breaking news
Tiger Census
-
అమ్రాబాద్ టైగర్ రిజర్వులో పెరిగిన పులుల సంఖ్య
అచ్చంపేట: నల్లమలలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వు (ఏటీఆర్)లో ప్రస్తుతం 36 పులులు, 2 పులి పిల్లలు ఉన్నాయి. ఇందులో 13 మగ, 20 ఆడ పులులు కాగా.. మరొకటి గుర్తించాల్సి ఉంది. అటవీశాఖ లెక్కల ప్రకారం 2023–24లో 33 పెద్దపులులు ఉండగా.. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) 2024–25 ఫేజ్–4 మానిటరింగ్లో భాగంగా ఆటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పులుల పర్యవేక్షణ సర్వే ప్రకారం 36కు చేరింది. 2019 నుంచి వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ పెరుగుతున్న పులుల సంతతిలో ఆడ పులుల సంఖ్య ఎక్కువగా ఉంది. పులుల సంతతి పెంచేందుకు అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తుండటంతో మరో రెండు, మూడేళ్లలో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా పులులు వేటాడి తమ ఆహారాన్ని సులభంగా సాధించుకునేలా జింకలు, దుప్పులు, గడ్డి క్షేత్రాలు, ఇతర జంతువులను పెంచాల్సిన అవసరం ఉంది.గణన ఇలా.. ఏటీఆర్ పరిధిలోని పది రేంజ్లను నాలుగు బ్లాక్లుగా విభజించారు. 2024, డిసెంబర్ 20 నుంచి 2025, మే 15వ తేదీల్లో 1,594 కెమెరా ట్రాప్ల ద్వారా పాదముద్రలను పరిశీలించారు. 797 లొకేషన్లలో ప్రతి 2 కిలోమీటర్లకు ఒక కెమెరా ట్రాప్ రికార్డ్ చేసి పులులకు సంబంధించి డేటాను విశ్లేషించారు. నాలుగు నెలల కాలంలో పులుల అడుగులు, ముద్రలు, విసర్జనలు, స్క్రాప్, రేక్ మార్కులు వంటి ప్రత్యక్ష ఆధారాలను నమోదు చేశారు. పెరుగుతున్న ఆడ పులులు నల్లమల అభయారణ్య ప్రాంతం 2,611.39 చదరపు కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 2,166,37 చదరపు కి.మీ. అభయారణ్యం, 445.02 చదరపు కి.మీ. బఫర్జోన్గా ఉంది. దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వుగా ఏటీఆర్ నిలిచింది. నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్, నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. ప్రకృతి రమణీయ దృశ్యాలు, కృష్ణానది జలపాతాలు, క్రూరమృగాలు, జంతువుల సందడికి నిలయం. ఈ అడవుల్లో జీవ వైవిధ్యానికి పెద్దపులులు, చిరుతలే కీలకం. పులుల సంరక్షణకు చేపట్టిన చర్యలతో అమ్రాబాద్ అభయారణ్యంలో ఏటేటా పులులు, చిరుతల సంఖ్య పెరుగుతోంది. దాదాపు 200లకు పైగా పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు సరిపడా అభయారణ్యం ఉంది.సాధారణంగా పులులు రెండున్నర ఏళ్ల తర్వాత సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. ఏటీఆర్లో సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆడపులుల సంఖ్య పెరిగిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 20 ఆడపులులు.. రెండు పులి పిల్లలు ఉన్నాయి. సాధారణంగా పెద్దపులి దట్టమైన అటవీ ప్రాంతంలో చెట్లపై గుర్తులు, మూత్ర విసర్జన చేసి తన హద్దులను ఏర్పాటు చేసుకుంటుంది. ఎంచుకున్న సరిహద్దులో 25 చదరపు కిలోమీటర్ల మేర సంచరిస్తుంది. ప్రస్తుతం ఏటీఆర్లో పరహా, బౌరమ్మ, తారా, ఎఫ్–53, ఎం–19 పేర్లతో పులులకు నామకరణం చేశారు. పులికి సిగ్గెక్కువ కావడంతో ఒంటరిగా తిరిగేందుకు ఇష్టపడుతుంది. పెద్దపులి (Tiger) శాఖాహార జంతువులను వేటాడి ఆహారంగా తీసుకుంటుంది. జనావాసాల తరలింపుపై కార్యాచరణ ఏటీఆర్లో పెద్దపులులకు అనుకూలమైన వాతావరణం ఉండేలా చూసేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. కోర్ ఏరియాలోని జనావాసాలను బయటకు తరలించేందుకు ఇప్పటికే తొలి దశలో సార్లపల్లి, కుడిచింతలబైలు, కొల్లంపెంట, కొమ్మనపెంట గ్రామాలను పెద్దకొత్తపల్లి మండలం బాకారం గ్రామ సమీపంలో అటవీశాఖ స్థలాన్ని ఎంపిక చేసి అక్కడికి తరలించే ఏర్పాట్లు చేస్తోంది. రెండో దశలో వట్టువర్లపల్లి, తాటిగుండాలు, మరి కొన్ని గ్రామాలను ఖాళీ చేయించి ఇతర చోట్లకు తరలించి వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఆయా కుటుంబాలకు ప్యాకేజీలు అందించే ఏర్పాటు చేస్తున్నారు. పులుల సంతానోత్పత్తికి అనువైన రోజులు కావడంతో జూలై నుంచి సెప్టెంబర్ వరకు వాటి ఏకాంతతకు భంగం కలగొద్దని నిషేధాజ్ఞలు విధించారు. ఈ మూడు నెలల పాటు అటవీ ప్రాంతంలోకి పర్యాటకులు, ఇతరులెవరినీ అనుమంతిచరు. ఏటీఆర్ను ఎకో సెన్సిటివ్ జోన్గా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు చేశారు. పది కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి అభివృద్ధి, నిర్మాణాలు చేపట్టాలన్నా ఎకో సెన్సిటివ్ జోన్ కమిటీ అనుమతి తప్పనిసరిగా అవసరం.పులుల వృద్ధికి ఏటీఆర్ అనుకూలం అమ్రాబాద్ టైగర్ రిజర్వు (ఏటీఆర్)లో జీవవైవిధ్యంతో పాటు పులుల వృద్ధికి అనుకూల వాతావరణం ఉండటంతో వాటి సంతతి పెరుగుతోంది. ఇందులో చెంచుల పాత్ర ముఖ్యమైనది. తాజా లెక్కల ప్రకారం 36 పులులు ఉన్నాయి. పెరుగుదల మా శాఖ ప్రణాళిక బద్ధంగా చేపట్టిన చర్యలకు ఫలితం. ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఈ అభయారణ్యం ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. – గోపిడి రోహిత్రెడ్డి, డీఎఫ్ఓ గుర్తింపు ఇలా.. పెద్ద పులులను ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫొటోగ్రాఫ్ల డేటాబేస్తో పాటు పులులు చారల ఆధారంగా మ్యాచ్ చేస్తారు మగ, ఆడ వాటిని వాటి శరీర భాగాలను బట్టి గుర్తిస్తారు పులులను గుర్తించాక వాటికి ప్రత్యేక ఐడీ కేటాయిస్తారు ఏ రెండు పులుల చారలు ఒకే విధంగా ఉండవు మనుషుల వేలి ముద్రల మాదిరిగానే వాటి స్ట్రైప్ ప్యాటర్న్ ప్రతీ పులికి ప్రత్యేకంగా ఉంటుందిచదవండి: చీరలు కట్టి.. చెట్లుగా మార్చారు! -
రేపటి నుంచి పులుల గణన
రాష్ట్రవ్యాప్తంగా జనవరి1 నుంచి 45 రోజులపాటు పులుల లెక్కింపు జరుగనుంది. నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతమైన మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, ఆత్మకూరు అటవీశాఖ ప్రాంతాలతోపాటు పల్నాడు, తిరుపతి, రాజంపేట, కడప అటవీ ప్రాంతాల్లో ఉన్న పులుల సంఖ్యను లెక్కించనున్నారు. ఇందుకోసం ప్రతి 2 చదరపు మీటర్లకు రెండు కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఏకైక టైగర్ రిజర్వు ఫారెస్టు అయిన నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టు సుమారు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. పులుల గణన కోసం సుమారు 2.15 లక్షల ఎకరాల్లో 400పైగా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో 86 నుంచి 88 వరకూ పులులు సంచరిస్తున్నట్లు అంచనా. – మార్కాపురం బేస్ క్యాంపులు..ప్రస్తుతం నల్లమలలో గంజివారిపల్లి సమీపంలోని పెద్దన్న బేస్ క్యాంపు, పాలుట్ల, వెదురుపడియ, నారుతడికల, ఇష్టకామేశ్వరి, పాలుట్ల, దొరబైలు, తుమ్మలబైలు, చిన్నమంతనాల, రోళ్లపెంట, కొర్రపోలు, కొలుకుల తదితర ప్రాంతాల్లో బేస్ క్యాంపులున్నాయి. రాత్రి 9 దాటితే దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెద్దపులుల సంచారం ఉన్నందున రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పులుల గణన..రాష్ట్రంలోని వివిధ అటవీ ప్రాంతాల్లో జనవరి 1 నుంచి 45 రోజుల పాటు పులుల గణన జరుగుతుంది. ఇవి శేషాచలం బయోస్పియర్ రిజర్వులో కూడా సంచరిస్తున్నట్లు గుర్తించారు. పులుల సంరక్షణలో లంకా మల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యం, పెంచల నరసింహ అభయారణ్యం, వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనం, పులుల సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. – సందీప్కృపాకర్, అటవీశాఖ డెప్యూటీ డైరెక్టర్, మార్కాపురం -
బందీపూర్ టైగర్ రిజర్వ్ పర్యటనలో మోదీ.. వీడియో వైరల్
బెంగళూరు: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కర్నాటకలో ఉన్నారు. అయితే, దేశంలో ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్బంగా కర్నాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్ను సందర్శనకు బయలుదేరారు. ఇక, తాను బందీపూర్లో పర్యటించనున్నట్టు శనివారమే తెలిపారు. అయితే, ప్రధాని మోదీ ఆదివారం ఉదయం బందీపూర్ టైగర్ రిజర్వ్ చేరుకున్నారు. ముందుగా ఆయన ఓపెన్ టాప్ జీపులో టైగర్ సఫారీ కోసం వెళ్లారు. కాగా, మోదీ.. టైగర్ రిజర్వ్లో దాదాపు 20 కిలోమీటర్లు దూరం ప్రయాణించనున్నారు. ఈ సందర్భంగా పులల ఆవాసాలు, ఏనుగుల శిబిరాలను సందర్శించనున్నారు. అనంతరం.. దేశంలో పులుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలను విడుదల చేయనున్నారు. 2022 లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో 2967 పులులు ఉన్నాయి. ఇక, మోదీ సఫారీకి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా.. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశంలో వన్యమృగాల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఫలితంగా దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. #WATCH | Prime Minister Narendra Modi arrives at Bandipur Tiger Reserve in Karnataka pic.twitter.com/Gvr7xpZzug — ANI (@ANI) April 9, 2023 -
పులులు లేవంట..!
పులి జాడ విశాఖ వనాల్లో కనిపించలేదు. పులుల మనుగడని కనిపెట్టేందుకు నిర్వహించిన వన్యప్రాణుల గణనలో ఈ విషయం స్పష్టమైంది. అయితే పలు అటవీ ప్రాంతాల్లో చిరుతపులులు సంచరించినట్లు కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఉమ్మడి విశాఖ అభయారణ్యాల్లో ఏఏ జంతువులు ఎంత మేర ఉన్నాయనే లెక్క తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం ఫుటేజీని శ్రీశైలంలోని బయోలాజికల్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పంపించారు. అక్కడి నుంచి వచ్చే తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ దేశవ్యాప్తంగా టైగర్ సెన్సస్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో అటవీ శాఖ అధికారులు నెల రోజులపాటు వన్యప్రాణుల గణనలో పాల్గొన్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకూ సేకరించిన సీసీ ఫుటేజీ వివరాలను శ్రీశైలంలోని బయోలాజికల్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పంపించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అడవుల్లో 40 పాయింట్లను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మొత్తం 80 అత్యా«ధునిక కెమెరాలు అమర్చారు. పులులతో పాటు చిరుతపులులు, ఇతర జంతువుల కదలికల్ని గణించేందుకు కెమెరాలు పెట్టారు. పగటిపూట, రాత్రి సమయంలోనూ స్పష్టంగా క్యాప్చర్ చేసే ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ఉన్న కెమెరాలను వినియోగించారు. వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఎదురెదురుగా ఉన్న చెట్లకు అమర్చారు. ఇవన్నీ 24 గంటలూ వాటంతట అవే పనిచేస్తాయి. చీకట్లో అయితే ఫ్లాష్ ఉపయోగించుకుంటాయి. జంతువులు కదలికలు, ఉష్ణోగ్రతల ఆధారంగా కెమెరాలు సమాచారాన్ని నిక్షిప్తం చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో చిరుతలున్నాయి వన్యప్రాణులు, పులుల గణనలో కంబాలకొండతో పాటు నర్సీపట్నం, అరకు, పాడేరు అటవీ ప్రాంతాల్లో విభిన్న రకాలైన జంతుజాలాన్ని గుర్తించారు. ఎక్కడా పులుల ఆనవాళ్లు కనిపించలేదుగానీ.. పలు అటవీ ప్రాంతాల్లో చిరుతపులులు సంచరించినట్లు కెమెరాల్లో నిక్షిప్తమైంది. వీటితో పాటు కంబాలకొండ, ఇతర అటవీ ప్రాంతాల్లో చుక్కలదుప్పి, తోడేళ్లు, సాంబార్, నీల్గాయి, అడవిపందులు, కుందేళ్లు, కృష్ణజింకలు, కొండగొర్రెతో పాటు విభిన్న రకాల జంతువులున్నాయని ప్రాథమికంగా గుర్తించారు. వీటితో పాటు ప్లమ్ హెడెడ్ పారాకీట్ (గుండు రామచిలుక), వైట్ బెల్లీడ్ సీ ఈగల్ (సముద్రపు గద్ద), ఆరెంజ్ బ్రెస్టెడ్ గ్రీన్ పీజియన్ (పచ్చగువ్వ), బ్రౌన్ ఫిష్ ఔల్ (జీలుగు, గోధుమ చేప గుడ్లగూబలు), పెయింటెడ్ స్పర్ఫ్ ఔల్స్ (తొగరుకోళ్లు)తోపాటు నైట్ జార్లు, పిచ్చుకలు తదితర జీవజాలం ఉన్నట్లు సర్వేలో స్పష్టమైంది. -
Tiger Census 2021: నేటి నుంచి పులుల గణన
పెద్దదోర్నాల: ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్లో భాగంగా అటవీ శాఖాధికారులు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు పులుల గణన నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా పులి సంరక్షణ కేంద్రాలు 50 ఉండగా, వాటిలో నల్లమలలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అతి పెద్ద అభయారణ్యంగా గుర్తింపు పొందింది. గతేడాది నిర్వహించిన గణనలో ఇక్కడ 63 పులులు ఉన్నట్లు తేలింది. ఈ సారి ఆ సంఖ్య పెరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో, తెలంగాణలోని మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో నల్లమల విస్తరించింది. ఈ అటవీ ప్రాంతంలోని సిబ్బందికి ఇప్పటికే పులుల గణనపై శిక్షణ తరగతులు నిర్వహించి సంసిద్ధం చేశారు. ఈ సారి పులుల గణనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో వాటి పాదముద్రల ఆధారంగా గణన జరిగేది. అరణ్యంలోని పలు ప్రాంతాల్లో అవి సంచరిస్తుండటంతో ఖచ్చితమైన సంఖ్య తేలేది కాదు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేశారు. వాటి నుంచి వెలువడే ఆల్ఫ్రారెడ్ బీమ్ పరిధిలోకి జంతువు రాగానే కెమెరా చిత్రీకరిస్తుంది. దీంతో పాటు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఎకోలాజికల్ యాప్ను ఉపయోగించి వన్యప్రాణుల వివరాలు సేకరిస్తున్నారు. నూతన శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటు పులుల పాదముద్రలు, మలము, చెట్ల మొదళ్లపై పులుల గోళ్ల రక్కులకు సంబంధించిన ఆనవాళ్లను సైతం పరిగణనలోకి తీసుకుని పులుల గణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. -
జంతు గణన ప్రారంభం
వేమనపల్లి : వేమనపల్లి, ఒడ్డుగూడెం అటవీ సెక్షన్ పరిధుల్లో సోమవారం నుంచి మాంసాహార వన్యప్రాణుల జంతు గణన ప్రారంభమైంది. కుశ్నపల్లి అటవీ రేంజ్ అధికారి అప్పలకొండ నేతృత్వంలో సెక్షన్ అధికారులు జ్ఞానేశ్వర్, మధూకర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. వేమనపల్లి సెక్షన్ 3 అటవీబీట్లు, ఒడ్డుగూడెం 4 బీట్లలోని 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏయే జంతువులు సంచరించాయనే కోణంలో వివరాలు తెలుసుకున్నారు. వాటి పాదముద్రలు, పెంటికలు, మూత్ర విసర్జన చేసిన చోటును పరిశీలించారు. చిరుతపులి, తోడేళ్లు, నక్కలు, అడవికుక్కల ఆనవాళ్లు లభ్యమవుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. మూడు రోజుల పాటు మాంసాహార జంతువుల గణన చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. గణనలో బీట్ అధికారులు అనిల్, మధూకర్, బేస్ క్యాంప్, స్ట్రైకింగ్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. దేవాపూర్ రేంజ్ పరిధిలో.. కాసిపేట : మండలంలోని దేవాపూర్ అటవీ రేంజ్ పరిధిలోనూ జంతు గణన ప్రారంభమైంది. సెక్షన్ అధికారి ప్రమోద్కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన గణనలో చిరుతపులి అడుగులు గుర్తించినట్లు తెలిపారు. అడుగులను పెగ్మార్క్ చేసి పీవోపీ తీసినట్లు పేర్కొన్నారు. గణనను రేంజ్ అధికారి అనిత పర్యవేక్షించారు. గఢ్పూర్ ఎఫ్ఎస్వో అస్మా, బీట్ అధికారులు, అటవీ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. నెన్నెల: జంతు గణనలో భాగంగా మండలంలోని రంగపేట బీట్ పరిధిలో నర్సరీ వెనకాల పులి అడుగులు గుర్తించినట్లు కుశ్నపల్లి రేంజర్ అప్పలకొండ తెలిపారు. కుశ్నపల్లి రేంజ్ పరిధిలో బృందాలుగా ఏర్పడి జంతు గణన చేపట్టారు. చెక్డ్యాంలు, చెరువులు, నీటి వనరులు, వాగుల వద్ద జంతువులకు సంబంధించిన పాదముద్రలను, పెంట ఆధారాలను సేకరించినట్లు రేంజర్ వెల్లడించారు. మొదటి రోజు సర్వేలో డిప్యూటీ రేంజర్ రమాదేవి, సెక్షన్ అధికారులు పాటేకర్, గౌరి శంకర్, మల్లయ్య, జ్ఞానేశ్వర్, బీట్ అధికారులు కామరాజు, రమేశ్, అశోక్, స్ట్రైక్ఫోర్స్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. -
నల్లమలలో పులులు ఎన్నున్నాయో?
శ్రీశైలం ప్రాజెక్టు: నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు పరిధిలో శుక్రవారం నుంచి పులుల లెక్కింపు ప్రారంభించినట్లు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఖాదర్ వలీ తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 14 వరకు లెక్కింపు ఉంటుందన్నారు. నల్గొండ, మహబూబ్నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో లెక్కింపును చేపట్టామన్నారు. శాస్త్రీయ పద్ధతిలో లెక్కింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్ట్లో పులులు ఎన్ని ఉన్నాయనేది లెక్కింపు తర్వాత తెలుస్తోంది. పులుల సంఖ్యపై జంతు ప్రేమికులు ఆసక్తి కనబరుస్తున్నారు.