breaking news
terrarisam
-
Independence Day 2025: దుస్సాహసానికి దిగారో ఖబడ్దార్!
ప్రతి ఒక్కరమూ భారత్లో, మన తోటివారు చెమటోడ్చి తయారు చేసిన వస్తువులనే వాడతామని ప్రతినబూనుదాం. ఇతరులూ వాడేలా చేద్దాం. స్వదేశీ వస్తువులే అమ్ముతాం అంటూ ప్రతి చిరు వ్యాపారీ, దుకాణదారూ బోర్డు పెట్టాలి. ప్రతి రంగంలోనూ దేశీయ తయారీ వస్తువులే ఉండాలి. వాటిని ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసే స్థాయికి చేరాలి. టారిఫ్లతో మన రైతులు, పశుపాలకులు, మత్స్యకారులతో సహా ఎవరూ నష్టపోకుండా అండగా నిలుస్తా. ..: మోదీ :..న్యూఢిల్లీ: దాయాది గుండెలదిరేలా ప్రధాని నరేంద్ర మోదీ సింహనాదం చేశారు. పహల్గాం పాశవికత్వం వెనక పాక్ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ పలుగు రాళ్లతో నలుగు పెట్టారు. ‘‘పహల్గాం ఉగ్రోన్మాదానికి ప్రతీకారంగా మన సైన్యం చేసిన ‘సిందూర’ గర్జన తాలూకు భయంతో శత్రు దేశం నేటికీ నిద్ర లేని రాత్రులు గడుపుతోంది. మన దళాలు పాక్ భూభాగంలో వందలాది కిలోమీటర్ల మేరకు చొచ్చుకెళ్లి మరీ ఉగ్ర, సైనిక లక్ష్యాలను తుత్తునియలు చేశాయి. ఆ విధ్వంసానికి సంబంధించి నేటికీ రోజుకో కొత్త కబురు తెరపైకి వస్తోందంటే అతిశయోక్తి కాదు’’ అంటూ ఎద్దేవా చేశారు. మళ్లీ అలాంటి దుస్సాహసానికి దిగితే దాయాదికి జన్మలో మర్చిపోలేని రీతిలో గట్టి గుణపాఠం నేర్పి తీరతామంటూ ప్రతినబూనారు. అణు బెదిరింపులకు జడిసే రోజులు గతించాయంటూ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు పదునైన హెచ్చరికలు జారీ చేశారు. అటువంటి మతిలేని ఉన్మాదానికి దిగితే దీటుగా బదులిస్తామని స్పష్టం చేశారు. ‘‘60 ఏళ్లుగా భారత రైతుల పొట్ట కొడుతూ పాక్ పొలాలను తడుపుతున్న ఏకపక్ష సింధూ నదీ జల ఒప్పందం శాశ్వతంగా కాలగర్భంలో కలిసినట్టే. నీరూ నెత్తురూ కలిసి పారడం జరగని పని’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘భరత జాతి దశాబ్దాలుగా పదేపసదే ఉగ్ర భూతానికి బలవుతూ వస్తోంది. దాయాది దన్నుతో జాతి గుండెను ఉగ్ర పోట్లు పదేపదే చీలుస్తూ వచ్చాయి. అది ఇకపై సాగదు. ఉగ్రవాదానికి మహారాజ పోషకులుగా మారి దానికి జవసత్వాలు అందజేస్తున్న దేశాలు, శక్తులను కూడా ఇకపై విడిగా చూడబోం. వారినీ ఆ ముష్కరులతో సమానంగా శిక్షించి తీరతాం. ఇదే మా నయా మంత్రం’’ అంటూ పాక్కు పెను హెచ్చరికలు చేశారు. ‘‘వారి మధ్య ఎలాంటి తేడా లేదు. ఇద్దరూ మానవాళికి సమాన శత్రువులే’’ అని స్పష్టం చేశారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎర్రకోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ఏకంగా 103 నిమిషాల పాటు ప్రసంగించారు. గతేడాది 98 నిమిషాలు ప్రసంగించిన స్వీయ రికార్డును అధిగమించారు. అంతేగాక ఎర్రకోట నుంచి వరుసగా 12 వసారి పంద్రాగస్టు ప్రసంగం చేయడం ద్వారా ఇందిరాగాంధీ రికార్డు (11)ను అధిగమించారు. వరుసగా 17సార్లు పంద్రాగస్టు ప్రసంగాలు చేసిన తొలి ప్రధాని నెహ్రూ తర్వాత రెండోస్థానంలో నిలిచారు. అన్ని రంగాల్లోనూ ఆత్మ నిర్భరత తాలూకు ఆవశ్యకతను మోదీ తన ప్రసంగంలో పదేపదే నొక్కిచెప్పారు. సెమీ కండక్టర్లు మొదలుకుని కీలక ఖనిజాలు, అణు ఇంధనం దాకా అన్నింట్లోనూ స్వయంసమృద్ధి సాధించిన నాడే దేశం నిజమైన అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. తన వికసిత్ భారత్ కలలను సవివరంగా దేశ ప్రజల ముందుంచారు. కాంగ్రెస్తో పాటు విపక్షాలన్నీ అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నాయంటూ తూర్పారబట్టారు. అర్థం లేని డిమాండ్లతో పార్లమెంటును నిత్యం స్తంభింపజేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కీలక పథకాల అమలులో ఇప్పటికైనా కేంద్రంతో కలిసి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.బలగాలు సత్తా చాటాయి ‘‘రాజస్తాన్ ఎడారులు మొదలుకుని హిమ శిఖరాలు, సముద్ర తీరం, అత్యంత జనసమ్మర్ధ ప్రాంతాల దాకా ఇంటింటా నేడు త్రివర్ణ స్ఫూర్తి వెల్లివిరుస్తోంది. కానీ గత ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో అమాయక పర్యాటకులను ఉగ్ర ముష్కరులు పిరికిదెబ్బ తీశారు. పిల్లల కళ్లముందు తండ్రులను పొట్టన పెట్టుకున్నారు. భార్యల సిందూరాన్ని కర్కశంగా తుడిపేశారు. ఆ దారుణాన్ని తలచుకుని జాతి యావత్తూ క్రోధావేశాలతో ఆక్రోశించింది. అందుకు ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో మన సైనిక బలగాలు పూర్తిస్థాయిలో సత్తా చాటాయి’’ అన్నారు.శ్రీకృష్ణుడే స్ఫూర్తిగా మిషన్ సుదర్శన చక్ర దేశ భద్రతకు ఛత్రం పదేళ్లలో అందుబాటులోకి దేశ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ‘మిషన్ సుదర్శన్ చక్ర’ పేరుతో 2035 నాటికి అత్యంత శక్తిమంతమైన సరికొత్త రక్షణ వ్యవస్థ ఏర్పాటును ప్రధాని మోదీ ప్రకటించారు. దీనిద్వారా దేశ భద్రతా ఛత్రాన్ని మరింతగా విస్తరించి, బలోపేతం చేసి ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. ‘‘శనివారం శ్రీకృష్ణుని జన్మదినం. కచి్చతత్వంతో పని పూర్తి చేయడం, ఆ వెంటనే కృష్ణున్ని చేరుకోవడం సుదర్శన చక్రం ప్రత్యేకత. దాని స్ఫూర్తితో రూపొందే పూర్తి దేశీయ భద్రతా వ్యవస్థ కూడా అలాగే అత్యాధునికంగా రూపుదిద్దుకుంటుంది’’ అన్నారు. యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టం వంటివాటితో ఇది ఇజ్రాయెల్ ఐరన్డోమ్ తరహాలో పని చేస్తుందన్నది నిపుణుల అంచనా.‘సింధూ’ ఇక భారత సొత్తే! ‘‘మన నేలపై పుట్టి పారే నదులు శత్రు దేశపు పొలాలను తడుపుతున్నాయి. మన రైతులు దాహార్తితో అల్లాడుతున్నారు. సింధూ ఒప్పందం 70 ఏళ్లుగా వారికి చేసిన నష్టం మాటలకందనిది. అది ఎంతటి ఏకపక్ష ఒప్పందమో ఇప్పుడు దేశవాసులందరికీ తెలిసొచ్చింది. దీన్నిక సహించేది లేదు. ఆ ఒప్పందానికి నూకలు చెల్లినట్టే. సింధూ జలాలన్నీ ఇక పూర్తిగా మన రైతులవే. టారిఫ్లతో మన రైతులు, మత్స్యకారులతో సహా ఎవరూ నష్టపోకుండా అండగా నిలుస్తా’’.అక్రమ వలసలు... అతి పెద్ద కుట్ర! హై పవర్ మిషన్తో అడ్డుకట్ట అక్రమ వలసలు దేశానికి తలనొప్పిగా మారాయని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ఇది పక్కా పథకం ప్రకారం కొందరు పన్నిన కుట్ర. ఉద్దేశపూర్వకంగా చొరబాట్లను ప్రోత్సహిస్తూ పెను సంక్షోభానికి బీజం వేస్తున్నారు. దేశంలో జనాభా సమతౌల్యాన్నే దెబ్బతీయజూస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇది జాతీయ భద్రత పాలిట పెను ప్రమాదంగా పరిణమిస్తోంది. మన ఐక్యతకు, ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారుతోంది. సామాజిక ఉద్రిక్తతల బీజాలు నాటుతోంది. చొరబాటుదార్లు అమాయక గిరిపుత్రులను మోగిస్తున్నారు. వారి అటవీ భూములను కాజేస్తున్నారు. ఈ ఘోరాలను ఇకపై సహించే ప్రసక్తే లేదు. అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతస్థాయి డెమోగ్రాఫిక్ మిషన్కు రూపకల్పన చేస్తున్నాం’’ అని ప్రకటించారు. నారీ శక్తికి సలాం ‘‘స్త్రీ శక్తి ప్రతి రంగంలోనూ సత్తా చాటుతోంది. స్టార్టప్లు, క్రీడలు, సైన్యం మొదలుకుని అంతరిక్షం దాకా ప్రతి రంగంలోనూ దేశ సామాజిక, ఆర్థిక ప్రగతిలో కీలక చోదక శక్తిగా నిలుస్తోంది. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ) నుంచి తాజాగా తొలి బ్యాచ్ మహిళా కేడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న చరిత్రాత్మక క్షణాలను తలచుకుని జాతి యావత్తూ గర్వంతో ఉప్పొంగిపోయింది. లక్పతీ దీదీ పథకంతో కోట్లాది మంది మహిళలు స్వయంసమృద్ధి సాధించారు’’.స్వదేశీ సత్తా చాటుదాం-ఆ కలను నిజం చేయండి యువతకు మోదీ సవాలు వందేళ్ల పై చిలుకు దాస్యం మనలను నిరుపేదలుగా, పరాధీనులుగా మార్చిందని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. నేటికీ ఏ జాతి ఆత్మ గౌరవానికైనా ఆత్మ నిర్భరతే అతి పెద్ద తార్కాణమని నొక్కిచెప్పారు. స్వయం సమృద్ధ భారతే వికసిత భారత్కు పునాది అని స్పష్టం చేశారు. ‘‘ఇది ఎగుమతులు, దిగుమతులు, కరెన్సీలకే పరిమితం కారాదు. మేడిన్ ఇండియా ఆయుధాల తాలూకు గొప్పదనాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచమంతటికీ ఘనంగా చాటాం. శత్రు లక్ష్యాలను రెప్పపాటులో తుత్తునియలు చేశాం. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించకపోతే ఇది సాధ్యపడేదా?’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రతి ఒక్కరమూ భారత్లో, మన తోటివారు చెమటోడ్చి తయారు చేసిన వస్తువులనే వాడతామని ప్రతినబూనుదాం. ఇతరులూ వాడేలా చేద్దాం. ‘స్వదేశీ వస్తువులే అమ్ముతాం’ అంటూ ప్రతి చిరు వ్యాపారీ, దుకాణదారూ బోర్డు పెట్టాలి. ప్రతి రంగంలోనూ దేశీయ తయారీ వస్తువులే ఉండాలని, వాటిని ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసే స్థాయికి చేరాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘దేశీయ జెట్ ఇంజన్లు, యుద్ధవిమానాలు మొదలుకుని సోషల్ మీడియా వేదికల దాకా తిరుగులేని రీతిలో డిజైన్ చేయాలి. మన యువతకు, ఇన్నొవేటర్లకు, సైంటిస్టులకు, ఇంజనీర్లకు, ప్రొఫెషనల్స్కు ఇదే నా సవాలు’’ అని పేర్కొన్నారు. తద్వారా దేశాన్ని బలోపతంగా, స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దడంలో పాలుపంచుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ‘‘అంతరిక్ష రంగంలోనూ ఆత్మ నిర్భరత అత్యవసరం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టిన తొలి భారతీయునిగా రికార్డు నెలకొల్పిన వాయుసేన గ్రూప్కెపె్టన్ శుభాన్షు శుక్లాను చూసి జాతి యావత్తూ పొంగిపోతోంది. తొలి దేశీయ మానవసహిత అంతరిక్ష గగన్యాన్కు త్వరలో శ్రీకారం చుట్టనున్నాం. అంతేకాదు, సొంత అంతరిక్ష కేంద్రాన్నీ నిర్మించుకోనున్నాం’’ అని చెప్పారు. అతి పెద్ద సేవాసంస్థ ఆరెస్సెస్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆవిర్భావానికి వందేళ్లవుతున్న సందర్భంగా మోదీ అభినందనలు తెలిపా రు. దాన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా అభివరి్ణంచారు. ‘‘దేశానికే గర్వకారణమైన ప్రస్థానం ఆరెస్సెస్ది. అంకితభావంతో దేశానికి సేవ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తలందరికీ నా సెల్యూట్. కోట్లాది మంది ప్రజలు, సాధుసంతులు, సైంటిస్టులు, టీచర్లు, రైతులు, సైనికులు, శ్రామికులు, వ్యక్తులు, సంస్థల మొక్కవోని ప్రయత్నాల ఫలస్వరూపంగా ఆరెస్సెస్ ఎదిగింది. వ్యక్తి, జాతి నిర్మాణానికి, దేశ సంక్షేమానికి వందేళ్లుగా వారంతా తిరుగులేని త్యాగాలు చేస్తూ వస్తున్నారు. ఆ స్వయం సేవకులదరినీ ఎర్రకోట వేదికగా సగౌరవంగా గుర్తుచేసుకుంటున్నా’’ అన్నారు.తగ్గనున్న జీఎస్టీ శ్లాబులు-దివాలీ డబుల్ బొనాంజా ‘‘త్వరలో భారీస్థాయిలో సరికొత్త జీఎస్టీ సంస్కరణలు తేనున్నాం. జీఎస్టీ శ్లాబులను బాగా తగ్గించనున్నాం. తద్వారా పౌరులపై పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. ఈ దీపావళికి వారికిది కేంద్రం తరఫున డబుల్ బొనాంజా. వార్షిక వ్యక్తిగత ఆదాయ పన్ను చట్టాలను కూడా సరళీకరించాం’’. యువత కోసం... రూ.లక్ష కోట్లు ‘‘దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో ‘ప్రధాన్మంత్రీ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన’ పేరుతో కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నాం. దీనికింద ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందే యువతీ యువకులందరికీ రూ.15 వేలు అందజేయనున్నాం. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందించే కంపెనీలకు ప్రోత్సహకాలు అందుతా యి. ఈ పథకం ద్వారా కనీసం 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తాం’’. కీలక ఖనిజాలపై దృష్టి ‘‘ఇది టెక్నాలజీ ఆధారిత శతాబ్ది. దాన్ని అందిపుచ్చుకున్న దేశాలే అభివృద్ధిలో దూసుకెళ్లాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. గత ప్రభుత్వాలను విమర్శించడం నా లక్ష్యం కాదు. కానీ మన దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించిన ఫైళ్లు కదలడం 60 ఏళ్ల కిందే మొదలైంది. కానీ ఏళ్లు గడిచినా ఎక్కడి గొంగళి అక్కడే! అలా మనం అతి విలువైన 50 ఏళ్లను కోల్పోతే మిగతా దేశాలు ఆ రంగంలో దూసుకెళ్లాయి. మేం అధికారంలోకి వచ్చాక సెమీ కండక్టర్ల తయారీకి పెద్దపీట వేస్తున్నాం. ఇక కీలక ఖనిజాల అవసరాన్ని నేడు ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. ఈ రంగంలోనూ స్వయం సమృద్ధి సాధించడం అత్యంత కీలకం. పరిశ్రమలు, ఇంధనం, రక్షణ, టెక్నాలజీ... ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా కీలక ఖనిజాలే ప్రాణావసరంగా మారిన పరిస్థితి! ఈ అవసరాలను పూర్తిస్థాయిలో దేశీయంగానే తీర్చుకునేందుకు నేషనల్ క్రిటికల్ మిషన్కు శ్రీకారం చుట్టాం. దేశవ్యాప్తంగా ఏకంగా 1,200 చోట్ల కీలక ఖనిజాల అన్వేషణకు తెర తీశాం’’.పదింతలకు ‘అణు’ పాటవం ‘‘దేశవ్యాప్తంగా 10 కొత్త అణు రియాక్టర్లను శరవేగంగా నిర్మిస్తున్నట్టు మోదీ వెల్లడించారు. దేశ అణు ఇంధన సామర్థ్యాన్ని 2047 నాటికి పదింతలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు’’. -
ఉగ్రవాదం అంతమే లక్ష్యం : అమిత్షా
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్రనాయకత్వం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది.ఈ సందర్భంగా మొదటి దశ ప్రచారానికి చివరి రోజున కేంద్ర హోం మంత్రి అమిత్ షా కిష్త్వార్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్ను తిరిగి తీవ్రవాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) తీవ్రవాదంపై అలసత్వం ప్రదర్శిస్తున్నాయని, ఉగ్రవాదులు,దాడులకు పాల్పడిన వారిని జైళ్ల నుంచి విడిచి పెట్టాలని యోచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఈ ప్రాంత అమరవీరుల్ని స్మరించుకుంటూ.. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని హామీ ఇస్తున్నాను’అని అన్నారు.ఆర్టికల్ 370 రద్దు చేసిన చరిత్ర బీజేపీదేనని పునరుద్ఘాటించారు. కాగా,జమ్మూ కశ్మీర్ ఎన్నికలు మూడు దశల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న జరగనున్న విషయం తెలిసిందే. ఇక అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. రెండు రాష్ట్రాలకు అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. VIDEO | "Today, I remember all the martyrs from this region and make a promise before you, that we will end terrorism in such a way that it will never rise again. There are efforts being made to support terrorism here again. The NC and Congress have even made promises that if… pic.twitter.com/cZi1Zacljs— Press Trust of India (@PTI_News) September 16, 2024ఇదీ చదవండి : సందీప్ ఘోష్ ఓ అబద్ధాల పుట్ట.. -
పాకిస్తాన్కు చేతకాకపోతే మేము సిద్ధంగా ఉన్నాం: రాజ్నాథ్ సింగ్
ఢిల్లీ: ఉగ్రవాదం విషయంలో పొరుగు దేశం పాకిస్తాన్పై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాకిస్తాన్కు చేతకాకపోతే.. భారత్ సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. అంతేకానీ, ఉగ్రవాదంతో భారత్లో అస్థిర పరిచేందుకు ప్రయత్నాలు చేస్తే ఊరుకోబోమని పాక్ను హెచ్చరించారు. ఈ మేరకు జరాజ్నాథ్ సింగ్ గురువారం జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘పాకిస్తాన్ అసమర్ధంగా ఉందని భావిస్తే.. ఉగ్రవాదాన్ని అంతం చేయటంలో సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉంది. భారత్లోకి ప్రవేశించి సరిహద్దులు దాటి తప్పించుకునే ఉగ్రవాదులను హతమార్చటంలో భారత్ వెనకడుగు వేయబోదు. ఉగ్రవాదులు భారత దేశంలోని శాంతికి భంగం కలిగిస్తే.. మేము పాకిస్తాన్లోకి ప్రవేశించి మరీ ఉగ్రమూకలను మట్టుపెడతాం. భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇతర దేశంపై దాడి చేయదు. పొరుగు దేశంలోని భూభాగాన్ని అక్రమించుకోదు. కానీ, ఎవరైనా భారత్లోని శాంతికి భంగం కలిగిస్తే.. ఏమాత్రం ఊరుకోం’ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇక.. ఇటీవల పాక్లో చోటుచేసుకుంటున్న ఉగ్రవాదుల మిస్టరీ హత్యల వెనక భారత్ హస్తం ఉన్నట్లు యూకేకు చెందిన ‘దీ గార్డియన్’ పత్రిక ఓ నివేదికను వెల్లడించిన విషయం తెలిసిందే. 2019 పుల్వామా దాడుల అనంతరం పాక్లోని ఉగ్రవాదులపై భారత్ దృష్టి పెట్టిందని.. ఈ విషయాన్ని ఇరుదేశాల ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి సేకరించిన సమాచారం మేరకే ఈ నివేదిక విడుదల చేసినట్లు గార్డియన్ పత్రిక వెల్లడించింది. గార్డియన్ పత్రిక ఆరోపణలపై భారత్ స్పందిస్తూ.. ‘పూర్తిగా తప్పుడు సమాచారమని, భారత వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. టార్గెట్ హత్యలు చేయటం భారత విధానం కాదు’ అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ శాఖ స్పందించింది. ‘భారత్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. పాకిస్తాన్ దృఢమైన సంకల్పం, తమను తాము రక్షించుకునే సామర్థాన్ని చరిత్ర ధృవీకరిస్తుంది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. -
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
మెల్బోర్న్: శాంతి, సుస్థిరత, ఆర్థిక ప్రగతితో కూడిన స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ప్రగతికి కీలకమని విదేశాంగ మంత్రి జై శంకర్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంత భద్రతలో క్వాడ్ మరింత చురుకైన పాత్ర పోషించాల్సి ఉందన్నారు. శుక్రవారం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో నాలుగో క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్ (అమెరికా), మారిస్ పైన్ (ఆస్ట్రేలియా), యొషిమాసా హయాషీ (జపాన్)తో పలు అంశాలపై లోతుగా చర్చించారు. ఇండో పసిఫిక్ను బెదిరింపులు, నిర్బంధ ఆర్థిక విధానాల బారినుంచి విముక్తం చేయాలని సదస్సు తీర్మానించింది. సీమాంతర ఉగ్రవాద వ్యాప్తికి పరోక్ష మద్దతిస్తున్న కొన్ని దేశాల తీరును తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదుల నెట్వర్క్ను, వాటి అడ్డాలను, మౌలిక సదుపాయాలను, ఆర్థిక మూలాలను పూర్తిగా పెకిలించేందుకు సభ్య దేశాలన్నీ కలిసి పని చేయాలని నిర్ణయించింది. అఫ్గాన్ భూ భాగాన్ని ఇతర దేశాలను బెదిరించేందుకు, వాటిపై దాడులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోరాదని అభిప్రాయపడింది. తర్వాత మంత్రులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంత దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం తదితరాలపై రాజీ ఉండబోదన్నారు. ‘‘ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, సముద్ర రక్షణ తదితర అంశాల్లో కలిసి పని చేసేందుకు ఎంతో అవకాశముంది. ఈ ఉమ్మడి లక్ష్యాల సాధనకు ఇండో పసిఫిక్ దేశాలు చేసే ప్రయత్నాలన్నింటికీ మద్దతుగా నిలవాలన్న క్వాడ్ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం’’ అని చెప్పారు. తూర్పు, దక్షిణ చైనా సముద్ర తీర దేశాల హక్కులకు తలెత్తుతున్న సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కొంటామని చైనాను ఉద్దేశించి పేర్కొన్నారు. రష్యా దూకుడుకు భారీ మూల్యమే ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక మోహరింపుల విషయమై రష్యాతో చర్చించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు బ్లింకెన్ చెప్పారు. దూకుడు ప్రదర్శిస్తే ఆర్థిక, ఎగుమతిపరమైన ఆంక్షల రూపంలో భారీ మూల్యం తప్పదని రష్యాను హెచ్చరించారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడే ప్రయత్నాలకు తమ మద్దతుంటుందని పైన్, హయాషీ చెప్పారు. బర్మా సంక్షోభంపై సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.అక్కడ ప్రజాస్వామ్యాన్ని తక్షణం పట్టాలెక్కించాలని సైనిక ప్రభుత్వానికి సూచించింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు మరింత మద్దతుగా నిలవాలని నిర్ణయించింది. తర్వాత మంత్రులంతా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్తో భేటీ అయ్యారు. విఫల ప్రయోగం: చైనా క్వాడ్పై చైనా అక్కసు వెల్లగక్కింది. తమను నిలువరించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ గ్రూపు విఫల ప్రయోగంగా మిగిలిపోతుందని శాపనార్థాలు పెట్టింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పలు దేశాలతో సరిహద్దు వివాదాలున్న చైనా క్వాడ్ ఏర్పాటును తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. -
ఆ కల తీరుతుందా?
ప్రపంచ దేశాలపై అమెరికా పట్టు నిలుపుకోవాలంటే భారత్తో స్నేహసంబంధాలు కొనసాగించడం అగ్రరాజ్యానికి అత్యంత అవసరం. రక్షణ రంగంలో ఒబామా అనుసరించే విధానాలే బైడెన్ కొనసాగించనున్నారు. ఉగ్రవాదం పాక్ భూభాగంపై ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి ఆయన ఏ మాత్రం అంగీకరిం చరు. ఉగ్రవాదం అంశంలో పాక్పై ఒత్తిడి గట్టిగానే కొనసాగిస్తారన్న ఆశాభావంతో భారత్ ఉంది. చైనాతో వైఖరి వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య సంబంధాలు భారత్కి కీలకం. ట్రంప్ భారత్కే మద్దత పలుకుతూ చైనాపై కస్సుబుస్సులాడుతూనే ఉన్నారు. కానీ బైడెన్ నుంచి ఆ స్థాయి మద్దతు లభించదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో ఒక దేశం నుంచి మరొక దేశానికి ముప్పు ఉండకూడదన్న వైఖరినే ఆయన పాటించే అవకాశాలున్నాయి. మానవ హక్కులు మానవ హక్కుల ఉల్లంఘన అంశంలో భారత్ పట్ల కొత్త అధ్యక్షుడి వైఖరి ఎలా ఉంటుందో ఇప్పట్నుంచి అంచనా వెయ్యలేని పరిస్థితైతే ఉంది. మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తోందంటూ పాకిస్తాన్పై బైడెన్ గుర్రుగానే ఉన్నారు. మరోవైపు కశ్మీర్లో 360 ఆర్టికల్ రద్దుని ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమల మొదట్నుంచి వ్యతిరేకిస్తున్నారు. వీసా విధానం హెచ్–1బీ వీసా విధానం, ఉద్యోగాల కల్పన అంశంలో బైడెన్ విధానాలు భారత్కు సానుకూలంగా మారే అవకాశాలున్నాయి. అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ హెచ్–1బీ వీసాలపై కఠిన ఆంక్షలు విధించారు. అయితే బైడెన్ వాటిని సరళతరం చేస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారు. అంతేకాదు చట్టవిరుద్ధంగా ఉండే వలసదారులకి అమెరికా పౌరసత్వం కల్పిస్తానని ఎన్నికల హామీ కూడా ఉంది. అదే జరిగితే 5 లక్షల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది కమలా హ్యారిస్ పాత్ర వివిధ అంశాలపై కమలకు స్పష్టమైన అభిప్రా యాలున్నాయి. అవన్నీ భారత్తో సంబంధాల్లో ప్రభావాన్ని చూపిస్తాయి. మరోసారి పోటీ చేయబోనని బైడెన్ చెప్పడంతో అధ్యక్షురాలయ్యే వ్యూహంతో కమలా అడుగులు వేస్తారు. ఆమె మూలాలు భారత్తో ముడిపడి ఉండడంతో మన దేశానికి కలిసొచ్చే అంశంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘2020 నాటికి అమెరికా, భారత్ ప్రపంచంలోనే అత్యంత సన్నిహిత దేశాలుగా అవతరించాలి. అప్పుడే ప్రపంచం హాయిగా ఉంటుంది. ఇదే నా కల — 2006లో ఓ ఇంటర్వ్యూలో బైడెన్ -
కరోనా ప్రభావంతో టెర్రరిజానికి ఆజ్యం
సాక్షి, న్యూఢిల్లీ: నేడు ప్రపంచంలోని పలు దేశాలకు గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి మున్ముందు ప్రపంచ దేశాల్లో టెర్రరిజాన్ని పెంచుతుందని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడం, ఆహారం కొరత మనుషుల్లో ఆక్రోశాన్ని, ఆగ్రహావేశాలను పెంచుతుందని, వారు ప్రభుత్వంపైనా, ప్రభుత్వ యంత్రాంగంపైనా తిరగబడేందుకు సిద్ధంగా ఉంటారని, అలాంటి సమయాల్లో ఏమాత్రం డబ్బులిచ్చి ఆదుకున్నా టెర్రరిస్టు సంస్థల్లో చేరేందుకు ప్రజలు సిద్ధమవుతారని వారు తెలిపారు. (పావురం సిక్స్ ప్యాక్ ట్రైనింగ్ అదిరింది). ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలు, పేదలు, నిరుపేదలు టెర్రరిస్టు కార్యకలాపాలపై మొగ్గుచూపే అవకాశం ఉంటుందని వారన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు బలహీనంగా ఉన్న దేశాల్లో సరిహద్దు వివాదాలు నెలకొని ఉన్న దేశాల్లో టెర్రరిజమ్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని వారు చెప్పారు. ప్రాంతీయ విభేదాలు ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో, ముఖ్యంగా నైజీరియాలో బోకో హరామ్ లాంటి టెర్రరిస్టు సంస్థలు పుట్టుకొచ్చి అలజడిని పెంచాయని వారన్నారు. 2019లో విడుదలైన ఓ అంతర్జాతీయ నివేదిక ప్రకారం ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, ఆసియాలోని 55 దేశాలు ఆహారం కొరతను ఎదుర్కొంటున్నాయి, కరోనా కారణంగా ఆ దేశాల్లో ఆహారం కొరత మరింత తీవ్రమైందని, ఆ దేశాల్లో టెర్ర రిస్టు కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉందని బాయిస్ స్టేట్ యూనివర్శిటీ పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిషా బెల్లింగర్ హెచ్చరించారు. (కరోనా: రోజుల తరబడి కోమాలో శిశువు) -
ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తాం
సాక్షి, చెన్నై: కశ్మీర్లో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తామని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. కశ్మీర్ అభివృద్ధి, సంక్షేమంపై ఇక పూర్తి స్థాయిలో కేంద్రం దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి రెండేళ్ల పయనంలో సాగిన పర్యటనలు, సందేశాలు, ఉపదేశాలు, కార్యక్రమాలతో కూడిన ‘లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్’ పుస్తకావిష్కరణ ఆదివారం చెన్నైలో జరిగింది. సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ నేతృత్వంలో రూపొందించిన ఈ పుస్తకాన్ని అమిత్షా ఆవిష్కరించారు. తొలి ప్రతిని వెంకయ్య అందుకున్నారు. విద్యార్థి దశ నుంచి ఉపరాష్ట్రపతి స్థాయి వరకు వెంకయ్య చేసిన రాజకీయ, ప్రజాసేవ గురించి అమిత్ షా వివరించారు. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేస్తామని స్పష్టం చేశారు. వెంకయ్య ఇన్నాళ్ల తన పయనాన్ని గుర్తుచేసుకుంటూ రాజకీయంగా తప్పుకున్నా, ప్రజాసేవలో, ప్రజాపయనంలో విశ్రాంతి లేదని వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నటుడు రజనీకాంత్.. వెంకయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గొప్ప ఆధ్యాత్మిక వాదిగా ఉన్న వెంకయ్య పొరపాటున రాజకీయాల్లోకి వచ్చేశారని చమత్కరించారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తదితరులు హాజరయ్యారు. అమిత్ షాకి రజినీ ప్రశంసలు కశ్మీర్ వ్యవహారం, ఆర్టికల్ 370 రద్దు విషయమై హోం మంత్రి అమిత్షాను రజినీకాంత్ అభినందించారు. ప్రధానమంత్రి మోదీ, అమిత్షా కృష్ణార్జునులని కొనియాడారు. ‘నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం కృష్ణార్జునుల ద్వయం వంటిది. అయితే వీరిద్దరిలో కృష్ణుడు ఎవరో, అర్జునుడు ఎవరో మనకు తెలీదు’ అని రజినీకాంత్ అన్నారు. త్వరలో రాజకీయ పార్టీని స్థాపించి, 2021లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని రజినీకాంత్ గతంలో చెప్పడం తెలిసిందే. -
దావూద్, సలాహుద్దీన్లను అప్పగించాలి
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్న చిత్తశుద్ధి పాకిస్తాన్కు ఉంటే దావూద్ ఇబ్రహీం, సయీద్ సలాహుద్దీన్లతో పాటు ఇతర ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పుల్వామా వంటి ఉగ్రదాడి జరిగిన తర్వాత అందుకు బాధ్యత వహించిన జైషే మహ్మద్, ఇతర ఉగ్ర సంస్థల నిర్మూలనకు చర్యలు చేపట్టడంలో పాక్ విఫలమైందని ఆరోపించాయి. ఉగ్రవాదంపై భారత్ ఆందోళనలను పాక్ పరిగణలోకి తీసుకున్నట్లయితే భారత్కు చెందిన దావూద్, సలాహుద్దీన్లతో పాటు ఇతర ఉగ్రవాదులను అప్పగించాలని స్పష్టం చేశాయి. పాక్ ఇటీవల ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా కొందరిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ అది కేవలం అలంకారప్రాయంగా చేపట్టిన చర్య మాత్రమేనని, దాంతో ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపాయి. భారత్లో జరిగిన వరుస ఉగ్రదాడులతో సంబంధమున్న దావూద్, సలాహుద్దీన్లను అప్పగించాల్సిందిగా భారత్ గత కొంతకాలంగా పాక్ను కోరుతోంది. -
ఈ టెర్రరిస్టుల్లో ఒక్కరినైనా చంపామా!?
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను తక్కువ మాట్లాడుతా, ఎక్కువ పనిచేస్తా! పాకిస్థాన్లో తలదాచుకున్న దావుద్ ఇబ్రహీం లాంటి వారిని పట్టుకురావడంలో యూపీఏ ప్రభుత్వం ఎందుకు విఫలం అవుతుందో నాకు ఆశ్చర్యంగా ఉంది. కేవలం మాటలు చెబితే సరిపోదు. టెర్రరిజమ్పై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా పదే పదే చెప్పారు. టెర్రరిజంపై తాను నిజంగా పోరాడతానని, వట్టి మాటలు చెప్పనన్నది మోదీ వ్యాఖ్యల ద్వారా స్పష్టం అవుతోంది. ఇప్పుడు 2019 వచ్చింది. అంటే మోదీ అధికారంలోకి వచ్చి దాదాపు ఐదేళ్లు కావొస్తోంది. మరి ఆయన ప్రభుత్వం కూడా దావూద్ ఇబ్రహీంను పట్టుకోలేక పోయింది. ఒక్క ఆయన్నే కాదు, టాప్ టెర్రరిస్టులను పట్టుకోవడంగానీ, కాల్చివేయడంగానీ చేయలేక పోయింది. భారత్ హిట్ లిస్ట్లో ఉండి పాకిస్థాన్లో తలదాచుకుంటున్నట్లు భావిస్తున్న టైగర్ మెమన్, అబ్దుల్ సుబాన్ ఖురేషి, ఇక్బాల్ భక్తల్, మీర్జా షాదాబ్ బేగ్, అమిర్ రాజా ఖాన్, మొహమ్మద్ ఖలీద్ ఆకా సాగిర్, భారత ఎయిర్లైన్స్కు చెందిన ఐసీ 814 విమానాన్ని హైజాక్ చేసిన ఖలిస్థాన్ టెర్రరిస్టులు వాధవ సింగ్ బబ్బర్, పరంజిత్ సింగ్ పాంజ్వర్, లఖ్బీర్ సింగ్ రోడే, రంజిత్ సింగ్ నీతా, గజిందర్ సింగ్లలో ఏ ఒక్కరిని పట్టుకోలేక పోయారు. చంపలేక పోయారు. ఇక హఫీద్ సయీద్, మసూద్ అజర్, జఖీర్ రహమాన్ లఖ్వీ లాంటి వారిని పట్టుకోవడం మాటలా? నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్పై కఠిన చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. ఆయన ఏడాదిన్నరపాటు పాకిస్థాన్తో సత్సంబంధాలను కొనసాగించారు. నరేంద్ర మోదీ అనూహ్యంగా 2015, డిసెంబర్ 25వ తేదీన అప్పటి పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ సొంతూరు రాయ్విండ్కు వెళ్లి ఆయన్ని స్వయంగా కలుసుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మనమరాలి పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు వారిరువురు యుఫాలో జరిగిన ‘షాంఘై సహకార సంఘం’ సమ్మేళనంలో కలుసుకున్నప్పుడు ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య చర్చలకు అంగీకరించారు. గురుదాస్పూర్లో టెర్రరిస్ట్ దాడి జరగడంతో వారి సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికి ఆ ఇరువురు అధికారులు 2015, డిసెంబర్ నెలలో బ్యాంకాక్లో రహస్యంగా సమావేశమయ్యారు. అంతకుముందు అంటే, 2014, నవంబర్ నెలలో నేపాల్లో జరిగిన సార్క్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్లు రహస్యంగా కలుసుకున్నారు. ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ బార్కాదత్ తన ‘ది అన్క్వైట్ ల్యాండ్’ పుస్తకం ద్వారా బయటపెట్టారు. ఇదంతా పాకిస్థాన్తో దౌత్య సంబంధాలను మెరగుపర్చుకొని తద్వారా టెర్రరిస్టు ముఠాలను అంతం చేయడం లక్ష్యం అనుకుంటే ఆ దిశగా కూడా మోదీ ప్రభుత్వం ఎలాంటి పురోగతి సాధించలేక పోయింది. మోదీ హయాంలో జరిగిన పఠాన్కోట్ ఉగ్రదాడి నుంచి మొన్నటి పుల్వామా ఉగ్ర ఆత్మాహుతి దాడి వరకు మూడేళ్ల సమయం దొరికినప్పటికీ మోదీ ప్రభుత్వం పాకిస్థాన్లో శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్న జైషే మొహమ్మద్, లష్కరే తాయిబా సంస్థలనుగానీ, పాక్లో ఆశ్రయం పొందుతున్న ఖలిస్థాన్, ఇండియన్ ముజాహిదీన్ టెర్రరిస్టులను ఏమీ చేయలేకపోయింది. పాక్స్థాన్ సైనికుల చెర నుంచి భారత పైలట్ అభినందన్ వర్థమాన్ విడుదలైన సందర్భంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘అభీ అభీ ఏక్ పైలట్ ప్రాజెక్ట్ పూరా హోగయా, పైలేతో ప్రాక్టీస్ తీ, రియల్ ప్రాజెక్ట్ అబ్ ఆగే హై’ అని బాలకోట్లో జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరంపై భారత వైమానిక దళం జరిపిన దాడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ దాడిపై అంతర్జాతీయంగా సవాలక్ష అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందు జరగబోయే దాడి ఎలా ఉంటుందో! తెలియదు. మోదీ చేతల సంగతి పక్కన పెడితే ఆయన మాటలు మాత్రం చాలా బాగుంటున్నాయి. -
ఉగ్రవాదుల మౌలిక వసతులు కూల్చండి పాక్కు సూచించిన భారత్
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు మద్దతివ్వడాన్ని ఆపాలని, తన భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల మౌలిక వసతుల్ని కూల్చివేయాలని భారత్ పాకిస్తాన్కు సూచించింది. జైషే చీఫ్ మసూద్ అజర్తో పాటు ఇతర ఉగ్రవాదుల్ని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించాలన్న తమ ప్రతిపాదనకు మద్దతు తెలపాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. పుల్వామా దాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని విదేశాంగ శాఖ ప్రకటన జారీచేసింది. ఐక్యరాజ్య సమితి, ఇతర దేశాలు నిషేధించిన, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే ఈ హేయమైన దాడికి పాల్పడిందని పేర్కొంది. జైషే చీఫ్ అయిన మసూద్ తన ఉగ్ర కార్యకలాపాల్ని విస్తరించడానికి, భారత్లో దాడులు చేసేందుకు పాకిస్తాన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని ఆరోపించింది. జాతీయ భద్రతను కాపాడేందుకు ఎలాంటి చర్యకైనా వెనకాడమని తేల్చిచెప్పింది. -
టెర్రరిజాన్ని ఎదుర్కోవడమే అతి పెద్ద సవాల్
విశాఖ: జాతి, మత, వర్ణ భేద లేకుండా చెలరేగిపోతున్న టెర్రరిజాన్ని అరికట్టడం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో ప్రారంభమైన బ్రిక్స్ దేశాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోందంటూ అంతకుమించి టెర్రరిజం పేట్రేగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్నటెర్రరిజాన్ని అంతం చేయడం అందరి బాధ్యత అని అన్నారు.