయం అవుతుంది. 2,04,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు రూ. 102.25 కోట్ల వ్యయం అవుతుంది. మూడు దశల్లో ఎత్తిపోతల పనులకు రూ. 700 కోట్లకు మించి వ్యయం కాదు. కాంట్రాక్టర్ లాభం పది శాతం కలుపుకున్నా.. ఈ పనుల అంచనా వ్యయం రూ. 1,101.76 కోట్లకు మించదు. అంటే.. వేదవతి ఎత్తిపోతల అంచనా వ్యయం రూ. 434.52 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. దీనికి ఎక్సెస్ అదనం. లాలూచీ పర్వం బహిర్గతం..: వేదవతి ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాలువ పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయక ముందే ముఖ్యనేత ఇద్దరు కోటరీ కాంట్రాక్టర్లతో భేటీ అయ్యారని అధికారవర్గాలు చెబుతున్నాయి. అడిగిన మేరకు కమీషన్లు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఇద్దరు కాంట్రాక్టర్లకు మాత్రమే షెడ్యూలు దాఖలు చేయడానికి అవకాశం ఉండేలా నిబంధనలు రూపొందించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబు ఎంపిక చేసిన ఆ రెండు సంస్థలు మాత్రమే రెండు ప్రాజెక్టుల టెండర్లలో షెడ్యూలు దాఖలు చేశాయి. రెండు సంస్థలు కుమ్మక్కవడం వల్ల చెరొక ప్రాజెక్టు దక్కించుకునేలా అధిక ధరలకు కోట్ చేస్తూ షెడ్యూలు దాఖలు చేశాయి. ఈ లాలూచీపర్వం శుక్రవారం ప్రైస్ బిడ్ తెరిచినప్పుడు రట్టయింది. ఈ టెండర్లను ఆమోదిస్తే ఖజానాపై రూ.460 కోట్లకుపైగా భారం పడుతుంది. అంచనా వ్యయాలను నిక్కచ్చిగా లెక్కిస్తే రూ. 805.29 కోట్ల మేర తగ్గుతుంది. నిజాయతీగా టెండర్లను రద్దు చేస్తే ఖజానాకు కనీసం రూ. 1,265.31 కోట్ల మేర మిగులుతుంది. ముఖ్యనేత ఒత్తిళ్లకు తలొగ్గిన సీవోటీ టెండర్లను రద్దు చేస్తుందా? ఆమోదిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. -
పొంగి ప్రవహిస్తున్న వేదావతి నది
కర్ణాటకలో కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లాలో వేదావతి నది పొంగి ప్రవహిస్తోంది. వలగుండ మండలం మార్లమడికి వద్ద వేదావతి నది ఉధృతరూపం దాల్చింది. శనివారం రాత్రి నుంచి ఇక్కడ వరద నీరు వంతెనపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా నిలిచిపోయింది.