breaking news
oil bussiness
-
రష్యాకు భారత్, చైనా ఆశాకిరణాలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై యుద్ధంతో ప్రపంచ దేశాల ఆర్థిక ఆంక్షలకు గురైన రష్యాకి, మిత్ర దేశాలైన భారత్, చైనా చేదోడుగా నిలుస్తున్నాయి. మే నెలలో రష్యా ఎగుమతి చేసిన చమురులో 80 శాతం ఈ రెండు దేశాలే కొనుగోలు చేసినట్టు అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) ప్రకటించింది. ‘‘మార్కెట్ కంటే తక్కువకు వచ్చే రష్యా చమురు కొనుగోలుకు ఆసియాలో కొత్త కొనుగోలుదారులు లభించారు. భారత్ రోజువారీ కొనుగోళ్లు 2 మిలియన్ బ్యారెళ్లకు మించింది. చైనా రోజువారీ కొనుగోళ్లను 0.5 మిలియన్ బ్యారెళ్ల నుంచి 2.2 మిలియన్ బ్యారెళ్లకు పెంచింది’’అని ఐఈఏ తన తాజా నివేదికలో ప్రస్తావించింది. మే నెలలో భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా 45 శాతం సమకూర్చగా, చైనాలో ఇది 20 శాతంగా ఉన్నట్టు వివరించింది. రష్యా సముద్రపు ముడి చమురులో 90 శాతం ఆసియాకు వెళ్లిందని, యుద్ధానికి ముందు ఇది 34 శాతంగా ఉండేదని వివరించింది. ‘‘ఏప్రిల్ నెలతో పోలిస్తే భారత్ మే నెలలో 14 శాతం అధికంగా చమురుని రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. మే నెల మొదటి మూడు వారాల్లో సగటు రష్యా చమురు బ్యారెల్ 26 డాలర్లుగా ఉంది’’ అని వివరించింది. భారత్ జీడీపీ 4.8 శాతం భారత్ జీడీపీ 2023 సంవత్సరంలో 4.8 శాతం వృద్ధి సాధిస్తుందని ఐఈఏ అంచనా వేసింది. 2024లో ఇది 6.3 శాతానికి చేరుతుందని, తదుపరి 2025 నుంచి 2028 మధ్య 7 శాతంగా ఉంటుందని పేర్కొంది. జనాభా పెరుగుదుల, మధ్య తరగతి విస్తరణ సానుకూలమని భావించింది. ప్రపంచ చమురు వినియోగ డిమాండ్లో చైనాను భారత్ 2027లో వెనక్కి నెట్టేస్తుందని అంచనా వేసింది. -
జీడి పప్పు తొక్కతో లాభాలెన్నో.. లక్షల్లో సంపాదన!
కాశీబుగ్గ: జీడి పప్పు రుచి అందరికీ తెలిసిందే. జీడి పప్పు తయారీ విధానం, వ్యాపారం కూడా చాలా మందికి పరిచయమే. కానీ ఆ జీడిపప్పుకు కవచంలా ఉండే తొక్కతో కూడా లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతుందని తెలుసా..? ఈ తొక్కతో తయారు చేసే ఆయిల్ మిశ్రమానికి విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది. అందుకే పలాస నుంచి మన దేశంలోని ఇతర ప్రాంతాలకే కాకుండా విదేశాలకు కూడా ఈ ఆయిల్ను ఎగుమతి చేస్తున్నారు. ఆ రక్షణ కవచమే.. జీడి చెట్టు పువ్వుల నుంచి జీడి పిక్కలు కాస్తాయి. పిక్కల దశ నుంచి పప్పు తయారీ వరకు సహజ సిద్ధంగా ఉండే రక్షణ కవచాలే జీడి తొక్కలు. జీడి గుడ్డు సేకరణ అనంతరం ఈ తొక్క ఎందుకూ పని రాదని ఒకప్పుడు పడేసేవారు. అవే నేడు కోట్లు కురిపిస్తున్నాయి. ఇప్పుడు తొక్క కిలో రూ.10 పలుకుతోంది. రోజుకు 300 నుంచి 400 టన్నుల వరకు జీడి తొక్కను ఆయిల్ తీయడానికి వినియోగిస్తున్నారు. ఈ మూలంగా 8000 లీటర్ల ఆయిల్ను సేకరిస్తున్నారు. ముడి సరుకుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఫుల్ డిమాండ్.. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 300 వరకు జీడిపరిశ్రమలు, జిల్లా వ్యాప్తంగా, ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో మరో 100 పరిశ్రమల్లో జీడి పప్పు తయారీ జరుగుతుంది. పప్పు సేకరణ అనంతరం జీడితొక్కను పక్కన పడేయకుండా, కొందరు వంట చెరకుగా వినియోగిస్తుంటే మరికొందరు కిలోల లెక్కన ఆయిల్ పరిశ్రమలకు విక్రయిస్తున్నారు. పలాస పరిసరాల్లో సుమారు 12 జీడి ఆయిల్ పరిశ్రమలు ఉన్నాయి. రోజుకు 4 లక్షల కేజీల జీడి పిక్కలను వినియోగించి వాటి నుంచి వచ్చే 3 లక్షల కేజీల తొక్కతో 8000 లీటర్లు ఆయిల్ సేకరిస్తారు. అనంతరం మిగిలిన పదార్థాన్ని వంటచెరకు కింద వాడుతున్నారు. రెండోసారి సది్వనియోగమయ్యే వస్తువుగా పరిగణించిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేసింది. పూర్తి ప్రోత్సాహకాలతో పాటు జీఎస్టీ రేట్లను సైతం పూర్తిగా తగ్గించింది. పరిశ్రమల్లో మంట కోసం ఇలాంటి వాటిని వినియోగించాలని కోరుతోంది. ఆయిల్ ఉత్పత్తి ఇలా.. జీడి పరిశ్రమలో లభించిన తొక్క బస్తాలను వ్యాను, లారీల్లో వే బ్రిడ్జిల వద్ద తూస్తారు. అక్కడి నుంచి కూలీల సహకారంతో ఆయిల్ పరిశ్రమలకు చేరుస్తారు. అక్కడే అసలు పరీక్ష ఉంటుంది. జీడి తొక్కలో ఆయిల్ ఉందా లేదా అని తొక్కకు పరీక్షలు జరిపి వాటిని ఆయిల్ పరిశ్రమలో మిషనరీకి బెల్టుతో పంపుతారు. కిలోల చొప్పున పంపించి వాటిని పిండి పిప్పి చేసి ఆయిల్ను ప్రత్యేకమైన కెనాల్ ద్వారా సిమెంట్ బావికి తరలిస్తారు. అక్కడ కొన్ని రోజులు తేటగా మారిన అనంతరం తిరిగి ట్యాంక్లోకి పంపించి 90 డిగ్రీల వరకు వేడి చేసి నీటిని ఆవిరి రూపంలో బయటకు పంపిస్తారు. అనంతరం డ్రమ్ములతో నింపి ట్రాన్స్పోర్టు లారీల్లో వివిధ ప్రాంతాలకు పంపిస్తారు. మన దేశంలో హైదరాబాద్, విశాఖపట్నం, రాజస్థాన్, పంజాబ్, బెంగళూర్తోపాటు విదేశాలకు పంపిస్తారు. అక్కడ ఆయిల్ను ఆయా కంపెనీలు వివిధ రకాలుగా రూపాంతరం గావించి వాటిని సౌత్ కొరియా, ఖతార్, వియత్నాం, రష్యా, చైనా వంటి విదేశాలకు పంపుతారు. ఉపాధి కోణం.. జిల్లా వ్యాప్తంగా జీడి పరిశ్రమలపై ఆధారపడి 20వేల మంది వరకు జీవిస్తుండగా.. జీడి తొక్క ఆయిల్ పరిశ్రమలు కూడా మరో రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఉపయోగాలెన్నో.. ఈ ముడి సరుకును రోడ్లకు వాడే తారు ఫ్యాక్టరీల్లో తారు తయారీకి, పెయింటింగ్స్ తయారీలో, వార్నిష్లు, బయోడీజిల్ తయారీకి వాడుతున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పునీటి కారణంగా పెద్ద పెద్ద షిప్లు, బోట్లు, స్టీమర్లు, పాడైపోకుండా ఈ ఆయిల్ను తరచుగా పూస్తారు. విదేశాలకు ఎగుమతి.. పలాస నుంచి విదేశాలకు జీడిపప్పే కాదు జీడి ఆయిల్ సైతం ఎగుమతి కావడం మన ప్రాంత గొప్పతనంగా భావిస్తున్నాను. ప్రపంచమంతా వినియోగించే తారు, పెయింటింగ్స్, బయోడీజిల్ తయారీలో మన పలాస ఆయిల్ వాడటం మనం గొప్పగానే చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఆయిల్ సేకరణ పెరిగి మరింత మందికి ఉపాధి కలుగుతుంది. వైఎస్సార్ చలవతో పలాస ఇండస్ట్రియల్ ఏరియాలో మేము జీడి పరిశ్రమతో పాటు ఆయిల్ సేకరించే పరిశ్రమను ఏర్పాటు చేసుకుని నడుపుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో రాయితీలు అందించింది. ఔత్సాహికులకు ఇలాంటి పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తే మరింత మేలు జరుగుతుంది. – కోరాడ శ్రీనివాసరావు, ఆయిల్ పరిశ్రమ యజమాని, ఇండ్రస్టియల్ ఏరియా, పలాస. -
ఐఎస్ టెర్రరిస్టుల వద్ద రూ.13 వేల కోట్లు
న్యూఢిల్లీ: మానవ సమూహం మధ్య బాంబులై పేలి మారణ హోమానికి పాల్పడుతూ ప్రపంచంలో భీతావహం సృష్టిస్తున్న ఐఎస్ టెర్రరిస్టు మూకలు నేడు అపార ధనరాశులు కలిగి ఉన్నాయి. ప్రస్తుతం వారి వద్ద 13వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నట్టు ఓ తాజా అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. ఇటు డబ్బులోనూ అటు మారణహోమం సృష్టించడంలోను ప్రపంచంలోనే నెంబర్ వన్ టెర్రరిస్టు సంస్థగా ఐఎస్ ముద్రపడింది. సిరియా, ఇరాక్లలో పది చమురు క్షేత్రాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఐఎస్ టెర్రరిస్టులు రోజూ 30 వేల నుంచి 40 వేల బ్యారెళ్ల వరకు అక్రమ మార్గంలో క్రూడాయిల్ విక్రయిస్తూ రోజుకు పది కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నాయి. టర్కీ, ఇరాన్, జోర్డాన్ దేశాలు చీకటి మార్గంలో టెర్రరిస్టుల నుంచి ఆ ఆయిల్ను కొనుగోలు చేస్తున్నాయి. కిడ్నాప్ల ద్వారా ర్యాండమ్ కింద ఏడాదికి 300 కోట్ల రూపాయలను సమకూర్చుకుంటున్నాయి. ఇరాక్లో దాదాపు 40 శాతం గోధమ పంటను తమ ఆధీనంలోకి తెచ్చుకొని కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నాయి. సిరియాలో తమ ఆధీనంలో నివసిస్తున్న కోటి మంది ప్రజల నుంచి 20 శాతం ఆదాయం పన్నును వసూలు చేస్తున్నాయి. వాహనాల రాకపోకలపై రోడ్డు పన్నును విధిస్తున్నాయి. అంతేకాకుండా ఇస్లాం మతం పుచ్చుకోని క్రైస్తవుల నుంచి ప్రాణ రక్షణ పన్నును గుంజుతున్నాయి. ప్రాణ భీతితో దేశంవీడి వలస వెళుతున్న వారి నుంచి ఒక్కొక్కరి వద్ద ఆరున్నర వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. దౌర్జన్యం, బెదిరింపుల ద్వారా వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున నిధులను రాబడుతున్నాయి. ఇలా వచ్చిన సొమ్మును అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేయడానికి టెర్రరిస్టుల నియామకానికి వినియోగిస్తున్నాయి. మానవ బాంబులుగా మారేందుకు సిద్ధపడిన యువకులకు ముందుగానే కోట్ల రూపాయలను అందజేస్తున్నాయి. ముందుగా సిరియా, ఇరాక్ ప్రభుత్వ సైనికులను, వారికి మద్దతిస్తున్న యూరప్, మధ్యప్రాచ్య దేశాల సైనికులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపిన ఐఎస్ టెర్రరిస్టులు ఇప్పుడు పంథా మార్చారు. జన సమూహాన్ని ఎంచుకొని మారణ హోమాన్ని సృష్టించడం లక్ష్యంగా చేసుకొన్నారు. ఆ వ్యూహంలో భాగంగానే పారిస్లో ఏకకాలంలో ముంబై తరహా దాడులు జరిపి దాదాపు 140 మందిని అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు.