breaking news
stubborn
-
నా మొండి భర్తను మార్చగలరా!
నా భర్తకు 48 ఏళ్లు, రైల్వే ఉద్యోగి. చిన్నవయసు నుండే కుటుంబ బాధ్యతలు ఆయన మీద పడ్డాయి. అప్పటి నుండే మందుకు, స్మోకింగ్కి బానిస అయ్యారు. ఈ మధ్య గుండెకి ఆపరేషన్ కూడా అయింది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాతి రోజే మళ్లీ మందు, సిగరెట్ మెదలుపెట్టారు. ఆఫీస్కి సరిగా వెళ్ళరు. మందులు వేసుకోరు. ఈయన పరిస్థితికి భయం వేసి హైదరాబాద్లో రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేశాము. కొన్నిరోజులు అవగానే అక్కడ తిండి తినకుండా గొడవ చేసి మారుతానని బతిమిలాడితే ఇంటికి తీస్కొచ్చేశాం. బయటకు రాగానే అన్నీ – మళ్ళీ మొదలు పెట్టారు. ఇలా కనీసం ఇప్పటికి మూడుసార్లు జరిగింది. అసలు ఆయన మారతాడంటారా? సలహా ఇవ్వండి.– పద్మలత, కాజీపేట మీ భర్త ఆరోగ్యం గురించి మీరు పడే ఆందోళన, తపన అర్థం అవుతున్నాయి. ఇది ఆల్కహాల్కి బానిస అయిన చాలామంది పేషెంట్ల కుటుంబ సభ్యుల సమస్య కూడా. ఆల్కహాల్ అడిక్షన్కి వంశపారంపర్యం, వ్యక్తిత్వం, చుట్టూ ఉండే పరిస్థితులు, ఇతర మానసిక సమస్యలు... ఇలా అనేకమైన కారణాలు ఉంటాయి. మద్యం లేదా ఇతర, మత్తుపదార్థాలకు బానిస అయిన వారి మెదడు అనేకమైన మార్పులకి గురయి ఉంటుంది. వారిని ఆ అలవాటు నుండి బయట తీసుకు రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక రిహాబిలిటేషన్ అనేది చాలా నిదానంగా చేసే చికిత్స. అందుకని ఆ వ్యక్తికి మారాలి అనే ఆలోచన లేనపుడు, ఆ ఆలోచన తీసుకురావడానికి కూడా చాలా సమయం పడుతుంది. చికిత్సకి అసలు సహకరించరు. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. వీరిలో మారాలనే ఆలోచన వచ్చేలా సి.బి.టి, మోటివేషన్ ఇంటర్వ్యూయింగ్ పద్ధతులు వాడతాము. ఒకసారి మోటివేషన్ వస్తే అపుడు మళ్ళీ మద్యం జోలికి పోకుండా ఉండడానికి ‘ప్రివెన్షన్ రిలాప్స్’ పద్ధతులు చెబుతారు. దీనితోపాటు వారి జీవన శైలిలో, స్నేహితుల విషయాలలో చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రెస్ తట్టుకోడానికి, కోపం తొందరపాటు తగ్గించుకునేలా కూడా థెరపీ ఇస్తారు. 30 సంవత్సరాల అలవాటుని 30 రోజుల్లో మార్చడం అసంభవం అని గుర్తుపెట్టుకోండి! ఈ సందర్భంలోనే మీరు ఓర్పుగా, నేర్పుగా సంయమనంతో ఉండాలి. అలాగే మీరు చేర్పించే రీహాబిలిటేషన్ సెంటర్లో సరైన శిక్షణ, అనుభవం కలిగిన మానసిక వైద్యులు, కౌన్సిలర్లు, సోషల్ వర్కర్లు, యోగ థెరపిస్ట్ లాంటి సౌకర్యాలు ఉన్నాయో లేదో చూడండి. పేషెంట్తో పాటు కుటుంబ సభ్యులు కూడా రెగ్యులర్ కౌన్సెలింగ్ తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు చికిత్స పూర్తి స్థాయిలో అందించండి. అతనిలో తప్పకుండా పరివర్తన వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ !డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్ విజయవాడ(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com)(చదవండి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా క్యూట్ లవ్ స్టోరీ..! ప్రియతమ ఈ జర్నీలో..) -
పిల్లల్లో మొండితనం.. మంచికా..? చెడుకా..?
కవిత, సురేష్ తమ బిడ్డ సుమనతో కలిసి షాపింగ్కు వెళ్లారు. అక్కడ ఒక బొమ్మ సుమనకు నచ్చింది. అది కావాలని అడిగింది. ఇప్పటికే ఇంట్లో చాలా ఉన్నాయి, వద్దన్నారు. లేదు, నాకది కావాలి అని మంకుపట్టు పట్టింది. పేరెంట్స్ ఒప్పుకోలేదు. అంతే! ‘‘నాకా బొమ్మ కావాలీ’’ అంటూ కిందపడి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఎంత ప్రయత్నించినా కంట్రోల్ అవ్వడం లేదు. మాల్లో అందరూ వాళ్లనే చూస్తున్నారు. సిగ్గనిపించింది. చేసేదేంలేక ఆ బొమ్మ కొనిచ్చారు. ఇది చదువుతుంటే మీ అనుభవమూ గుర్తొచ్చింది కదా! పిల్లలు తమకు కావాల్సిన దానికోసం మొండిపట్టు పట్టడం, హఠం చేయడం తల్లిదండ్రులందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఆ సమయంలో ఎలా స్పందించాలో తెలియక, పిల్లలు అడిగింది ఇచ్చేసి సమస్య నుంచి బయటపడతారు. అయితే అలా చేయడం వల్ల పిల్లల్లో అలాంటి మొండితనం తగ్గకపోగా, పెరుగుతుందని, అలాంటి ప్రవర్తన పెరిగేందుకు తామే కారణమవుతున్నామని చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. పిల్లల్లో మొండిపట్టు సాధారణం పిల్లల్లో మంకుతనం తమ భావోద్వేగాలను, బాధను ప్రదర్శించే ప్రక్రియ. తమ కోపం, నిరాశ, విచారం లేదా నిరాశ వంటి తీవ్రమైన భావోద్వేగాలను ‘టాంట్రమ్స్’ రూపంలో వ్యక్తం చేస్తుంటారు. ఆ క్రమంలో అరుస్తారు, తంతారు, కొడతారు, వస్తువులను విసిరేస్తారు, ఊపిరి బిగపడతారు లేదా కదలకుండా కూర్చుంటారు. వయసు పెరిగే కొద్దీ, పిల్లలు భాష, భావోద్వేగాల నియంత్రణ పెంపొందించుకునే కొద్దీ ఈ ప్రవర్తన తగ్గుతుంది. సాధారణంగా ఈ మంకుతనం 15 నిమిషాలు ఉంటుంది. కానీ ఆ సమయంలో ఆ ప్రవర్తనకు తల్లిదండ్రులు ఏమాత్రం అటెన్షన్ చూపినా అది రెట్టింపవుతుంది. ‘వద్దు’ అని చెప్పింది ఇచ్చారంటే, ఆ ప్రవర్తనను ప్రోత్సహించినట్లు అవుతుంది. దాంతో భవిష్యత్తులో వాళ్లకు ఏం కావాల్సి వచ్చినా అదే మంకుతనం ప్రదర్శిస్తారు. అందువల్ల పిల్లల్లో ఈ మంకుతనం, మొండితనం తగ్గాలంటే వారికి భావోద్వేగాల గురించి అవగాహన కల్పించడం, వాటినెలా ప్రాసెస్ చేయాలో, కోపాన్నెలా నియంత్రించడం నేర్పించాలి. మొండితనానికి విరుగుడు... మూడేళ్లు అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు చిన్నచిన్న విషయాలకే నిరుత్సాహానికి గురవుతారు. తమ అవసరాలను ఎలా కమ్యూనికేట్ చేయాలో అప్పుడప్పుడే నేర్చుకుంటుంటారు. సొంతంగా పనిచేయాలని, అన్వేషించాలని కోరుకుంటారు. వాటిని ఎవరైనా అడ్డుకున్నప్పుడు మొండితనం ప్రదర్శిస్తారు. అందువల్ల ఏ విషయం వారిలో మొండితనాన్ని ప్రేరేపిస్తుందో తల్లిదండ్రులు గుర్తించాలి. బిడ్డలు తమ భావోద్వేగాలను మాటల్లో ఎలా వ్యక్తీకరించాలో ఇంకా నేర్చుకోలేదు. కాబట్టి టాంట్రమ్స్ రూపంలో వ్యక్తం చేస్తుంటారు. అందువల్ల మీరు పిల్లలతో మాట్లాడేటప్పుడు వారి భావాలను వివరించే పదాలను ఉపయోగించండి. దానివల్ల తమ అవసరాలు, కోరికలు, ఆందోళనల గురించి మీకు మాటల్లో చెప్పే వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు సినిమా చూస్తున్నప్పుడు, పాత్రలు భావోద్వేగాలను వ్యక్తం చేసినప్పుడు వాటి గురించి చెప్పండి. బొమ్మల పుస్తకాల్లో సంతోషంగా, దుఃఖంగా, కోపంతో, ఆకలితో లేదా అలసిపోయిన వంటి భావాలను వారికి చూపించండి. మీ భావోద్వేగాలను చెప్పడం ద్వారా వారు దాన్ని అనుకరిస్తారు. తమకు కావాలనుకున్నది దొరకని సందర్భాల్లో కూడా పిల్లలు సానుకూల ప్రతిచర్యలు చూపినప్పుడు, తగిన ప్రవర్తనలో నిమగ్నమైనప్పుడు వారిని మెచ్చుకోండి, బహుమతి ఇవ్వండి. ఉదాహరణకు, మీ బిడ్డ కోపం వచ్చినప్పుడు వస్తువులు విసిరేయకుండా శాంతంగా ప్రవర్తించినప్పుడు ‘‘నువ్విలా కూల్గా ఉన్నందుకు గర్వపడుతున్నాను’’ అని మెచ్చుకోండి. పిల్లలు మొండితనంతో ప్రవర్తిస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండటం కష్టమే. కానీ ఆ సమయంలో మీరే కోపంతో అరిస్తే లేదా కొడితే.. అలాంటి సందర్భాల్లో అదే సరైన ప్రవర్తనని పిల్లలు భావిస్తారు, దాన్నే అనుకరిస్తారు. అందువల్ల పిల్లలు మంకుతనం చూపినప్పుడు మీరు ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. దాన్ని చూసి వాళ్లూ నేర్చుకుంటారు. దారి మళ్లింపు అనేది మరో ప్రభావవంతమైన వ్యూహం. ముందుగా, పిల్లల మంకుపట్టుకు కారణమయ్యే ట్రిగ్గర్ను గుర్తించండి. బహుశా వారు దుకాణంలో ఒక బొమ్మను చూసి కావాలంటున్నారు. దాన్నుంచి వారి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, ‘మీ దగ్గర బొమ్మ లేదు కాబట్టి ఏడవడం సరికాదు. అక్కడ చాలా ఆటలున్నాయి. కలిసి ఆడుకుందాం రా!’ పిల్లలకు ఆప్షన్స్ ఇవ్వడం వారికి సాధికారతను అందిస్తుంది, మొండిపట్టును నివారిస్తుంది. ఉదాహరణకు, ప్లేగ్రౌండ్లో ఇంకా ఉండాలని మొండిపట్టు పట్టినప్పడు ‘సరే, ఇంకో ఐదు నిమిషాలు ఆడుకుంటావా లేక ఇంటికి వెళ్లి ఐస్క్రీమ్ తిందామా?’ అని నిర్ణయం వారికే వదిలివేయవచ్చు. టాంట్రమ్స్ నియంత్రణకు మీరు ఎంచుకున్న పద్ధతులను నిలకడగా ఉపయోగించడం ద్వారా మీ పిల్లల్లో మొండితనాన్ని కొద్ది కాలంలోనే నియంత్రించవచ్చు. -సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
‘తన్నీరు ఇల్లె తంబీ’
► మాకే లేవు మీకెలా ► కృష్ణ నీటిపై ఏపీ ► వర్షాలు కురిపించలేం ► చెన్నైలో దాహార్తికి తంటాలు వర్షాలు కురవక జలాశయాలు ఎండిపోయి మాకే నీళ్లు లేవు. మీకెలా ఇస్తాం.. తన్నీరు ఇల్లె తంబీ (నీళ్లు లేవు తమ్ముడు) అంటూ తమిళనాడుపై యుగళగీతం పాడాయి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు. తాగునీరు, సాగునీరు కోసం తిప్పలు పడుతున్న తమిళనాడు పొరుగురాష్ట్రాలపై ఆధారపడగా వారు సైతం మొండిచేయిచూపారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై దాహార్తిని తీర్చే జలాశయాల్లో పూండి జలాశయం ఎంతో ముఖ్యమైంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 3,231 మిలియన్ ఘనపుటడుగులు కాగా ప్రసుత్తం 20 మిలియన్ ఘనపుటడుగులు మాత్రమే ఉంది. గత ఏడాది జూలై 17వ తేదీన 776 మిలియన్ ఘనపుటడుగుల నీరు నిల్వ ఉంది. గత ఏడాది తగిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో తమిళనాడులోని జలాశయాలు నిండలేదు. దీంతో నాలుగు నెలల క్రితమే పూండి జలాశయం ఎండిపోయింది. పుళల్, చెంబరబాక్కం, చోళవరం, వీరాణం జలాశయాలు ఎడారిని తలపిస్తుండగా చెన్నైలో తాగునీటి ఇబ్బందులు మరింతగా పెరిగిపోయాయి. ఈ దుర్భరస్థితిని తట్టుకునేందుకు మాంగాడు క్వారీల నుంచి నీరు, పోరూరు జలాశయం నీటిని శుద్ధి చేసి చెన్నైకి పంపుతున్నారు. ఇదిగాక నైవేలీ సొరంగ నీరు, సముద్రపు నీటి నిర్లవీకరణతో తాగునీటికి అవసరాలను ఓమేరకు తీరుస్తున్నారు. వ్యవసాయ బావులు, బోర్ల నీటిని చెన్నైకి తరలిస్తున్నా చాలడం లేదు. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కండలేరు జలాశయం ద్వారా పూండికి కృష్ణానది నీరు విడుదల చేయడం పరిపాటి. అయితే కృష్ణనీరు రాలేదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్యన జరిగిన ఒప్పందం ప్రకారం జనవరి నుంచి ఏప్రిల్ వరకు కండలేరు నుంచి పూండికి 8 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఆ తరువాత జూలై నుంచి అక్టోబరు వరకు మరో 4 టీఎంసీలను విడుదల చేయాలి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి తరువాత కృష్ణనీరు విడుదల చేయకపోవడంతో తమిళనాడు అధికారులు ఏపీకి ఉత్తరం రాశారు. అయితే ఏపీ ప్రభుత్వం నీటి విడుదల చేయలేమంటూ చేతులెత్తేసింది. కావేరీలో నీళ్లు లేవు : కర్ణాటక మంత్రి కావేరి వాటా జలాలను తమిళనాడుకు విడుదల చేసేలా ఆదేశించాలని సుప్రీం కోర్టులో తమిళనాడు ప్రభుత్వ న్యాయవాదులు వాదన వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి పటేల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, గత నెల 1వ తేదీ నుంచి ఈనెల 17వ తేదీ వరకు 44 టీఎంసీల నీటిని తమిళనాడుకు వదలాల్సి ఉంది. అయితే పులిగుండు జలాశయం నుంచి 2.2 టీఎంసీల నీటిని వదిలినట్లు రికార్డులు చెబుతున్నాయని అన్నారు. తమ రాష్ట్రానికే తగినంత నీరు అందుబాటులోని తరుణంలో తమిళనాడు ఒత్తిడి చేస్తోందని చెప్పారు. గత ఏడాది జూలైలో కర్ణాటక జలాశయాల్లో 57 టీఎంసీల నీళ్లు ఉండగా, ప్రస్తుతం 26 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని అన్నారు. అందుబాటులో ఉన్న నీటితో కర్ణాటక అవసరాలే తీరనపుడు తమిళనాడుకు నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తమిళనాడుకు తన్నీరు కోసం కర్ణాటకలో వర్షం కురిపించలేమని ఆయన ఎద్దేవా చేశారు. వర్షాలు లేవు.. నీళ్లు రావు : ఆంధ్రప్రదేశ్ ఏపీకి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, కండలేరు జలాశయంలో 8 టీఎంసీల నిల్వ ఉంటేనే తమిళనాడుకు నీళ్లు ఇవ్వగలం, కనీసం 5 టీఎంసీలైనా ఉండాలని అన్నారు. అయితే ఇప్పుడున్న నీళ్లు మాకే చాలవని, వర్షాలు పడిన తరువాతనే లేకుంటే ఎటువంటి పరిస్థితిల్లోనూ నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వం తమకివ్వాల్సిన రూ.460 కోట్ల బాకీని ముందు చెల్లించాలని ఆయన తిరుగుబాణం వేశారు.