-
'క్లియరెన్స్ రాగానే భక్తులను అనుమతిస్తాం'
సాక్షి, విజయవాడ : లాక్డౌన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆలయాలకు సడలింపునివ్వడంతో భక్తులను దర్శనాలకు అనుమతించే అవకాశంపై ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆలయాల్లో తీసుకుంటున్న జాగ్రత్తలను ఏపీ దేవాదాయశాఖ హెల్త్ డిపార్ట్మెంట్కు లేఖను పంపించింది. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అధికారులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... కేంద్రం ఆలయాలకు సడలింపులు ప్రకటించడంతో ఎపిలో భక్తులను అనుమతించే అంశంపై రెండు, మూడు రోజుల్లో ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఆలయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. ఆలయాల్లో ధర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన తర్వాత మాత్రమే భక్తులను దేవాలయాలకు అనుమతిస్తామని తెలిపారు. వ్యక్తికి వ్యక్తి మధ్య భౌతిక దూరం, శానిటైజర్, మాస్క్ లు తప్పనిసరి చేశామన్నారు. ఏపీలోని అన్ని దేవాలయాలలో ఒకటే మార్గదర్శకాలు ఉంటాయని, తిరుమలలో ఇప్పటికే వర్తింపచేస్తున్నామని పేర్కొన్నారు. టైం స్లాట్ ద్వారానే గంటకు 300 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామని వెల్లడించారు. కరోనా తీవ్రత దృష్ట్యా దేవాలయాల్లో తీసుకున్న జాగ్రత్తలను లేఖ రూపంలో ఇప్పటికే హెల్త్ డిపార్ట్మెంట్కు పంపామని, వారి నుంచి క్లియరెన్స్ రాగానే మరిన్ని గైడ్లైన్స్తో భక్తులను అనుమతిస్తామని తెలిపారు. -
దేవుడి శాఖలో మరో వింత నిబంధన
సాక్షి, హైదరాబాద్: ఆయన దేవాదాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా 35 ఏళ్ల క్రితం చేరాడు. ఏడాదిక్రితం కార్యనిర్వహణాధికారి (ఈఓ)గా పదవీ విరమణ పొందారు. తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసుకోగా, దేవాదాయశాఖలో చేరిన నాటి నుంచి ఏయే దేవాలయాల్లో పనిచేశారో, ఆయా దేవాలయాల ఈఓల నుంచి ‘నో అబ్జెక్షన్’సర్టిఫికెట్స్ తెచ్చి దాఖలు చేయాలని హుకుం జారీ చేశారు. ఆయా దేవాలయాల్లో ఆయన పనిచేసి బదిలీ అయినప్పుడు అన్ని బాధ్యతలు సవ్యంగానే అప్పగించారని, ఎక్కడా ఎలాంటి తప్పులు జరగలేదని ఈఓ సర్టిఫై చేస్తేనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అప్పగిస్తామని మెలిక పెట్టారు. ఆయా దేవాలయాలకు వెళ్లి సర్టిఫికెట్ కోసం అడిగితే, ‘ఆ సమయంలో మేం లేం కదా, నో అబ్జక్షన్ సర్టిఫికెట్ మేమెలా ఇస్తాం’అంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో పదవీ విమరణ పొంది ఏడాది దాటుతున్నా బెనిఫిట్స్ అందటం లేదు, పింఛనూ రావటం లేదు. ఇది ఒక్క అధికారికే పరిమితం కాలేదు. ఇటీవల పదవీ విరమణ పొందిన కార్యనిర్వహణాధికారులు ఎదుర్కొంటున్న సమస్య. ఓ పద్ధతి లేకుండా కొందరు అధికారుల ఇష్టారాజ్యంగా మారిన దేవాదాయశాఖలో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారమిది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆ మాజీ అధికారులు, గతంలో తాము పనిచేసిన ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదీ సంగతి... ఏ విభాగంలో అయినా సిబ్బంది పదవీ విరమణ పొందిన వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుతాయి. ఆ వెంటనే పింఛను మంజూరవుతుంది. కానీ, కొందరు అధికారుల ఇష్టారాజ్యానికి చిరునామాగా మారిన దేవాదాయశాఖలో ఇప్పుడు వింత వ్యవహారం చోటు చేసుకుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్తో ప్రమేయం లేకుండా నేరుగా నియామకాలు జరిగే ఏౖకైక ప్రభుత్వ విభాగం దేవాదాయశాఖ. ఆలయ ట్రస్టీలు, కమిషనరేట్లోని కొందరు అధికారులు కూడబలుక్కుంటే అర్హతలతో సంబంధం లేకుండా క్లర్క్లుగా నియమించే విధానం ఇందులో ఉంది. అలా క్లర్కులుగా నియమితులై ఆ తర్వాత వేర్వేరు ఆలయాలకు బదిలీ అవుతూ పదోన్నతులు పొందుతుంటారు. సీనియారిటీ ప్రకారం కార్యనిర్వహణాధికారులుగా ప్రమోట్ అయి ఆ తర్వాత సర్వీసు ఉంటే అసిస్టెంట్ కమిషనర్, ఆ పై పోస్టులకు కూడా పదోన్నతులు పొందుతారు. కొందరు ఈఓ స్థాయిలోనే రిటైర్ అవుతారు. గత ఏడాదిన్నరగా రిటైర్ అయిన వారికి కొత్త చిక్కొచ్చిపడింది. సాధారణంగా ఈఓగా పదోన్నతి పొందిన తర్వాత దేవాలయాల బాధ్యత పూర్తిగా వారి చేతిలో ఉంటుంది. మరో దేవాలయానికి బదిలీ అయినప్పుడు ఆ ఆలయ దేవరుల నగలు మొదలు, ఇతర అన్ని లెక్కలను తదుపరి ఈఓకు అప్పగించాలి. ఇప్పుడు ఆ అప్పగింతల తాలూకు ఆరోపణలు, ఫిర్యాదులు ఏమీ లేవన్నట్టుగా ఆయా దేవాలయాల ఈఓల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు కోరారు. కానీ విచిత్రంగా... ఈఓలుగా పదోన్నతి పొందిన నాటి నుంచే కాకుండా, క్లర్క్గా విధుల్లో చేరినప్పటి నుంచి ఈ సర్టిఫికెట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. అయితే ప్రారంభం నుంచి పరిశీలిస్తే ఒక్కో అధికారి 20 నుంచి 30 వరకు ఆలయాల్లో పనిచేసి ఉంటారు. అన్ని ఆలయాల నుంచి సర్టిఫికెట్లు తేవటం వారికి సవాల్గా మారింది. వారు బదిలీ అయినప్పుడు తాము ఆ దేవాలయంలో లేనందున, ఇప్పుడు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇస్తే, గతంలో జరిగిన లోపాల వివరాలు భవిష్యత్తులో వెలుగు చూస్తే తాము ఇబ్బందుల్లో పడతామని, అందువల్ల తాము సర్టిఫై చేయలేమని వారు చేతులెత్తేస్తున్నారు. దీంతో అన్ని దేవాలయాల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు రాక వీరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ జారీ కొలిక్కి రావటం లేదు. పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసే ఉద్దేశంతోనే ఇలా వేధిస్తున్నారంటూ సిబ్బంది ఆరోపిస్తున్నారు. తాను ఏడాదిన్నర నుంచి బెనిఫిట్స్ కోసం తిరుగుతున్నా అధికారులు కనికరించటం లేదని, తనకు అటు జీతం లేక ఇటు పింఛను రాక ఇబ్బందిగా మారిందని ఓ రిటైర్డ్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. -
సెంటిమెంట్ బ్రేక్ చేశా..
సాక్షి, మంచిర్యాల: దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న వాళ్లు మళ్లీ గెలవరనే సెంటిమెంట్ను తాను బ్రేక్ చేశానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో ఐకే రెడ్డి మంత్రిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ మంత్రిగా కేసీఆర్ రెండోసారి బాధ్యతలు అప్పగించడం ఎంతగానో సంతృప్తి నిచ్చిందన్నారు. మే 1వ తేదీ నుంచి అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. అలాగే అటవీచట్టంలో సమూల మార్పులు తీసుకువస్తామని, అడవుల సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు. జంగల్ బచావో, జంగల్ బడావో అనే నినాదంతో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామన్నారు. కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. రెండోసారి మంత్రిగా... రాష్ట్ర మంత్రిగా ఇంద్రకరణ్రెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అల్లోల దేవాదాయ, న్యాయశాఖ మంత్రిగా కొనసాగారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మరోసారి మంత్రిగా అవకాశం వచ్చింది. ఈసారి గతంలో ఉన్న దేవాదాయ, న్యాయశాఖతో పాటు అటవీ, పర్యావరణ శాఖలను అప్పగించారు. గతంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుంచి జోగు రామన్న, ఇంద్రకరణ్రెడ్డి మంత్రులుగా ఉండగా, ఈ సారి ఒక్క అల్లోలకే అవకాశం దక్కింది. అడవులకు పెట్టింది పేరైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే మరోసారి అటవీశాఖ దక్కడం విశేషం. మంత్రికి పలువురి శుభాకాంక్షలు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఐకే రెడ్డికి పలువురు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్రెడ్డి, రాథోడ్ బాపురావు, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు విఠల్రావు, సత్యనారాయణగౌడ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. -
మే 1 నుంచి ఆన్లైన్
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రముఖ దేవాలయాల్లో వచ్చే మే 1 నుంచి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు మరింత కృషి చేస్తామన్నారు. 3,645 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం కింద ప్రతి నెల రూ.2.10 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. న్యాయశాఖకు సంబంధించి సీఎం కేసీఆర్ కృషితో హైకోర్టు విభజన సమస్య తీరిపోయిందన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం సచివాలయం డీ బ్లాక్లోని తన చాంబర్లో మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ రెండోసారి తనను మంత్రిగా నియమించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడతానన్నారు. దేవాదాయ మంత్రిగా ఉన్నవారు మళ్లీ ఎన్నికల్లో గెలవరనే సెంటిమెంట్ను బ్రేక్ చేశా నని, అదే శాఖకు మంత్రిగా బాధ్య తలను అప్పగించడం సంతృప్తినిచ్చిందన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అరణ్య భవన్లో ఉన్నతాధికారులతో ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అటవీ చట్టం మరింత కఠినతరం... అడవుల సంరక్షణకు అటవీ చట్టంలో సమూల మార్పులు తీసుకొచ్చి, వాటిని మరింత కఠినతరం చేస్తామని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. అటవీ శాఖపై కేసీఆర్ ఇప్పటికే సమీక్ష నిర్వహించారని... జంగల్ బచావో, జంగల్ బడావో పేరుతో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామని చెప్పారు. అడవులను కాపాడటం, పర్యావరణ సమతుల్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డి, రాథోడ్ బాపురావు, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, ఈ.ఎఫ్.ఎస్–టీ స్పెషల్ సీఎస్ అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా, దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు హాజరై మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. -
మనిషన్న జంతువు ప్రతిచోటా విధ్వంసం సృష్టిస్తోంది
సాక్షి, హైదరాబాద్: ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుండటంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. శబరిమలలో మాదిరిగా ఇక్కడి దేవస్థానాల్లో కూడా ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. దీనికిగాను పర్యావరణ పరిరక్షణ చట్టం కింద ఉన్న అధికారాలను ఉపయోగించాలని సూచించింది. ఉల్లంఘనలను ప్రాసిక్యూట్ చేయడం, భారీ జరిమానాలు విధించడం వంటి చర్యలకు ఉపక్రమించాలని తేల్చి చెప్పింది. కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. నిబంధనలు సరళంగా, సూటిగా ఉండాలని స్పష్టం చేసింది. ప్లాస్టిక్ నిషేధంపై స్థానికసంస్థలకు, దేవాదాయ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలంది. మనిషి వంటి క్రూర జంతువు నిస్సందేహంగా ఈ భూగ్రహం మీదే లేదని, మనిషన్న ఓ జంతువు తాను అడుగుపెట్టిన ప్రతిచోటా విధ్వంసం సృష్టిస్తున్నదని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేవస్థానాల్లో ప్లాస్టిక్ నిషేధానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో స్పష్టంగా వివరించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల ఇబ్బందులను, నిర్వహణ లోటుపాట్లను సరిదిద్దే దిశగా సుప్రీం తీర్పు అమలులో భాగంగా నిజామాబాద్, వరంగల్ జిల్లాల ప్రధాన న్యాయాధికారులు స్థానిక దేవస్థానాల్లోని పరిస్థితులపై హైకోర్టుకు నివేదికలు పంపారు. ఈ నివేదికలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి వీటిని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా మలచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ మేరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా మలచిన వాటిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. ధర్మాసనం స్పందిస్తూ ఢిల్లీలో ప్లాస్టిక్పై నిషేధం అమల్లో ఉందని తెలిపింది. శబరిమలలో 100% ప్లాస్టిక్ నిషేధం... శబరిమలలో ప్లాస్టిక్పై 100 శాతం నిషేధం అమల్లో ఉందని ధర్మాసనం తెలిపింది. న్యాయస్థానాలు ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండానే అక్కడ ప్లాస్టిక్పై నిషేధాన్ని అమలు చేస్తుండటం విశేషమని పేర్కొంది. కర్పూరం, పసుపు, మిరియాలు వంటివి కూడా ప్లాస్టిక్ కవర్లలో తీసుకెళ్లడం లేదంది. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులే రావాలని పేర్కొంది. 90 శాతం నాలాలు ప్లాస్టిక్ కారణంగా మూసుకుపోతున్నాయని తెలిపింది. జంతువులు కూడా ప్లాస్టిక్ కవర్లు తిని మృత్యువాత పడుతున్నాయంది. మనిషి వంటి క్రూరమృగం ఈ భూగ్రహంపైనే లేదన్న ధర్మాసనం, అభివృద్ధి పేరుతో జంతు ఆవాసాలను కూడా మనిషి ధ్వంసం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల అడవుల్లో అనేక జంతువులు ఆకస్మికంగా మృతి చెందుతున్నాయని, వీటిని మనుషులే చంపుతున్నారా? అవే చనిపోతున్నాయా? అన్నది మిస్టరీగా మారిందని పేర్కొంది. ప్లాస్టిక్ కాగితాలు, కవర్లు తిని జంతువులు మృత్యువాత పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయని, ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశమంది. జీవ మనుగడకు ప్లాస్టిక్ నిషేధమవసరం.. ఈ భూమి మీద మనిషితోపాటు ఇతర జంతుజాలాలు బతికి బట్టకట్టాలంటే, ప్లాస్టిక్ నిషేధం జరిగి తీరాలని హైకోర్టు చెప్పింది. ఈ విషయంలో పర్యావరణ పరిరక్షణ చట్టం కింద ఉన్న అధికారాలను ఎందుకు ఉపయోగించడం లేదని ప్రభుత్వాలను ప్రశ్నించింది. నిబంధనల అమలులో చూపాల్సింది చిత్తశుద్ధేనని గుర్తు చేసింది. దేవస్థానాల్లో ప్లాస్టిక్ నిషేధంపై స్థానిక సంస్థలకు, దేవాలయాలకు ఆదేశాలు జారీ చేయాలని, ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారిని ప్రాసిక్యూట్ చేయడం, భారీ జరిమానాలు విధించడం వంటివి చేపట్టాలంది. ఈ విషయంలో ఏం చర్యలు తీసుకోబోతున్నారో తెలియచేయాలని ఉభయ రాష ్ట్రప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement