breaking news
nalgonda - deverakonda
-
ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
నిడమనూరు: నిడమనూరు మండలం బొక్కమంతలపహాడ్ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం రాత్రి కోదాడ–జడ్చర్ల రహదారిపై బొక్కమంతలపహాడ్ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బొక్కమంతలపహాడ్ గ్రామానికి చెందిన ధర్మారపు మల్లేశ్వరి హైదరాబాద్లోనే సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి హాస్టల్లో ఉంటూ నిమ్స్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. అదే గ్రామానికి కుక్కల జాన్రెడ్డి కూడా హైదరాబాద్లోనే రీహాబిలిటేషన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఒకే గ్రామం కావడంతో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. జాన్రెడ్డి ఇటీవల మరో యువతిని వివాహం చేసుకోవడంతో అది భరించలేక మల్లేశ్వరి ఆదివారం హాస్టల్లో విషపూరితమైన ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధువులు మల్లేశ్వరి మృతదేహాన్ని బొక్కమంతలపహాడ్ గ్రామానికి తమకు న్యాయం చేయాలని జడ్చర్ల– కోదాడ జాతీయ రహదారిపై రాత్రి వరకు రాస్తారోకో చేపట్టారు. -
అందాల భామలకు ఆతిథ్యం! యాదగిరిగుట్టకు ప్రపంచ సుందరీమణులు
అందాల భామలకు అతిథ్యమిచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా సిద్ధమవుతోంది. హైదరాబాద్లో మే 7 నుంచి 31 వరకు 72వ ఎడిషన్ మిస్ వరల్డ్–2025 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీలకు 140 దేశాల నుంచి మూడు వేల మంది అందాల భామలు, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. వారిద్వారా హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. అందులో భాగంగా అందాల భామలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్పోచంపల్లి, యాదగిరిగుట్ట, నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఇలా వివిధ దేశాల అందాల భామలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావడం ద్వారా ఆయా ప్రాంతాలకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. మే 15న ఇక్కత్ వస్త్రాలతో ర్యాంప్వాక్..ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతీయంగా పేరుగాంచిన భూదాన్పోచంపల్లికి మిస్వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే 15వ తేదీన రానున్నారు. వీరు ఇక్కడి చేనేత కార్మికులతో ముఖాముఖి మా ట్లాడుతారు. అనంతరం మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారు. తరువాత చేనేత చీరలు ధరించి ర్యాంప్వాక్ చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. మిస్వరల్డ్ పోటీల ఈవెంట్లను నిర్వహించే పోచంపల్లి ఇక్కత్వస్త్రాల విశిష్టతను వీడియోగ్రఫీ చేస్తున్నారు. ఫలితంగా చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మరింత పేరును తీసుకురావడమే ఈవెంట్ల ముఖ్య ఉద్దేశమని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ పేర్కొంటోంది. ఇప్పటికే అనేక ఫ్యాషన్ ఈవెంట్లకు వేదికైన పోచంపల్లికి ఇప్పుడు మరోసారి ప్రపంచ సుందరీమణులు వస్తుండడంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ ఖ్యాతి పొందనుంది.ఇటీవలే యాదగిరి క్షేత్రాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా ఇటీవల యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని మిస్ వరల్డ్ –2024 క్రిస్టినా పిస్కోవా సందర్శించారు. ఆలయం అద్భుతమని కొనియాడారు. వాస్తు శిల్పం, ప్రశాంతమైన పరిసరాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం యాదగిరి క్షేత్రాన్ని తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశమని ఆమె పేర్కొన్నారు. ఆమె ప్రకటనతో మే 15న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందెగత్తెలంతా యాదగిరి క్షేత్ర సందర్శనకు వచ్చి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందనున్నారు. విజయ విహార్లో విడిదిప్రపంచదేశాల బౌద్ధులను ఆకర్షించేందుకు నాగార్జునసాగర్లోని కృష్ణానది తీరంలోని బుద్దవనాన్ని ప్రపంచ అందెగత్తెలు మే 12న సందర్శనున్నారు. బౌద్దుల చరిత్ర, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని వారు తెలుసుకోనున్నారు. వారికి ఇక్కడి బౌద్ధసంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా గుర్తింపు దక్కేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మిస్వరల్డ్ పోటీదారులు సాగర్లో ఇక్కడ విడిది చేయడానికి గాను విజయవిహార్లోని గదులను ఆధునీకరిస్తున్నారు. రూ.5 కోట్ల వ్యయంతో అన్ని హంగులు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయా పనులు ప్రారంభించారు. వారి విడిదికి సకల హంగులు కల్పిస్తూ.. విజయ విహార్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ, నల్లగొండ కలెక్టర్, ఉన్నతాధికారులు నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో సమావేశం నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక నగరికి.. మే 15వ తేదీనే అందాల భామలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడ గడపనున్నారు. వారు 15వ తేదీన హైదరాబాద్ నుంచి నేరుగా యాదగిరికొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్కు చేరుకుని.. అక్కడి నుంచి యాదగిరి క్షేత్రానికి వస్తారు. విష్ణు పుష్కరిణిలో సంకల్ప పూజలు చేసి, ప్రధానాలయం సమీపంలో ఉన్న అఖండ దీపారాధన పూజల్లో పాల్గొంటారు. శ్రీస్వామి వారి దర్శనం తర్వాత ప్రధానాలయ పునః నిర్మాణాన్ని మిస్ వరల్డ్ పోటీ దారులు పరిశీలించి, ఇక్కడే ఒక డాక్యుమెంటరీ సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ పోటీదారులతో యాదగిరిక్షేత్ర వైభవం ప్రపంచ స్థాయికి వెళ్లనుంది. -
కరువు నేలకు జల సవ్వడి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువుకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. కృష్ణమ్మ బిరబిరా తరలివచ్చి కరువు నేల దాహార్తిని తీర్చనుంది. దాదాపు 100 గ్రామాలను సస్యశ్యామలం చేయనున్న ఉదయసముద్రం (బ్రాహ్మణ వెల్లెంల) ఎత్తిపోతల ప్రాజెక్టులో కీలకమైన రిజర్వాయర్ నిర్మాణం పూర్తైంది. నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. కాల్వల తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులు పూర్తికాగానే కరువు నేలపై కృష్ణమ్మ ఉరకలెత్తనుంది. ఈ ప్రాంతానికి సాగునీటిని అందించటంతోపాటు భూగర్భ జలాలు పెరిగి ఫ్లోరైడ్ సమస్యకూ పరిష్కారం లభించనుంది.వైఎస్ చొరవతో ప్రాజెక్టు మంజూరునల్లగొండ, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని పలు మండలాలకు జీవనాధారమైన ఈ ప్రాజెక్టును 2007లో ఎమ్యెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పట్టుబట్టి సాధించారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డిని ఒప్పించి మంజూరు చేయించారు. బ్రాహ్మణ వెల్లెంల గ్రామ శివారులో 2007లో ఈ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్రెడ్డి శంకుస్థాపన చేయగా, రూ.699 కోట్లతో 2008లో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2009లో పనులు ప్రారంభమయ్యాయి. ఉదయసముద్రం నుంచి అప్రోచ్ చానల్, సొరంగం, పంప్హౌస్ నిర్మాణం, మోటార్ల ట్రయల్ రన్, 486 ఎకరాల్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వంటి కీలక పనులు పూర్తయ్యాయి. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ఈ రిజర్వాయర్లోకి 0.302 టీఎంసీల నీటిని ఎత్తిపోసే పనులను ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తి స్వరూపం ఇదీ..ఏఎంఆర్పీలో భాగంగా నాగార్జునసాగర్ వెనుక జలాలు పానగల్లోని ఉదయ సముద్రం రిజర్వాయర్లోకి చేరుతున్నాయి. దాని పైభాగాన ఉన్న దండంపల్లి గ్రామం సమీపం నుంచి అప్రోచ్ చానల్ ప్రారంభమై 6.9 కిలోమీటర్ల దూరంలోని కట్టంగూరు మండలం పిట్టంపల్లి గ్రామం వద్దకు నీరు వస్తోంది. అక్కడి నుంచి 10.625 కిలోమీటర్ల పొడవున సొరంగం ద్వారా నీరు నార్కట్పల్లి మండలం చౌడంపల్లి గ్రామం వద్ద ఉన్న సర్జ్పూల్కు చేరుతుంది. అక్కడి నుంచి రెండు మోటార్లతో 86 మీటర్ల ఎత్తుకు పంపింగ్ చేసి 1.12 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన రెండు డెలివరీ పైపుల ద్వారా బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్లోకి ఎత్తిపోసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రధాన కుడి, ఎడమ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల పనులు కొంత వరకే అయ్యాయి. వాటికి సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపు, కాల్వల తవ్వకం, లైనింగ్ చేయాల్సి ఉంది. -
రోడ్డు విస్తరణతో రవాణా సౌకర్యం మెరుగు
గుర్రంపోడు, న్యూస్లైన్: గుర్రంపోడు-మల్లేపల్లిల మధ్య రోడ్డు విస్తరణతో రవాణా సౌకర్యం మరింతగా మెరుగుపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. గుర్రంపోడులో *19 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఆయన ఆది వారం ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నల్లగొండ- దేవరకొండల మధ్య రవాణా సౌకర్యం పెరిగి ఈ ప్రాంత అభివృద్దికి దోహదపడుతుందన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ రోడ్డు విస్తరణ మల్లేపల్లి వరకే కాకుండా జడ్చర్ల వరకు క్రమంగా విస్తరించనున్నట్ట పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, ఆర్డీఓ రవినాయక్, ఆర్అండ్బీ ఎస్ఈ లింగయ్య, ఈఈ రఘునందన్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాల చినసత్తయ్యయాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కుప్ప రాములు, చనమల్ల జగదీశ్వర్రెడ్డి, కె.వెంకటేశ్వర్రెడ్డి, తగుళ్ల యాదయ్య, రంగినేని నర్సింహారావు, వెలుగు రవి, రాధాకృష్ణ, మంచికంటి వెంకటేశ్వర్లు, రాజ్యరమేష్ యాదవ్, ఎంపీడీఓ రాంపర్తి భాస్కర్, తహసీల్ధార్ తిరందాసు వెంకటేశం, సర్పంచ్ రేపాక ప్రమీల పాల్గొన్నారు. 14 స్థానాలను సోనియాకు కానుకగా ఇవ్వాలి దేవరకొండ : తెలంగాణ ప్రజల ఆకాం క్షను నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవడానికి రానున్న ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలి పించి ఆమెకు కానుకగా అందించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కుం దూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని దేవరకొండ మం డలం పెండ్లిపాకలలో మొదటి విడత కృష్ణాజలాల విడుదల, కొండమల్లేపల్లి నుంచి గుర్రంపోడు వరకు రోడ్డు విస్తరణ, దేవరకొండ పట్టణంలోని నాలుగు లేన్ల రహదారి విస్తరణ, దేవరకొండ నుంచి బొల్లిగుట్ట వరకు రహదారి విస్తరణ వంటి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం దేవరకొండ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. చందంపేట మండలంలోని కృష్ణాజలాలు అందని 12గ్రామాల కోసం *12కోట్లను మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ వర్షం వచ్చే ముందు వచ్చే ఆరుద్ర పురుగుల్లా ఎన్నికలకు ముందు అభివృద్ధి చేస్తామంటూ వచ్చేవారిని కాకుండా నియోజకవర్గ అభివృద్దికి ఎంతగానో కృషిచేసిన వారిని ఆదరించాలని కోరారు. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ నేడు ప్రారంభించిన *100 కోట్ల విలువైన కృష్ణాజలాల మంచినీటి పథకాన్ని ప్రకటించి, పూర్తిచేసి దేవరకొండ ప్రజల ముందుకు వచ్చిన జానారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. సమావేశంలో ఆర్డీఓ రవి నాయక్, ఎంపీడీఓ విజయలక్ష్మీ, తహసీల్దార్ వెంకన్న, కాంగ్రెస్ నాయకులు సురేశ్రెడ్డి, ఆలంపల్లి నర్సింహ, పున్న వెంకటేశ్వర్లు, ముక్కమాల వెంకటయ్య, గోవిందు పాల్గొన్నారు.