samakyandhara
-
అసెంబ్లీ రేపటికి వాయిదా
-
శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా
హైదరాబాద్: శాసనసభ శీతాకాల సమావేశాలు రేపటికి వాయిదా వేశారు. సమావేశాలు సమైక్యాంధ్ర నినాదాలతో ప్రారంభమయ్యాయి. సమైక్య రాష్ట్ర తీర్మానం కోసం వైఎస్ఆర్ సిపి సభ్యులు డిమాండ్ చేశారు. సభలో సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టు ముట్టి నినాదాలు చేశారు. సంతాప తీర్మానాలకు సహకరించాలని శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, టిఆర్ఎస్ నేత కెటిఆర్, ఇతర పార్టీల నేతలు జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్కు నివాళులర్పించారు. ఆ తరువాత స్పీకర్ శాసనసభను రేపటికి వాయిదా వేశారు. -
పాటల తూటా.. పోరు బావుటా
సాక్షి, కర్నూలు: సమైక్య పోరు హోరెత్తుతోంది. విభజన నిర్ణయంపై ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తోంది. నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బుధవారం జిల్లా కేంద్రంలో కళాకారులు గజ్జెకట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పాటల తూటాలు పేల్చి.. పోరుబావుటా ఎగురవేశారు. విభజనకు కారణమైన కాంగ్రెస్ నాయకులు రాజీనామాల డ్రామాతో దొంగ దీక్షలు చేస్తున్నారంటూ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరంపై టమాటాలు విసిరి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న వాగ్వాదంలో ఉపాధ్యాయులు శిబిరాన్ని ధ్వంసం చేశారు. కలెక్టరేట్ వద్ద కళాకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఆడిపాడిన పాటలు సమైక్యవాదుల్లో ఉత్సాహం నింపాయి. సంక్షేమభవన్ ఉద్యోగులు కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు జెడ్పీ నుంచి పాతబస్టాండ్ వద్దనున్న తెలుగుతల్లి విగ్రహం వరకు మోటారు సైకిళ్లతో ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. డోన్ పట్టణంలో రైతుగర్జన పెద్ద ఎత్తున సాగింది. దాదాపు 3వేల మంది రైతులు ఎద్దులబండ్లతో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఆదోనిలో 48 గంటల బంద్ మొదటి రోజు విజయవంతమైంది. ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేశారు. చాగలమర్రిలో ఉద్యోగ జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఆలూరులో గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్ష నిర్వహించారు. పత్తికొండలో జేఏసీ చేపట్టిన రిలేనిరాహార దీక్షలకు మద్దతుగా వాల్మీకుల సంఘం ఆధ్వర్యంలో 20 మంది దీక్షలో కూర్చొన్నారు. ఎమ్మిగనూరులో మున్సిపల్ పారిశుద్ధ్య విభాగం ఉద్యోగులు స్థానిక కార్యాలయం నుండి శివ సర్కిల్ వరకు ట్రాక్టర్లు, ఆటోలతో ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పాడ్డారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్టీ యువజన నాయకుడు బందెనవాజ్, విద్యార్ధి సంఘం నాయకులు చేపట్టిన 48 గంటల దీక్ష ముగియడంతో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి జ్యూస్ ఇచ్చి దీక్ష విరమింపజేశారు. -
న్యాయవాదుల రిలే దీక్షలకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర కోసం జిల్లా కోర్టులో న్యాయవాదుల సంఘం సభ్యులు, న్యాయశాఖ ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలకు బుధవారం నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ పి.అనిల్కుమార్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ తెలుగు జాతి అంతా ఒకటిగా ఉండాలన్న కాంక్షతో ప్రతి ఒక్కరూ రోడ్లమీదకు వచ్చి అనేకరకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారన్నారు. అయినా కాంగ్రెస్ అధిష్టానంలో మాత్రం చలనం లేదని విమర్శించారు. తెలంగాణలో పెట్టుబడిదారుల ప్రోద్బలంతో ఉద్యమం జరిగిందన్నారు. సీమాంధ్రలో మాత్రం విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి ఉద్యమిస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో, ఎన్నో రాష్ట్రాల్లో విడిపోయేందుకు ఉద్యమాలు సాగాయని, మన రాష్ట్రంలో సీమాంధ్రలో సమైక్యంగా ఉంటామని ఆందోళనలు జరగడం ఉద్యమ ఖ్యాతి ఈ ప్రాంతానికే దక్కుతుందన్నారు. ఎంతో కాలంగా ప్రజలందరితో పాటు ఎందరో ముఖ్యమంత్రులు హైదరాబాద్ను అభివృద్ధి చేశారన్నారు. హైదరాబాద్కు కొన్ని వేల రెవెన్యూ వస్తుంటే రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైతే ఇచ్ఛాపురం నుంచి తడ వరకు సీమాంధ్రులు మంచి నీటి కోసం అల్లాడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోసం న్యాయవాదులు చేసే ఏ దీక్షకైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. న్యాయశాఖ ఉద్యోగులు ఎస్ చక్రవర్తి, శివకుమార్, కె. నర్సింహులు, ఆర్. మాల్యాద్రి, పీవీ నర్సింహులురెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సంక్రాంతి కల్యాణ్, ముప్పసాని శ్రీనివాసులు, ఎ.బాలకోటేశ్వరావు, ఎస్కే సుభాన్, గంధం సుధీర్బాబు, న్యాయవాదులు పాల్గొన్నారు.