breaking news
Satyanarayana Swamy Temple
-
అమ్మాయికి అంకుల్తో పెళ్లి.. ఆగింది ఇలా..!
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలో శనివారం తెల్లవారుజామున ఒక పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. రామాలయం వద్ద గల విశ్రాంతి మంటపంలో జరుగుతున్న ఒక వివాహంలో వధువు గట్టిగా విలపించడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులు ఆమె వద్దకు వెళ్లి ప్రశ్నించారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఆమె తెలిపింది. తన వయసు 22 ఏళ్లు అని, తన కంటే 20 ఏళ్లు పెద్దయిన వ్యక్తితో తనకు వివాహం జరిపిస్తున్నారని విలపించింది. దీంతో సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆ పెళ్లిని నిలిపివేసి, వధూవరులను, ఇరువైపులా పెళ్లి పెద్దలను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ ఎస్సై శ్రీహరి రాజు వధువును ప్రశ్నించగా తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, పెళ్లి కొడుకు వయసు 42 ఏళ్లు అని తెలిపింది. అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని చెప్పి వధూవరుల కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. పెళ్లి చేయించేందుకు అంగీకరించిన పురోహితుడిని కూడా మందలించారు. కాగా.. వధూవరులిద్దరిదీ నెల్లూరు జిల్లానే. వధువు ఉతుకూరుకు, వరుడు కందుకూరుకు చెందినవారు. బలిజ సామాజికవర్గానికి చెందిన వధువు కుటుంబీకులు పేదవారు. అమ్మాయికి పెళ్లి చేసే స్థోమత లేక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వరుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించినట్టు తెలిసింది. దీనిపై ఎవ్వరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనందున కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. -
ఆలయం సన్నిధిలోనే దిగ్భ్రాంతికర సంఘటనలు
విశాఖపట్నం డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ: పవిత్రమైన, ప్రముఖమైన ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. దైవ సన్నిధిలోనే ఆలయం పరువుకు గ్రహణం వాటిల్లింది. ఇసుక కొండపై వెలసిన రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో మూలవిరాట్టు సన్నిధిలోనే క్షోభ కలిగించే సంఘటన జరిగింది. ఆషాడ పౌర్ణమి రోజున.. ఉదయ సమయంలో పూజలు జరుగుతూ ఉండగా.. ఆలయ ప్రధానార్చకుడు సూపరింటెండెంట్పై గర్భగుడిలోనే దాడి చేయడంతో కలవరం చోటు చేసుకుంది. భక్తులంతా నివ్వెరపోయి చూస్తూ ఉండగానే ఈ ఉదంతం జరిగింది. భక్తులకు, భగవానుడికి మధ్య వారధిగా ఉండే అర్చకుడు ఇలా హేయంగా ప్రవర్తించారని దేవాలయాల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురు పూర్ణిమ పురస్కరించుకొని శుక్రవారం ఉదయం భక్తులు సత్యనారాయణస్వామి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయంలో పూజలు జరుగుతున్నాయి. భక్తుల, ఆలయం ఈవో శైలజ కథనం ప్రకారం.. ప్రధానార్చకుడు అనధికారికంగా ఓ పూజారిని తీసుకువచ్చి గర్భగుడి వద్దనియోగించారు. ఆయన కారణంగా గర్భగుడిలో స్వామి విగ్రహం కనిపించకుండా ఉందని భక్తులు అనడంతో సూపరింటెండెంట్ సురేష్ ఆయనను పక్కకు జరగమని ఆలయ సూపరింటెండెంట్ సురేష్ కోరారు. దీంతో ప్రధానార్చకుడు ఫణిహార నరసింహమూర్తికి కోపం కట్టలు తెంచుకుంది. సూపరింటెండెంట్పై మండిపడడమే కాక, దేవుని చెంత, భక్తులు చూస్తుండగా అతడి చెంప ఛెళ్లుమనిపించారు. ఎడాపెడా కొడుతూ విరుచుకుపడ్డారు. అక్కడే ఉన్న ఆయన కుమారుడు కూడా ఓచెయ్యి వేశారు. సురేష్పైనే గాక అల్లిపురం వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి డి ప్యూటేషన్పై వెళ్లిన రవిపై కూడా ఇద్దరూ దాడికి దిగారు. ఇదంతా సీసీ కెమారాల్లో రికార్డయింది. ఈ సంఘటనలతో భ క్తులు నివ్వెరపోయారు. వెంటనే ఆలయ ఈవో కె.శిరీష అక్కడకు వచ్చి ఇద్దరికీ నచ్చజెప్పారు. దక్షిణలు కూడా వారికే.. ప్రధానార్చకుడు నరసింహమూర్తి సుమారుగా రూ. 50వేల వేతనం అందుకుంటున్నారు. ఆయన కుమారుడు ఆరేళ్ల కిందట అర్చకుడిగా నియమితులయ్యారు. ఆయనకూ పీఆర్సీ ప్రకారం వేతనం వస్తోంది. ఇదికాక పళ్లెం రాబడిని కూడా వారే తీసుకుంటున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. రూ. 5 లక్షల పైబడి రాబడి ఉన్న ఆలయాల్లో పీఆర్సీ ప్రకారం వేతనాలు తీసుకుంటున్న అర్చకులు ఎట్టి పరిస్థితుల్లోనూ పళ్లెంలో నగదు తీసుకోకూడదని సిబ్బంది వాదిస్తున్నారు. దీనిపై విభేదాలు ఉండవచ్చని, అర్చకుడి దాడికి అది కారణం కావచ్చని అభిప్రాయం వినవస్తోంది. దేవాదాయ శాఖ ఉద్యోగుల ఆగ్రహం పవిత్రమైన బాధ్యతలు నిర్వర్తించే అర్చకులు ఇలా దాడులు చేయడంపై వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది మండిపడతున్నారు. సిబ్బందితో సమన్వయంగా మెలిగి, ఆలయం పట్ల భక్తుల్లో గౌరవప్రపత్తులు పెంచాల్సినవారు ఇలా దాడి చేస్తే దేవాలయం పరువుప్రతిష్టలు ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. దాడులకు దిగిన పూజారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముగిసిన విచారణ ఆలయంలో జరిగిన సంఘటనలపై దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ మూర్తి విచారణ నిర్వహించారని ఈవో శైలజ తెలిపారు. ఆయన నివేదికను కమిషనర్ కార్యాలయానికి పంపినట్టు తెలియజేశారు. మరోవైపున అర్చకుల తీరును నిరసిస్తూ ఆలయంలో సిబ్బంది శనివారం నుంచి విధులకు గైర్హాజరవుతున్నట్టు నోటీసు ఇచ్చారని ఆమె చెప్పారు. అర్చకులపై చర్యలు తీసుకునేటంత వరకు విధులకు హాజరు కాబోమని తెలిపారన్నారు. అనుమతి లేకుండానే.. ప్రతి పౌర్ణమికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆలయంలో ప్రధానార్చకుడితోపాటు ఆయన కుమారుడు కూడా విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ పౌర్ణమికి వారిద్దరే కాకుండా నా అనుమతి లేకుండా ఓ అర్చకుడిని తెచ్చి గర్భగుడిలో నియోగిస్తున్నారు. ఈ విషయం నా దృష్టికి రావడంతో, సూపరింటెండెంట్ సురేష్ను అక్కడికి పంపించి లోపల ఉన్న పూజారిని బయటకు రప్పించాలని ఆదేశించాను. సూపరింటెండెంట్ గర్భగుడి వద్దకు వెళ్లి లోపల ఉన్న వ్యక్తిని బయటకు వచ్చేమని చెబితే..ప్రధానార్చకుడు, మిగిలినవారు సూపరింటెండెంట్పై దాడికి దిగారు. భక్తుల ముందు ఇలా దాడి చేయడం సబబు కాదని ప్రధానార్చకుడికి స్పష్టం చేశాను. ఈ విషయంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ విచారణ చేపడుతుంది.–కె.శిరీష, ఈవో,సత్యనారాయణ స్వామి ఆలయం -
ఆలయంలో హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు
ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు అక్కడే ఉన్న హుండీని ఎత్తుకుపోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం కలిగోట గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి సత్యనారాయణ స్వామి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భగుడిలో విలువైన వస్తువులు ఏమీ లేకపోవటంతో హుండీని పెకిలించుకు పోయారు. శుక్రవారం ఉదయం గమనించిన పూజారి గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. ఈ మేరకు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుండీలో సొత్తు ఎంత ఉంటుందనే తెలియరాలేదు.