breaking news
Tommy
-
కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంట!
తిరుపతి క్రైం/తిరుపతి కల్చరల్: మానవత్వం మరిచి పెంపుడు కుక్కను రాక్షసంగా వేట కొడవళ్లతో నరికి చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే.. కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంటూ తిరుపతి పోలీసులు వెటకారంగా మాట్లాడారని తిరుపతికి చెందిన లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం తమ పెంపుడు కుక్క(టావీు)ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా నరికి చంపేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. తమతో వెటకారంగా మాట్లాడుతూ చులకనగా వ్యవహరించారని లావణ్య వాపోయారు. కుక్కను చంపిన వారికి వత్తాసు పలుకుతూ.. రూ.2 లక్షలు ఇస్తారు సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేశారని చెప్పారు. తానే రూ.2 లక్షలు ఇస్తానని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారా అని పోలీసులను లావణ్య ప్రశ్నించారు. ఈ సమావేశంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ యానిమల్స్ చైర్మన్ దివ్యారెడ్డి పాల్గొన్నారు.ఇద్దరు నిందితుల అరెస్టు..టామీ హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను తిరుపతి ఈస్ట్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఈస్ట్ పోలీస్స్టేషన్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు.. శంకర్ కాలనీకి చెందిన లావణ్య ఈనెల 6న బయటకు వెళ్తూ తన కుమార్తె గ్రీష్మతో పాటు టామీని స్కావెంజర్స్ కాలనీలోని తన మామయ్య ఆనందయ్య ఇంట్లో వదిలి వెళ్లారు. అదేరోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో కుమార్తె గ్రీష్మ.. లావణ్యకు ఫోన్ చేసి తాతయ్య ఎదురింట్లో ఉన్న శివకుమార్, సాయికుమార్ టామీని చంపేశారని తెలిపింది. శివకుమార్ ఇంటి వైపు టామీ చూసి అరుస్తుండడంతో.. సాయికుమార్ రాయితో కొట్టాడని.. ఆ వెంటనే శివకుమార్ కత్తితో టామీని నరికి చంపేశాడు. లావణ్య ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. -
'టామీ'కి అంతిమ యాత్ర
కర్నూలు, ఆళ్లగడ్డ: పట్టణానికి చెందిన ఆవుల భాస్కర్రెడ్డి ఇంట్లో ఉండే శునకం (టామీ) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందింది. దానిపై ప్రేమతో ఘనంగా అంతిమయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ దృశ్యాన్ని పట్టణవాసులు ఆసక్తిగా తిలకించారు. -
సంధ్య అంటే 'టామీ'కి ఎంత ప్రేమో!
-
ఆ టోపీనేను ‘టామీ’ కోసం కొన్నా!
‘‘అప్పుల అప్పారావులు, లేడీస్ టైలర్లు, మిస్టర్ పెళ్లాంలు.. సమాజంలో ఉన్నవాళ్లే. ఇవన్నీ కామన్ మ్యాన్ పాత్రలే కాబట్టి, నేను అందరికీ దగ్గరయ్యాను. అందరూ ఎంజాయ్ చేసే చిత్రాలు చేస్తున్నాను కాబట్టి, వన్నీ ‘సర్వీస్ ఓరియంటెడ్ మూవీస్’ అంటాన్నేను. ‘టామీ’ కూడా ఆ జాబితాలో చేరుతుంది’’ అంటున్నారు డా. రాజేంద్రప్రసాద్. ఆయన హీరోగా రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో హరిరామ జోగయ్య, బోనం చినబాబు నిర్మించిన ‘టామీ’ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ చెప్పిన విశేషాలు... ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’లో గజరాజు కాంబినేషన్లో.. ఇప్పుడేమో కుక్కపిల్లతో నటించారు. ఎలా అనిపిస్తోంది? చిన్నపిల్లలతో, మూగజీవాలతో నటించడం అనేది ప్రాప్తం అనిపిస్తోంది. చిన్న పిల్లలకు, పెంపుడు జంతువులకు ఏమీ తెలియదు. అందుకే ఈ కాంబినేషన్స్ను చాలా ఎంజాయ్ చేస్తాను. పైగా, మూగజీవాల కాంబినేషన్లో నటించే అవకాశం ఎక్కువగా నాకే దక్కింది. అందుకే ‘మనమేమన్నా గత జన్మలో జంతువా? అందుకే ఈ జన్మలో మూగజీవాలతో ఇలా అనుబంధం ఏర్పడిందా?’ అని అప్పుడప్పుడూ సరదాగా అనుకుంటాను. సినిమాలో టామీతో మీకు మంచి అనుబంధం ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా ఆ కుక్కపిల్లపై మీకు అంతే ప్రేమ ఉండేదా? కచ్చితంగా ఉండేది. ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ అప్పుడు 40 రోజులు షూటింగ్ చేశాం. ఆ 40 రోజుల్లోనే గజరాజు మీద మమకారం ఏర్పడింది. ఇప్పుడు టామీతో 25 రోజులు షూటింగ్ చేశాం. సినిమా పూర్తయ్యేసరికి, అది నా మీద పడి నా మూతి నాకేసేంతగా దగ్గరైపోయింది. దాన్ని ఏదో జన్మలోనో కని, పెంచకుండా వదిలేశానేమో.. అందుకే, ఇప్పుడు దగ్గరైంది అనిపించింది. టోటల్గా ‘టామీ’ చిత్రం నటుడిగా కన్నా ఒక వ్యక్తిగా నాకో మంచి అనుభవం. ‘టామీ’ చూశాక చాలామంది తమ ఇంట్లో కుక్కపిల్లల్ని తెచ్చిపెట్టుకున్నారని తెలిసి, ఆనందపడ్డాను. సినిమా చూసినవాళ్లందరూ ‘మంచి సినిమా చూశాం. మనసు నిండిపోయిం’ దంటున్నారు. అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? మొత్తం మీద ‘టామీ’ని బాగా ఇష్టపడినట్లున్నారు? చాలా. ఈ చిత్రం చేస్తున్నప్పుడు ఓ పని మీద అమెరికా వెళ్లాను. మామూలుగా విదేశాలు వెళ్లినప్పుడు అక్కడ దొరికే కొత్త వస్తువులేమైనా కొంటుంటాను. కానీ, ఈసారి అలా చేయలేదు. ఓ షాపింగ్ మాల్కి వెళ్లా, అక్కడ ఉన్న ఒక చిన్న షాప్లో టోపీల మీద పేర్లు వేస్తున్నారు. అప్పటికి రాత్రి తొమ్మిదయ్యింది. మరో గంటలో కొట్టు కట్టేస్తారనగా, నాకు నాలుగు టోపీల మీద పేర్లు వేసివ్వమన్నాను. ‘టామీ డెరైక్టర్’, ‘టామీ ప్రొడ్యూసర్’.. ఇలా కొన్ని టోపీలు తయారు చేయించాలన్నది నా ఫీలింగ్. ఆ రెండు టోపీలు రెడీ అయిన తర్వాత ‘టామీ హీరో’ అని పేరు వేయమన్నాను. ఆ పేరు వేసేటప్పుడు నాలుగుసార్లు సూది విరిగిపోయింది. ‘ఇక నా వల్ల కాదు’ అని అతను చేతులెత్తేస్తే, అతని కూతురు చేసి, ఇచ్చింది. నేనా టోపీలు తీసుకొచ్చి, దర్శక, నిర్మాతలకు, ఇతరులకు పెట్టాను. ‘హీరో’ అని ఉన్న టోపీని నాకు పెట్టబోతుంటే, వద్దంటూ, దాన్ని మా కుక్కపిల్ల టామీకి పెట్టాను. దాన్నిబట్టి దాంతో నా అనుబంధం ఎలాంటిదో ఊహించవచ్చు. టామీ బాగా నటించింది కదా... మిమ్మల్ని డామినేట్ చేసినట్లు అనిపించిందా? టామీకి దెబ్బ తగిలినప్పుడు అదీ, నేనూ ఆస్పత్రికి పరుగెత్తికెళతాం. క్లోజప్ షాట్స్లో మేం ఓ లుక్ ఇవ్వాలి. ఆ క్లోజప్లో దానికి ఎక్కువ మార్కులు పడతాయేమో అని కడుపు మండిపోయింది (నవ్వుతూ). దాని మీద విపరీతమైన ప్రేమతో కూడిన కుళ్లు ఏర్పడింది. ఈ సినిమా చేసిన 25 రోజులూ 25 సెకన్లలా గడిచిపోయాయనిపించింది. ‘జులాయి’ తర్వాత మళ్లీ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సన్నాఫ్ సత్యమూర్తి’ చేయడం? మామూలుగా కమర్షియల్ సినిమాలను పిల్లలు పెద్దగా ఇష్టపడరు. కానీ, ‘జులాయి’ చిత్రాన్ని పిల్లలు కూడా చూసేలా త్రివిక్రమ్ తీశారు. మరీ.. ముఖ్యంగా నా పాత్రను పిల్లలు బాగా ఇష్టపడ్డారు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ని త్రివిక్రమ్ అంతకు మూడు, నాలుగు రెట్లు బాగా తీశారు. బన్నీకి నేనంటే చాలా ఇష్టం. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇటీవలే నా పాత్రకు డబ్బింగ్ చెప్పా. సూపర్ మూవీ. -
‘టామీ' లాంటి చిత్రాలు రావాలి!
- దాసరి నారాయణరావు ‘‘నిర్మాత హరిరామజోగయ్యగారు మంచి అభిరుచితో ‘టామీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాలకు మౌత్ పబ్లిసిటీ చాలా ముఖ్యం. ఇలాంటివి ఇంకా రావాలని కోరుకుంటున్నా’’ అని ప్రముఖ దర్శక - నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, సీత, ఎల్బీ శ్రీరామ్, భూగీ అనే కుక్క ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘టామీ'. రాజా వన్నెంరెడ్డి దర్శకుడు. చక్రి స్వరాలందించారు. బాబు పిక్చర్స్ పతాకంపై చేగొండి హరిరామజోగయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి నారాయణరావు ఆడియో సీడీని ఆవిష్కరించారు. రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ ‘‘30 రోజుల్లో సినిమాళ పూర్తి చేశాం. రాజేంద్రప్రసాద్ ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. ఆయన డెడికేషన్, కమిట్మెంట్ అలాంటిది’’ అన్నారు. ప్రివ్యూను మార్చి 1న వైజాగ్లో ప్రదర్శిస్తామనీ, లాభాన్ని కుక్కల క్షేమం కోసం వినియోగిస్తామని నిర్మాత తెలిపారు. రాజేంద్రప్రసాద్, అమల, కోడి రామకృష్ణ, శివాజీ, తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. -
వైచిత్రి
కథ - కూర చిదంబరం అది, ఓ మేలు జాతి కుక్క. ఆ జాతిని ‘పామినేరియన్’ అంటారు. దాని ఒళ్లంతా తెల్లని పొడవైన బొచ్చు. చిన్న ఆకారం. భూమి నుండి తొమ్మిది అంగుళాల ఎత్తు ఉంటుంది. నల్లని కళ్లు. కళ్లని కప్పేసే తెల్లని జుట్టు. దాని యజమానులు దాన్ని ప్రేమగా, ‘టామీ’ అని పిలుస్తారు. మూడేళ్లక్రితం గోపీనాథ్కు ఆయన సీనియర్ టామీని ‘బహుమతి’గా ఇచ్చాడు. బహుమతి అనటం కంటే ‘అంటగట్టబడింది’ అనడం సమంజసం. టామీని ఆ సీనియర్, రోజుల పసిగుడ్డుగా ఉన్నప్పుడు, దాని కళ్లింకా పూర్తిగా తెరుచుకోనప్పుడే, వాళ్ల స్నేహితుడి దగ్గర తెచ్చుకున్నాడు. అది వచ్చిన వేళావిశేషం ఏమిటోగాని 4-5 రోజుల్లోనే ఆయనకు ఏనాటి నుండో కోరుకుంటున్న ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. ఎకాఎకిన పిల్లామేకా (భార్యా భర్తలు మాత్రమే) ఆ ఊరికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆయన తన సబార్డినేట్ అయిన గోపీనాథ్ను పిలిచి టామీ సంరక్షణా భారం అప్పగించాడు. అప్పగించడమే కాకుండా అప్పుడప్పుడు టామీ యోగ క్షేమాలు అడుగుతూండేవాడు. అందువల్ల కొత్తలో, గోపీనాథ్ టామీని వదుల్చుకోలేక పోయాడు. తరువాతి రోజుల్లో అలవాటు అయిపోయింది. గోపీనాథ్ దంపతులు ఓ ‘కాంప్లెక్సు’లో అయిదవ అంతస్తులో ఉంటారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కనుక, ఆఫీసుకు వెళ్తూ ఫ్లాట్కు తాళంవేసి టామీని ఆ కాంప్లెక్స్ వాచ్మన్ నర్సింహ దగ్గర వదిలి వెళతారు. పగలంతా, వారంలో అయిదు రోజులు నర్సింహ దంపతులు టామీకి యజమానులు. పెడిగ్రీ వారు తయారుచేసే ఆహారం దానికి బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం వేళకు నర్సింహ భార్య, తాము వండుకున్న అన్నం, పావులీటర్ పాలు, ఓ గుడ్డూ టామీ పళ్లెంలో వేస్తుంది. ఆడుతూ పాడుతూ దాని ఇష్టం వచ్చినపుడు టామీ అన్నం ప్లేటు ఖాళీ చేస్తుంది. నర్సింహ లాగే అదీ గేటు మీద ఓ కన్నువేసి ఉంచుతుంది. సందర్శకులెవరైనా వచ్చి అవతలివైపు నుండి గేటు తట్టితే, గేటు ఇవతల టామీ మొరుగుతుంది. అంటే నర్సింహను పిలవడం అన్నమాట. ఫ్లాట్ ఓనర్స్ వస్తే చడీచప్పుడు చేయదు. ఆ ఫ్లాట్లోని స్కూలు పిల్లలు ఫ్లాట్స్కు తిరిగివస్తే, దాని సంరంభం ఇంతా, అంతా కాదు. పిల్లల చుట్టూ గెంతుతుంది. త్వరగా పాలు తాగివచ్చేయండి. మనందరం ‘టాట్-లాట్’లో ఆడుకుందాం అని దాని అరుపులకు అర్థం. వాళ్లూ, టామీని జంతువులా చూడరు. టామీ పిల్లల్తో బాటు ఊయల ఊగుతుంది. ‘జారుడుబండ’ జారుతుంది. టామీ గేటు దాటి బయటకు అస్సలు వెళ్లదు. ఒకట్రెండు సార్లు ఉత్సకతతో రోడ్డుపైన ఏముందో చూడాలని ప్రయత్నించి, కార్లూ స్కూటర్లూ, పాదచారుల మధ్య ‘చావు తప్పి కన్ను లొట్ట పోయినంత’ పనయింది దానికి. సాయంత్రం చీకటిపడి, పిల్లలు వాళ్ల వాళ్ల ఫ్లాటుల్లోకి వెళ్లాక, టామీ కాస్త దిగులుతో గేటు వైపే దృష్టి ఉంచుతుంది. ఆ కాంప్లెక్సులో ఉన్న పది కార్లలో గోపీనాథ్ కారు శబ్దం దానికి తెలుసు. గేటు అవతల హారన్ వినపడగానే, తోకాడిస్తూ, గేటు తియ్యమని నర్సింహను తొందర పెడుతుంది. గోపీనాథ్ టామీని ఎత్తుకున్నాక, ఇద్దరూ ఆ రాత్రికి డిన్నర్ సరంజామా, షాపింగ్ వస్తువులు పట్టుకుని ఐదవ అంతస్తు చేరుతారు. గోపీనాథ్ దాన్ని ముద్దు చేస్తూ, సంభాషిస్తాడు. ‘‘ఏమే అన్నం గుడ్డూ తిన్నావా? ఆడుకున్నావా? నర్సింహ ఏమన్నాడు’’ ఇలా ఉంటాయి ఆయన ప్రశ్నలు. లిఫ్టు అయిదవ అంతస్తు చేరగానే వాళ్ళ ఫ్లాట్ డోరు ముందు ఆయన వళ్ళోంచి కిందికి దూకి, తాళం తీసేవరకు వాళ్ళ కాళ్ళకు తన వీపు రాచుకుంటూ తన ప్రేమను ప్రకటిస్తుంది. డోరు తీయగానే ఒక్కసారి ఫ్లాట్ అంతా సర్వేచేసి తనకు కేటాయించబడ్డ, మెత్తని, కాళ్ళు తుడుచుకునే కార్పెటు మీద, తన వెనక కాళ్ళ మీద కూర్చుంటుంది. గోపీనాథ్ స్నానం కానించుకుని ల్యాప్టాప్ తెరచి తన పనిలో తాను మునిగిపోతాడు. ఆమె డిన్నర్ తయారీలో ‘బిజీ’ అవుతుంది. ఆయన కంప్యూటర్ ముందు కూర్చున్నంత సేపూ టామీ ఆయన ఒళ్ళో కూర్చుంటుంది. ఇంతలో గోపీనాథ్ భార్య డిన్నరు రెడీ చేస్తుంది. టేబుల్పైన దంపతులు, కింద వాళ్ళ కాళ్ళ మధ్య టామీ. గోపీనాథ్ దంపతులు టామీని ఓ పసిపిల్లగా భావిస్తారు. నర్సింహ దగ్గర వదిలి వెళ్తుంటే,‘క్రెష్’లో ఉంచి వెళ్తున్నట్లుగా బాధపడతారు. టామీ సంరక్షణకు నర్సింహ దంపతులకు కొంత డబ్బు ముడుతుంది. ఈ నలుగురికీ టామీ పైనా, టామీకి ఈ నలుగురిపైనా ఎంతో ప్రేమ. ‘వాచ్మెన్’ నర్సింహ ఆరేళ్ళ నుండీ నమ్మకంగా అక్కడే పనిచేస్తున్నాడు. మహబూబ్నగర్ జిల్లా. కాంప్లెక్సు నిర్మాణంలో రోజు కూలీగా చేరి, బిల్డర్ నమ్మకాన్ని గెలుచుకుని వాచ్మెన్ అయ్యాడు. రోజు కూలీగా చేరినప్పుడు బ్రహ్మచారి. నాలుగేళ్ళ క్రితం పెళ్ళయింది. వాళ్ళకింకా సంతానం కలుగలేదు. నర్సింహ, ఆయన భార్యా ఆ కాంప్లెక్సులో ‘గెరాజు’లోని చిన్న గదిలో ఉంటారు. ఒకే ఒక్క గది. అయినా సౌకర్యంగా ఉంటుంది. గది గోడలకు షెల్పులు వేయడం వల్ల సామానంతా షెల్పుల్లో చేరి గది విశాలంగా కనిపిస్తుంది. కట్టుబట్టల్తో వచ్చిన నర్సింహకు నేడు గ్యాసు కనెక్షను, ఓ డబుల్కాటు, టీవీ, బయట డ్యూటీ చేస్తున్నప్పుడు ‘బోర్’ కొట్టకుండా చిన్న రేడియో, మిక్సీ, వంటపాత్రలు వగైరా సమకూరాయి. ఇవన్నీ ఫ్లాటుల్లో ఉండేవాళ్ళు ఖాళీ చేసేటప్పుడు నర్సింహకు వదిలి వెళ్ళిన వస్తువులు! మరో ఉడెన్ మంచం, అద్దం బిగించిన డ్రెస్సింగ్ టేబులుకు లోన జాగా లేక బయట గేరేజ్లోనే ఉంచాడు. ఎవరైనా గెస్టులు వస్తే ఆ మంచాన్ని వాడుతారు. నర్సింహకు వాళ్ళ ఊళ్ళో సెంటు పొలం లేదు. ఓ పాత ఇల్లు ఉంటే అన్నకు ఉదారంగా తన వాటా కూడా వదిలి వచ్చానని చెబుతాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కాలం చేశారట. నాలుగో తరగతి చదివాడు. తెలుగు అక్షరాలు చదవడం రాయడం వచ్చు. ఇంగ్లిషు అక్షరాల్ని కూడబలుక్కుని చదువుతాడు. ఎవరైనా వస్తే ‘ఇంటర్కాం’లో సంబంధిత ఫ్లాట్ యజమానితో మాట్లాడి, వాళ్ళు ‘‘సరే! పంపించు’’ అంటే ‘విజిటర్స్ బుక్’లో వివరాలు రాసుకుని పంపిస్తాడు. పొద్దుటే లేచి, కాంప్లెక్సు కారిడార్లూ, గేరేజ్ ఊడుస్తాడు. పంపు వేసి బోరులోంచి నీటిని పైకి ఎక్కిస్తాడు. గోపీనాథ్ లాంటి ‘ఓనర్’ల కార్లు తుడిచి శుభ్రం చేస్తాడు. ఇది అదనపు ఆదాయం. లిఫ్టులోనో, ఫ్యూజుల్లోనో ఏదైనా సమస్యవస్తే, ఆయా మెకానిక్లను రప్పించడం, కరెంటుగానిపోతే ‘జనరేటర్’ ఆన్ చేయడం లాంటివి చేస్తాడు. న్యూస్ పేపరు వాళ్ళు, పాల ప్యాకెట్ల వాళ్ళు, ఆ కాంప్లెక్సులో పనిచేసే పనిమనుషుల పైనా ఓ కన్నేసి ఉంచుతాడు. ఒక్కోసారి నర్సింహ చలాయించే ఆధిపత్యం గమనిస్తే కాంప్లెక్సు అంతా ఈ నర్సింహదే కాబోలు అనిపిస్తుంది. నర్సింహ భార్య గేటు ముందు ఊడ్చి, ముగ్గువేస్తుంది. ఆమెకు ముగ్గు బహు సొగసుగా వేయటం వచ్చు. కాంప్లెక్సులోని నాలుగైదు ఫ్లాట్లలో ‘పాచి’ పని చేస్తుంది. వాళ్ళు ఇచ్చే అన్నం కూర చారుల వల్ల ఒక్కోరోజు నర్సింహ ఇంట్లో వండాల్సిన అవసరమే ఉండదు. ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర దాకా ఆ కాంప్లెక్సులో హడావుడి ఉంటుంది. ఆ తరువాత నర్సింహ భోం చేసి ఓ కునుకు తీస్తాడు. రాత్రిళ్లు ఒక్కోసారి నాలుగైదుసార్లు ఆయన లేచి గేటు తీయాల్సి వస్తుంది. అందుకని ఆ గంటా గంటన్నర కునుకు అత్యవసరం. ఆయన కునుకు తీస్తున్నంత సేపూ నర్సింహ భార్య గేటు మీద ఓ కన్నేసి ఉంచుతుంది. సాయంత్రం నాలుగు వరకు కాంప్లెక్సు స్తబ్దుగా ఉంటుంది. తిరిగి స్కూలు పిల్లల రాకతో ‘టాట్-లాట్’లో ఆటలు, పెద్దల ‘ఈవినింగ్ వాక్’లతో కాంప్లెక్సు సందడిగా మారుతుంది. చీకటవగానే గేరేజ్లో, కారిడార్లో లైట్లు వేస్తాడు. పదకొండు గంటలకు నిద్రపోతాడు. ఈ దినచర్య కాకుండా నెలనెలా ‘మెయింటెనెన్స్’ వసూలు చేయడం, కాంప్లెక్సు సొసైటీ ప్రెసిడెంట్కు లెక్క అప్పచెప్పడం, పండుగలప్పుడు కారిడార్లని, గేరేజ్ని కడగటం, అప్పుడప్పుడు ఓవర్హెడ్ నీళ్ళట్యాంకులు శుభ్రపరచడం వంటివి చేస్తూ, ఎవరి వద్దనుండీ సొసైటీ ప్రెసిడెంటుకు కంప్లయింట్ రాకుండా చూసుకుంటాడు నర్సింహ. ఒకరకంగా, కూలీనాలీ చేసుకునే నర్సింహ జీవితంలో కాంప్లెక్సు ఉద్యోగం ఒక ‘మహర్దశ’. టామీ ‘ఎద’కు వచ్చింది. ఆహారం, నిద్రలాగా ‘అదీ’ టామీ దేహావసరం. ఇదివరలో కాంపౌండు గోడ బయట ఏ మగ కుక్క అరుపువిన్నా, టామీ జవాబుగా అరిచేది. అది ఓ పలకరింపులా కాకుండా, గద్దింపులా ఉండేది. ఇప్పుడు మాత్రం ఊరకుక్కల ‘పిలుపు’లకు టామీ గోడ ఇవతలి నుండి జవాబిస్తోంది. ఆ జవాబు ‘గద్దింపు’ల్లా కాక ‘పలకరింపు’లా ఉంటోంది. టామీ అలా ఎందుకు అరుస్తోందో నర్సింహకు అర్థం అయింది. ఆయనకు కుక్కల గురించి వివరంగా తెలియకున్నా కొంత తెలుసు. ‘పామినేరియన్’ ఓ ప్రత్యేకమైన ‘బ్రీడు’. వాటిని ఆ జాతి కుక్కలతోనే దాటించాలి. ఒక ట్రెండు సార్లు గోపీనాథ్కి సంజ్ఞా పూర్వకంగా చెప్పి చూశాడు నర్సింహ. ఆ జాతి మగకుక్క ఎక్కడ ఉందో తెలుసుకోవడం, జతకట్టించడం లేదా వెటర్నరీ డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళడం అయ్యే పనికాదు. ఎవరి ఉద్యోగ బాధ్యతలు వారికున్నాయి. ఆ బాధ్యతల మధ్య టామీ అవసరం అంత ప్రాముఖ్యమైనదిగా కనిపించలేదు. టామీ అరుస్తోంది. ఇవతలివైపు నుండి కాంపౌండ్ గోడకు ముందు కాళ్లానించి, వెనక కాళ్ళపై నుంచుని గోడ అవతలి కుక్కతో సంభాషిస్తోంది. అది గమనించిన నర్సింహ దాన్ని గొలుసుతో కట్టేశాడు. మామూలుగా గొలుసుతో కట్టేయాల్సిన అవసరం ఉండేది కాదు. అది ఎక్కుడున్నా ‘టామీ’ అని పిలువగానే దగ్గరకు వచ్చేది. కానీ దాని అవసరం దాన్ని నిలవనీయడంలేదు. టామీ అసహనంగా గొలుసుకు అటూ, ఇటూ తిరుగుతోంది. అది నోటితో మన భాషలో చెప్పలేదు. కాని దాని చేతల ద్వారా వ్యక్తపరిచే సంతోషం, కోపం, ఉక్రోషం, ఉద్రేకం, బాత్రూం అవసరం లాంటివి నర్సింహ అర్థం చేసుకోగలడు. అది గమనించాడు. గొలుసు విప్పదీశాడు. టామీ ఎంతో ‘రిలీఫ్’ ఫీలయ్యింది. పరుగు పెట్టింది. బాత్రూం వేపుకాదు. ఒక్క గెంతుతో లాఘవంగా కాంపౌండు గోడ అవతలివైపు దూకింది. గోడ అవతల ‘ప్రేమ పిలుపు’ ఇస్తోన్న మరో మగకుక్కతో కలిసి ఎటో పరుగెత్తింది. నర్సింహ సెల్ఫోన్కు ఆయన భార్య ఊరి నుండి ‘కాల్’ వచ్చింది. ఇద్దరివీ దగ్గరి దగ్గరి ఊళ్ళే! ఆ కాల్ సారాంశం: ఫలానా రోజు భార్య దగ్గరి బంధువు ఇంట్లో పెళ్ళి, తప్పక రావాలి. నర్సింహకు వెళ్ళాలనే ఉంది. ఊరు వెళ్ళక మూడేళ్ళకు పైనే అయింది. పెళ్ళికి ఓ రోజు ముందు బయల్దేరి, దోవలో తగిలే అత్తారి ఊళ్ళో ఆ రాత్రి తనూ, భార్యా గడిపి, తెల్లారాక తన ఊరువెళ్ళి, బంధువుల్ని కలిసి, మళ్లీ భార్య ఊరు వచ్చి పెళ్ళి భోజనం, విందూ చూసుకుని అదే రాత్రిగానీ, తెల్లవారిగానీ రావాలని నర్సింహ ఆలోచన. భార్య కూడా సరేనంది. సిటీ జీవితం అంతా ముచ్చట్లు ముచ్చట్లుగా తమ వాళ్ళింట్లో చెప్పాలి. ఏవైనా ఫంక్షన్లప్పుడు కాంప్లెక్సు వాళ్ళిచ్చిన సిల్కు చీరల్లాంటి ఖరీదైన, నాజూకు చీరలు ఊళ్ళో వారందరూ తన వంటి మీద చూడాలి. ఇదీ ఆమె ఆలోచన! నర్సింహులు కాంప్లెక్సు ప్రెసిడెంటును కలిశాడు. మూడు రోజులు సెలవు అడిగాడు. వాచ్మెన్ ఉద్యోగం. పొద్దున్నే నీళ్ళు చూసుకోవాలి. కరెంటుపోతే జనరేటర్ వేయాలి. కొత్త వారినెవర్నీ వివరాలు తెలియకుండా పైకి పంపరాదు. ఇవన్నీ ముఖ్యమైన పనులు. ఇవి కాకుండా, ఏవేవో అనుకోని పనులు తగుల్తుంటాయి. ‘ససేమిరా’ అన్నాడు కాంప్లెక్సు ప్రెసిడెంటు.దానికి తక్షణ జవాబుగా నర్సింహ, ‘‘అయ్యా ఇన్నేళ్ళు పని చేశాక కూడా మూడు రోజులు సెలవు దొరక్కపోతే ఎలా? ఏవో అవసరాలుంటాయి. అవసరాలకు వెళ్ళలేని ఈ ఉద్యోగం చేసి ఏం లాభం? మరోటి చూసుకుంటా’’ అన్నాడు. ప్రెసిడెంటుకు బుర్ర తిరిగిపోయింది. ఆరేళ్ళుగా, నమ్మకంగా నర్సింహ పనిచేస్తున్నాడు. మరొకడ్ని చూసుకోవడం అంటే మాటలా! మరొకడ్ని చూసుకున్నాక, ఆ వచ్చేవాడు ఇంత నమ్మకంగా పనిచేయకపోతే! ఇలాంటి పెళ్లి, చావు, అవసరాలు ఆ వచ్చే వాడికైనా తప్పవు. సెక్యూరిటీ సర్వీసెస్ వారు బాగానే ఉంటారు. కాని రెట్టింపు జీతం. ప్రస్తుతం వసూలు చేస్తున్న మెయింటెనెన్సు చాలదు. అర్జంటుగా ఆయన సెక్రటరీని సంప్రదించాడు. మూడు రోజులు ఎలాగోలా సర్దుకునేందుకు ఒప్పందం కుదిరింది. ప్రయాణం ఖర్చులు, పెళ్ళి ఖర్చులకు గాను నర్సింహకు ఐదువందలు అడ్వాన్సు ముట్టింది. లంచ్ అవర్లో తన సెల్ఫోన్లో ‘మిస్డ్కాల్స్’ చూసుకున్నాడు గోపీనాథ్. అది తన ఊరి నుండి తమ్ముడి నుంచి వచ్చింది. 5-6 సార్లు ప్రయత్నించినట్లుంది. వెంటనే తమ్ముడికి ఫోను కలిపాడు. తండ్రి పోయాడనీ, ఇంటికి పెద్ద కొడుకుగా తను అర్జంటుగా రావాలనీ, వచ్చాకే శవసంస్కారం మొదలవుతుందనీ, తల్లి బాగా ఏడుస్తోందనీ చెప్పాడు తమ్ముడు. గోపీనాథ్కు దిగులేసింది. కొద్దిరోజులుగా తండ్రి ఒంట్లో బావుండటం లేదు. తల్లిదండ్రుల్ని కనిపెట్టుకుని ఉంటున్న తమ్ముడు వారం రోజుల క్రితమే ఫోను చేశాడు. అవసరమైన మొత్తం తమ్ముడికి మెయిల్ ట్రాన్స్ఫర్ చేసి, తనకు రావటం కుదరడంలేదనీ, జిల్లా వైద్యశాలకు తీసుకెళ్లి మంచి వైద్యం చేయించమనీ చెప్పాడు. అప్పుడప్పుడూ అమ్మతో మాట్లాడుతూనే ఉన్నాడు. ‘నాన్నకు ఏమీ కాదని, తప్పకుండా కోలుకుంటాడని’ ధైర్యం చెబుతూనే ఉన్నాడు. బాస్ని చూడాలని మెసేజ్ పంపితే, గంట తరువాత అనుమతి వచ్చింది. బాస్ సెలవు ఇవ్వనన్నాడు. పైగా ‘నీది బాధ్యతాయుతమైన ఉద్యోగం. రెండు ప్రాజెక్టులు, సుమారు ఇరవైమంది పనిచేస్తున్న టీముకు లీడర్వి నువ్వు. ఎట్లా శాంక్షన్ చేస్తాననుకున్నావు? అనే ఎదురు ప్రశ్న వేశాడు. గోపీనాథ్ ఊరు సిటీకి ఎంతో దూరంలేదు. రెండున్నర గంటల ప్రయాణం. వెళ్ళి, కార్యక్రమాన్ని ముగించుకుని ఏ రాత్రికైనా సిటీకి చేరి తెల్లారి ఆఫీసుకు వస్తానన్నాడు. అదీ కుదరదన్నాడు బాసు. గోపీనాథ్ మరేదో చెప్పబోతూంటే ‘‘డోన్ట్ బాదర్ మీ విత్ దిస్ ఇష్యూ. యు కెన్ గో’’ అన్నాడు. నీరసం ఆవహించగా, సీటు మీద కూలబడి భార్యకు ఫోను కలిపాడు గోపీనాథ్. ఆమె కూడా, నీది బాధ్యతాయుత ఉద్యోగం అంది. రెండు నెలల్లో ప్రమోషన్ వచ్చే అవకాశాన్ని పాడుచేసుకోవద్దంది. ఈ సమయంలో బాసు మాట ఖాతరు చేయకపోతే ‘ఇన్సబార్డినేషన్’ (పై అధికారుల ఎడ చూపాల్సిన గౌరవం చూపకపోవడం) అని రాసి పర్సనల్ రికార్డు పాడు చేస్తాడంది. ఒకవేళ గోపీనాథ్ ఉద్యోగం కాని ఊడితే, తన ఒక్క శాలరీతో, కారు వాయిదా, ఇంటి ఇన్స్టాల్మెంటు, ఫ్రిజ్, ఏసీ, సోఫాసెట్టు వాయిదాలకు సరిపోదు అంది. ‘మనసుతో కాకుండా మెదడుతో ఆలోచించ’మంది. ‘సెంటిమెంటుకు పోయి బతుకును బజార్న పడేసుకుంటానా’ అన్న సందేహం కలిగింది గోపీనాథ్కు. దీనంగా తన వేపే చూస్తున్న అమ్మ ముఖం ఊహల్లోకి వచ్చింది. ‘నవమాసాలు మోసి కన్న తనకూ, చేయిపట్టి ఆడించి తన కనీసావసరాలు కూడా త్యాగం చేసి పెంచిన నాన్నకూ ఇచ్చే గౌరవం ఇదా’ అని నిలదీసినట్లనిపించింది. గోపీనాథ్ మెదడు మొద్దుబారిపోయింది. కాస్సేపటికి ఒక నిర్ణయానికి వచ్చాడు. బాధనో, రిలీఫో తెలియని ఫీలింగు ఆయన్ని ఆవహిస్తుంటే, తమ్ముడికి ఫోను కలిపాడు. తాను రాలేకపోతున్నాననీ, శవసంస్కారం నీవే జరిపించమనీ, అమ్మను ఏమీ అనుకోవద్దనీ, కార్యక్రమ నిర్వహణకు కావల్సిన డబ్బును మెయిల్ ట్రాన్స్ఫర్ చేస్తాననీ చెప్పి... తమ్ముడి నుండి జవాబు రాకముందే ఫోన్ పెట్టేశాడు. -
‘టామి’అందరికీ నచ్చుతుంది
డా. రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో బాబూ పిక్చర్స్ పతాకంపై సీనియర్ నిర్మాత, రాజకీయవేత్త చేగొండి హరిబాబు, బోనం చినబాబు నిర్మించిన చిత్రం ‘టామి’. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కినేని అమలకు ఈ చిత్రం ప్రివ్యూ చూపించారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ - ‘‘పెంపుడు కుక్కలు తమ యజమానుల పట్ల కనబర్చే విశ్వాసం ఎలాంటిదో చూపించే చిత్రం ఇది. పిల్లలు, పెద్దలూ అందరూ చూడాల్సిన చిత్రం. మూగజీవాల పట్ల మనుషులు చూపించాల్సిన ఆదరణ గురించి చెప్పిన ఈ చిత్రానికి ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇస్తే బాగుంటుంది. ఈ విషయాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలను కుంటున్నాను’’ అని చెప్పారు. ఈ చిత్రంలో భూగీ అనే శిక్షణ పొందిన శునకం నటించిందనీ, త్వరలోనే ప్రచార చిత్రాలను విడుదల చేయాలనుకుంటున్నామని దర్శక, నిర్మాతలు తెలిపారు. -
రాజేంద్రప్రసాద్ 'టామీ' స్టిల్స్
-
పాతికేళ్ల తర్వాత...
రాజేంద్రప్రసాద్, సీత నటించిన ‘చెవిలో పువ్వు’, ‘ముత్యమంత ముద్దు’ చిత్రాలు అప్పట్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ జంటకు మంచి పేరొచ్చింది. మళ్లీ పాతికేళ్ల తర్వాత ఈ జోడీ ‘టామీ’ సినిమా కోసం కలిశారు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో చేగొండి హరిబాబు, బోనం చినబాబు నిర్మిస్తోన్న ‘టామీ’ చిత్రం కేవలం నెల రోజుల్లో నర్సాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చేగొండి హరిబాబు మాట్లాడుతూ -‘‘కుక్కకూ, యజమానికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఇందులో ఎంతో బాగా ఆవిష్కరించాం. మా టామీ అందర్నీ నవ్వించడంతో పాటు, ఆఖరిగా ఆలోచింపజేస్తుంది. తదుపది మేం ‘టామీ-2’ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందు కోసం ఓ కుక్కకు శిక్షణ ఇప్పిస్తున్నాం’’ అని తెలిపారు. కుక్క చేసే విన్యాసాలు ఈ చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: మోహన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబు బండారు. -
రాజేంద్రప్రసాద్ 'టామీ' స్టిల్స్
-
టామీతో అనుబంధం
కుక్కకూ, యజమానికీ మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘టామీ’. ఇందులో యజమానిగా రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. కుక్క చేసే విన్యాసాలు ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తాయని దర్శకుడు రాజా వన్నెంరెడ్డి చెబుతున్నారు. పాలకొల్లు, నరసాపురం పరిసరాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోందని, నరసాపురం రైల్వే స్టేషన్లో మూడు రోజుల పాటు చిత్ర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించామని రాజా వన్నెంరెడ్డి తెలిపారు. నిర్మాత హరిరామజోగయ్య మాట్లాడుతూ- ‘‘1925-37 మధ్యకాలంలో జీవించిన ఓ పెంపుడు శునకం యదార్థ గాథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఈ నెల 20 నాటికి షూటింగ్ పూర్తవుతుంది’’ అని తెలిపారు. సీత, సురేశ్, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, వేణుమాధవ్, ముంతాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: రాజేంద్రకుమార్, కెమెరా: మోహన్, సంగీతం: చక్రి, పాటలు: అనంతశ్రీరామ్. -
ముచ్చటగా మూడు ప్రారంభోత్సవాలు
జపాన్లో 1925 నుంచి 1937 మధ్య జీవించిన ఓ పెంపుడు కుక్క యధార్థ కథ ఆధారంగా బాబు పిక్చర్స్ పతాకంపై చేగొండి హరిరామ జోగయ్య, బోనం చినబాబు నిర్మిస్తున్న ‘టామీ’ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో 72 రకాల విన్యాసాలు చేసే శునకం ఓ కీలక పాత్ర చేస్తోంది. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి నటుడు కృష్ణంరాజు కెమెరా స్విచాన్ చేయగా, దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. కోడి రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కథ వినగానే మరో ఆలోచనకు తావివ్వకుండా అంగీకరించానని రాజేంద్రప్రసాద్ చెప్పారు. సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్లో మొదలైంది. తమిళ నటుడు శరత్కుమార్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. సుదర్శన్ సలేంద్ర దర్శకుడు, దేపా శ్రీకాంత్రెడ్డి నిర్మాత. సాయిరామ్శంకర్కి ఈ సినిమా మేలిమలుపు అవుతుందని, జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శక, నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఐ మార్టిన్ జో, సంగీతం: మహత్ నారాయణ, సమర్పణ: యర్రం వంశీధరరెడ్డి. ‘స్వామి రారా’ చిత్రాన్ని నిర్మించిన లక్ష్మీ నరసింహా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి మరో సినిమా రాబోతోంది. సుధీర్బాబు హీరో. ఎ.ఎన్.బోసు దర్శకుడు. చక్రి చిగురుపాటి నిర్మాత. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ‘స్వామి రారా’ తరహాలోనే వినోదాత్మకంగా ఉంటుందని, అయితే ఇది ‘స్వామి రారా’కి సీక్వెల్ కాదని దర్శక, నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వేగేశ్న సతీశ్, సహ నిర్మాత: బి.ఎస్.వర్మ, సమర్పణ: శంకర్ చిగురుపాటి.