breaking news
investigation team
-
విద్యుత్ వైఫల్యమే కారణం!
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అకస్మాత్తుగా విద్యుత్ వైఫల్యం చెందడం వల్లే విమానం కూలిపోయి ఉంటుందని దర్యాప్తు బృందం భావిస్తోంది. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం ఏఐ–171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. అత్యవసర టర్నరౌండ్ను అమలు చేయడానికి లేదా మొత్తం విద్యుత్ నష్టం జరిగినప్పుడు బ్యాక ప్ వ్యవస్థ అయిన రామ్ ఎయిర్ టర్బైన్ (ఆర్ఏటీ)ను ఉపయోగించుకోవడానికి అవసరమైన కనీస ఎత్తుకు విమానం చేరుకోలేదు. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అకస్మాత్తుగా విద్యుత్తు అంతరాయం ఏర్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బ్లాక్ బాక్స్ డేటాను డీకోడ్ చేసిన తర్వాతే అసలు కారణం తెలుస్తుందంటున్నారు. బ్లాక్ బాక్స్లు – ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్), కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) ప్రస్తుతం ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఆ«దీనంలో ఉన్నాయి. అయితే బ్లాక్ బాక్స్లను విదేశాలకు పంపుతున్నట్లు వస్తున్న వార్తల స్పందించిన పౌర విమానయాన శాఖ.. తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.231 డీఎన్ఏల గుర్తింపు.. 210 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింత ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 231 డీఎన్ఏ నమూనాలు సరిపోలాయని, 210 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ శుక్రవారం తెలిపింది. మృత దేహాలు అప్పగించిన 210 మందిలో 166 మంది భారతీయులు కాగా, ఏడుగురు పోర్చుగీస్, 36 మంది బ్రిటిషర్స్, ఒక కెనడియన్ ఉన్నారని హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేష్ జోషి తెలిపారు. 183 మంది మృతదేహాలను అంబులెన్స్ల ద్వారా, 15 మంది మృతదేహాలను విమానంలో పంపించినట్లు తెలిపారు. విమాన ప్రమాదంలో 222 మంది బాధితులను గుర్తించగా, వారిలో ఎనిమిది మంది డీఎన్ఏ మ్యాచ్ కాలేదని తెలిపారు. జూన్ 12న గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిపోవడం, విమానంలోని 241 మంది మరణించడం తెలిసిందే. -
ప్యాకేజింగ్లోనే డ్రగ్స్ కలిశాయా?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ రాకెట్ చిక్కుముడిని విప్పేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణను వేగవంతం చేసింది. బ్రెజిల్ శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన నౌక ట్రావెలింగ్ మ్యాప్ వివరాలను పిన్ టు పిన్ సేకరించే పనిలో సీబీఐ నిమగ్నమైంది. రావాల్సిన సమయం కంటే రెండు రోజులు ఆలస్యంగా ఎందుకు వచ్చిందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సంధ్య ఆక్వా సంస్థ గతంలో చేసుకున్న దిగుమతుల వివరాలను కూడా నిశితంగా పరిశీలిస్తోంది. బ్రెజిల్ నుంచి డ్రైఈస్ట్ కొనుగోలు చేసినట్లు చెబుతుండటంతో అక్కడి నుంచే పరిశోధించేందుకు దర్యాప్తు బృందాలు వెళ్లినట్లు తెలుస్తోంది. పది రోజుల ప్రయాణం.. అసలు ప్యాకేజింగ్లోనే డ్రగ్స్ కలిశాయా? లేదా మార్గమధ్యంలో చేరాయా? అనే కోణంలోనూ దర్యాప్తు మొదలైంది. బ్రెజిల్ నుంచి బయలుదేరిన నౌక విశాఖకు రెండు రోజులు ఆలస్యంగా వచ్చిందని సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సాధారణంగా బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు కంటైనర్ షిప్ వచ్చేందుకు 7 నుంచి 8 రోజుల సమయం పడుతుంది. కానీ ఈ షిప్ 10 రోజులకు విశాఖ చేరుకుంది. అందుకు గల కారణాలేమిటనే అంశాలను అన్వేషిస్తున్నారు. ఆ రెండు పోర్టులకు ఎందుకు వెళ్లలేదు? ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ ఆధ్వర్యంలో డ్రైఈస్ట్తో కూడిన కంటైనర్ కార్గో జిన్ లియాన్ యంగ్ గ్యాంగ్ కార్గో షిప్ హెచ్హెచ్ఎల్ఏ కంటైనర్ టెర్మినల్ నుంచి మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరింది. అక్కడి నుంచి షెడ్యూలింగ్ ప్రకారం ఈజిప్జులోని డామిట్టా కంటైనర్ టెర్మినల్కు, ఆ తర్వాత సూయజ్ కెనాల్లో బెర్తింగ్ కావాల్సి ఉంది. అయితే ఆ రెండు పోర్టులకు వెళ్లకుండా ‘స్కిప్ కాలింగ్’ చేశారు. నౌక నేరుగా మార్చి 9వతేదీ సాయంత్రం 4 గంటలకు బెల్జియంలోని ఆంట్వెర్ప్ గేట్వేకు చేరుకోగా అర్థరాత్రి 1.03 గంటలకు బెర్తింగ్ ఇచ్చారు. 10వతేదీ రాత్రి 9.43 గంటలకు నౌక తిరిగి అక్కడి నుంచి బయల్దేరింది. డాట్లాంటిక్లోని సీఎన్ఎం టెర్మినల్కు 11వ తేదీ వేకువ జామున 4 గంటలకు చేరుకుని 12వ తేదీ సాయంత్రం 4.35 గంటలకు బయల్దేరింది. అక్కడి నుంచి కొలంబో పోర్టుకు 13వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకోగా రాత్రి 10.27 గంటలకు తిరిగి బయల్దేరింది. విశాఖ కంటైనర్ టెర్మినల్లోని టెర్మినల్–2కి 16వతేదీ సాయంత్రం 5.30 గంటలకు వచ్చింది. అదే రోజు రాత్రి 8.55 గంటలకు నౌకకు బెర్తింగ్ ఇచ్చారు. కొలంబో నుంచి నిర్ణీత సమయంలోనే.. కొలంబో నుంచి విశాఖ వచ్చేందుకు నౌకలకు 3 రోజుల సమయం పడుతుంది. అంటే ఆ నౌక నిర్ణీత సమయంలోనే చేరుకుంది. మరి బ్రెజిల్ నుంచి కొలంబో వచ్చే మార్గంలో సీల్ టాంపరింగ్ ఏమైనా జరిగిందా? అనే కోణంలోనూ సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రెండు పోర్టులకు వెళ్లకుండా నౌకను ఎందుకు దారి మళ్లించారనే విషయంపైనా ఆరా తీస్తున్నారు. రెండు పోర్టులకు వెళ్లకుండా నేరుగా వచ్చినప్పుడు రెండు రోజులు ఎందుకు ఆలస్యమైందనే అంశంపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. బ్రెజిల్కు బృందాలు.. సంధ్యా ఆక్వా సంస్థ ప్రతినిధుల కాల్డేటాని విశ్లేషిస్తున్న సీబీఐ బృందం ఎవరెవరికి కాల్స్ వెళ్లాయి? ఏ ప్రాంతాలకు వెళ్లాయి? అనే సమాచారాన్ని ఇప్పటికే సేకరించి ఫోన్ నంబర్ల ఆధారంగా వివరాలు సేకరించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేసింది. బ్రెజిల్లో డ్రైఈస్ట్ ఆర్డర్ చేసిన సంస్థ దగ్గర నుంచి శాంటోస్, బెల్జియం, డాట్లాంటిక్, కొలంబో పోర్టులకు వెళ్లి షిప్ బెర్తింగ్ సమయంలో నిక్షిప్తమైన సీసీ టీవీ ఫుటేజీని సేకరించాలని భావిస్తున్నారు. ఇందుకోసం మరో బృందాన్ని పంపనున్నట్లు సమాచారం. గతంలో సంధ్య ఆక్వా సంస్థ దిగుమతి చేసుకున్న కార్గో వివరాలు, సరుకు ఆర్డర్లు తదితర రికార్డులను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా డ్రగ్స్ అవశేషాలతో వచ్చిన కంటైనర్ని విశాఖ కంటైనర్ టెర్మినల్లోనే భద్రపరిచారు. -
ఏపీలో సిట్కు ప్రత్యేక అధికారాలు