breaking news
Khazana Jewellery showroom
-
'ఖజానా' కొల్లగొడదామని..
సాక్షి, హైదరాబాద్/చందానగర్: హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలరీ షోరూంపై బందిపోటు దొంగలు పంజా విసిరారు. మంగళవారం ఉదయం షాపు తెరిచే సమయంలోనే తుపాకులతో చొరబడిన ముఠా బంగారం కోసం ప్రయత్నించి గోల్డ్ కోటెడ్ వెండి ఆభరణాలతో పరారయ్యింది. ఈ సందర్భంగా దుండగుల కాల్పుల్లో షోరూమ్ అసిస్టెంట్ మేనేజర్ కాలుకి గాయం కాగా.. సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయి. జిన్నారం మీదుగా పారిపోయిన ఈ ముఠాను పట్టుకోవడానికి 20 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి ప్రకటించారు. మాదాపూర్ డీసీపీ వినీత్, మియాపూర్ ఏసీపీ సీహెచ్వై శ్రీనివాస్కుమార్ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఉదయం షోరూమ్ తెరిచీ తెరవగానే.. జాతీయ రహదారిపై గంగారం వద్ద ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూంను యథావిధిగా మంగళవారం ఉదయం 10.15 గంటలకు తెరిచారు. ఆ సమయంలో విధులకు హాజరైన 25 మంది సిబ్బందితో రోజూ మాదిరిగానే డిప్యూటీ మేనేజర్ సతీష్కుమార్ మాట్లాడుతున్నారు. 10.30 గంటల ప్రాంతంలో ఆ షోరూం వద్దకు మాస్క్తో వచ్చిన ఓ ఆగంతకుడు ఫోన్ ద్వారా తన ముఠా సభ్యులకు సమాచారం ఇచ్చాడు. తర్వాత ఐదు నిమిషాలకు రెండు ద్విచక్ర వాహనాలపై మరో ఐదుగురు అక్కడకు చేరుకున్నారు. ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ.. ఒకరు షోరూం బయటనే ఆగిపోగా.. మరొకరు ప్రధాన ద్వారం దగ్గర కాపు కాశారు. మిగిలిన నలుగురూ నేరుగా సిబ్బంది ఉన్న ప్రాంతానికి వచ్చారు. మాస్క్లు ధరించి ఉన్న దుండగులను వినియోగదారులని ఉద్యోగులు భావించారు. ఏం కావాలని అడగడానికి ఓ ఉద్యోగి వస్తుండగా తుపాకులు ఉన్న ముగ్గురు దుండగలు ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ డిప్యూటీ మేనేజర్ను లాకర్ తాళాలు ఇవ్వాలంటూ బెదిరించారు. ఆయన తన వద్ద తాళాలు లేవని చెప్పడంతో ‘చుప్ బే’అంటూ బెదిరించిన ఓ దుండగుడు అతని ఎడమ కాలుపై కాల్చాడు. షోరూమ్లో ఉన్న రెండు సీసీ కెమెరాలను కూడా కాల్చారు. గోల్డ్ కోటెడ్వే నిజమైనవి అనుకుని.. ప్రతిరోజూ షోరూమ్ మూసేముందు అదే అంతస్తులోని మెజ్జనైన్ ఫ్లోర్లో ఉన్న లాకర్లో బంగారు ఆభరణాలను భద్రపరుస్తారు. ఉదయం షోరూమ్ తెరిచిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ తాళాలు తీస్తే బంగారు ఆభరణాలను బయటకు తీసువచ్చి కింది ఫ్లోర్లో ఉన్న షో కేసుల్లో సర్దుతారు. అయితే మంగళవారం ఉదయం దుండగులు వచ్చిన సమయానికి అసిస్టెంట్ మేనేజర్ రాకపోవడంతో ఈ బంగారం దోపిడీ దొంగలకు దొరకలేదు. ఈ షోరూమ్లో వినియోగదారులకు చూపించడానికి బయటకు తీసి, మళ్లీ లోపల పెట్టడానికి ఉన్న కొన్ని షోకేస్లతో పాటు ఆభరణాలను డిస్ప్లే చేయడానికి ఉన్న షో కేసుల్లో గోల్డ్ కోటెడ్ వెండి ఆభరణాలను ఉంచుతారు. వీటినే బంగారు ఆభరణాలుగా భావించిన దుండగులు ఆ షోకేసుల్ని ధ్వంసం చేసి అందులో ఉన్న ఆభరణాలను బ్యాగుల్లో సర్దుకుని వాహనాలపై ఉడాయించారు. ఈ వెండి ఐదు నుంచి పది కిలోల వరకు ఉండచ్చని అంచనా వేస్తున్నారు. కేవలం పది నిమిషాల్లోనే ఈ దోపిడీ ముగిసింది. పక్కాగా రెక్కీ చేసిన తర్వాతే నేరం! దుండగులు రెండుమూడు రోజుల పాటు రెక్కీ చేసిన తర్వాతే దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి వచ్చిన కమిషనర్ అవినాష్ మహంతి బందిపోటు దొంగతనం జరిగిన తీరును తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న ప్రత్యేక బృందాలు.. నేరం చేసిన తర్వాత దుండగులు చందానగర్–పటాన్చెరు–కృష్ణారెడ్డిపల్లి–జిన్నారం మీదుగా పరారైనట్లు గుర్తించారు. దుండగుల్లో ఒకడు ‘చుప్ బే’అనే పదం వాడటాన్ని బట్టి.. అది మధ్యప్రదేశ్ లేదా ఉత్తరప్రదేశ్లకు చెందిన ముఠాగా అనుమానిస్తున్నారు. పొరుగు జిల్లాలు, రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. ఎక్కడిక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షోరూం డిప్యూటీ మేనేజర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. -
ఖజానా జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ రష్మిక
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల రిటైల్ సంస్థ ఖజానా జ్యువెలరీ తమ సరికొత్త బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ నటి శ్రీమతి రష్మిక మందన్నను ప్రకటించింది. దక్షిణాదిలోని మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎక్కువ అభిమానుల సంఖ్య గల ప్రముఖ తారలలో రష్మిక ఒకరు. ఇప్పుడు బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టింది. అక్షయ తృతీయతో ప్రారంభించి భారతదేశం అంతటా ప్రింటింగ్, బహిరంగ, టీవీలలో ప్రకటన ద్వారా ఖజానా జ్యువెలరీకి చెందిన అందమైన డిజైన్లను ఆమె ప్రమోట్ చేయనుంది. ఈ ఒప్పందంపై ఖజానా జ్యువెలరీ చైర్పర్సన్ మిస్టర్ కిషోర్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. "మా బ్రాండ్ అంబాసిడర్గా శ్రీమతి రష్మికను ఎంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే నెలల్లో ఆమెతో మేము అనేక రకాల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తాము. మా బ్రాండ్, మా కస్టమర్ల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించాలని" చూస్తున్నాము అని అన్నారు. ఇక రష్మిక మందన్న మాట్లాడుతూ.. “ఖజానా గొప్పతనం గురుంచి అందరికీ తెలిసిందే, నన్ను దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకోవడం నాకు సంతోషం కలిగిస్తుంది. వారి ప్రత్యేకమైన నమూనాలు, ఉన్నతమైన విలువల గురుంచి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను వారితో భాగస్వామ్యం కావడం గురించి సంతోషిస్తున్నాను. అలగే, ఖాజానా స్టోర్లలో ఉన్న కొత్త కలెక్షన్స్ చూడటానికి వేచి ఉండలేకపోతున్నాను” అని తెలిపింది. ఖజానా జ్యువెలరీ బిఐఎస్ హాల్మార్క్డ్ 916 బంగారు ఆభరణాలను అమ్మడం, అధిక-నాణ్యత ప్రమాణాలను పాటించడం ద్వారా భాగా ప్రాచుర్యం పొందింది. తక్కువ ధరలో మెరుగైన నాణ్యమైన ఆభరణాలను వినియోగదారులకు అందిస్తుంది. ఒక వ్యాపార సంస్థగా మాత్రమే కాకుండా, ఖజానా జ్యువెలరీ క్రమం తప్పకుండా అనేక సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత వంటి కార్యక్రమాల కోసం సంస్థ తన లాభాలలో కొంత భాగాన్ని కేటాయిస్తుంది. ఖజానా జ్యువెలరీని 1993లో చెన్నైలోని కేథడ్రల్ రోడ్లో మిస్టర్ కిషోర్ కుమార్ జైన్ మొదటి షోరూమ్ ను ప్రారంభించారు. ఇన్ని సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదిగి 5,000 కోట్ల రూపాయల టర్నోవర్ గల సంస్థగా ఎదిగింది. భారతదేశం అంతటా 50కి పైగా షోరూమ్లు కలిగి ఖాజానా దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బంగారం, వెండి ఆభరణాల వ్యాపార సంస్థగా ఇప్పుడు నిలిచింది. చదవండి: ఆ విషయాన్ని మీరు విజయ్నే అడగండి : రష్మిక -
‘ఖజానా’ సేల్స్ బాయ్ అనుమానాస్పద మృతి
ఆత్మహత్య చేసుకున్నాడంటున్న నిర్వాహకులు హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారన్న బాధితులు అనంతపురం క్రైం :అనంతపురంలోని ఖజానా జ్యువెలరీ షోరూం సేల్స్బాయ్ గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మద్యం మత్తులో మూడంతస్తుల పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని సంస్థ నిర్వాహకులు చెబుతుండగా.. బంగారు పోయిందని విచారణ పేరుతో అతన్ని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ వృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితులు రాత్రి పొద్దుపోయేదాక రోడ్డుపై ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డీఎస్పీ నాగరాజు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కూడేరు మండలం పడమటి నారాయణపురం గ్రామానికి చెందిన బాలకృష్ణ (26) ఎంబీఏ వరకు చదివాడు. ఉపాధి కోసం నగరంలోని ఖజానా జ్యువెలరీ షోరూంలో సేల్స్ బాయ్గా పని చేస్తున్నాడు. మిత్రులతో కలసి నగరంలోనే అద్దె గదిలో నివసిస్తున్నాడు. పది రోజుల క్రితం షోరూంలో మూడు బంగారు ఉంగరాలు మాయమయ్యాయని, వాటిని ఎవరు తీసుకున్నారో ఇవ్వాలని ఆ విభాగంలో పనిచేసే బాలకృష్ణ, మహేష్, రవిచంద్ర, రమేష్నాయక్, జ్యోతిలను యాజమాన్యం హెచ్చరించింది. తాము తీయలేదని, కావాలంటే సీసీ కెమెరాల్లోని పుటేజీలను పరిశీలించండని వారు ఎంత చెప్పినా పట్టించుకోని యాజమాన్యం గురువారం విచారణ నిమిత్తం చెన్నయి నుంచి డీజీఎం రాకేష్, ఏఎస్ఎం అరవింద్లను ‘అనంత’కు పంపింది. దీంతో ఉదయాన్నే ఐదుగురు సిబ్బంది(నలుగురు సేల్స్బాయ్స్-ఒక సేల్స్గర్ల)నీ ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లిన సంస్థ మేనేజ్మెంటు సభ్యులు నాలుగు గంటలపాటు తీవ్రస్థాయిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఉంగరాలు తీసింది తామేనని ఒప్పుకోకపోతే తలా రూ.50 వేలు కట్టాల్సి ఉంటుందని, లేని పక్షంలో మరింత బంగారం అపహరించారని మీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. అయినా తాము తప్పు చేయలేదని తెగేసి చెప్పడంతో... తలా రూ.లక్ష కట్టాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తాగిన మత్తులో ఉన్న బాలక ృష్ణ నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం పైనుంచి లిఫ్ట్ ఏర్పాటు చేయబోయే ప్రదేశంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ‘ఖజానా’ నిర్వాహకుల తరఫున బాలకృష్ణ మిత్రులకు ఫోన్ద్వారా సమాచారం అందింది. అనంతరం విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ‘ఖజానా’ తలుపులు మూసేశారు. బాలకృష్ణకు ఎటువంటి చెడు వ్యసనాలూ లేవని, ‘ఖ జానా’ వారే చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. విచారణ పేరుతో యాజమాన్యం పెడుతున్న ఇబ్బందులు, వేధింపుల గురించి తన అన్న ఫోన్లో చెప్పాడంటూ బాలకృష్ణ తమ్ముడు హరి విలపించాడు. తమ ప్రాణాలు కూడా తీసుకోండంటూ కుటుంబ సభ్యులు విలపించారు. పరిస్థితి చేజారుతుండటంతో పోలీసులు డీఎస్పీ నాగరాజు.. సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళన విరమించజేశారు.