బాబు హామీ కోసం దేవుడి భూమికి ఎసరు

Ministry of Endowments land in problems - Sakshi

ఓ సామాజికవర్గం వారికి మహానందిలో

47 సెంట్ల భూమి కేటాయించాలని సీఎం పేషీ ఒత్తిడి

సాక్షి, అమరావతి:  నంద్యాల ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక హామీలు గుప్పించిన విషయం విదితమే. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఒక సామాజిక వర్గం ఓట్లన్నింటినీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వేయిస్తే మహానందిలో ఆ సామాజిక వర్గం పేరిట సత్రం నిర్మాణానికి పార్టీ, ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఆ సామాజికవర్గం కోసం సత్రం నిర్మాణానికి మహానందిలో 47 సెంట్ల దేవుడి భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయానికి లేఖ రాసింది. ఆలయ భూముల అమ్మకం, ఇతరులకు ప్రభుత్వం బదలాయించే అధికారాలపై హైకోర్టు ఆంక్షలు కొనసాగుతున్నాయని తెలియజేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెంటనే జవాబిచ్చారు.

ఆ సమాధానంతో ప్రభుత్వ పెద్దలు తృప్తి చెందకపోవడంతో తక్షణమే అన్ని వివరాలతో ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్, ఆ శాఖకు చెందిన ఇతర అధికారులను సీఎం కార్యాలయ అధికారులు ఆదేశించారు. ఈ వ్యవహారం దేవాదాయ శాఖలో దుమారం రేపుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top