breaking news
Greater rayalaseema
-
టికెట్టా.. వద్దే వద్దు! ఇంటర్నల్ సర్వేలతో బెంబేలెత్తుతున్న టీడీపీ నేతలు
రాష్ట్రంలో ఎన్నికలకు మరో 14 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ పరిస్థితిలో ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థులు ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సన్నద్ధమవుతూ బిజిబిజీగా ఉండాలి. టీడీపీలో ఎక్కడా ఆ వాతావరణం కన్పించడం లేదు. చాలా నియోజకవర్గాల్లో నేతలు పోటీకి విముఖత చూపుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి కూడా టీడీపీకి అధికారం దక్కదని ఆయా ప్రాంతాల్లో వారు చేయించిన సర్వేల్లో స్పష్టం కావడమే ఇందుకు కారణం. రాయలసీమలో పార్టీ కంటే వర్గాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. గెలిచినా, ఓడిపోయినా తమ వర్గాన్ని కాపాడుకునేందుకు ఏదో ఒక పార్టీ నుంచి బరిలో నిలవాలనుకుంటారు. అలాంటి ఈ ప్రాంతంలో సైతం పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదంటే టీడీపీ పరిస్థితి ఎంత తీసికట్టుగా మారిందో స్పష్టమవుతోంది. అందుకే చాలా మంది నేతలు ప్రత్యామ్నాయం చూసుకున్నారు. ఏదారీ లేని వారు.. అంటే ఎక్కడా గెలవలేమనుకునే వారు మాత్రమే.. అన్ని ఖర్చులు పార్టీ భరిస్తేనే పోటీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబుకు అల్టిమేటం జారీచేస్తున్నారు. సాక్షి, ఏపీ నెట్వర్క్: గ్రేటర్ రాయలసీమలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కోడుమూరు, నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో 2019లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పీఆర్ అండ్ ఆర్డీ మాజీ కమిషనర్ రామాంజనేయులు, జయరాజ్ పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పత్తా లేరు. అక్కడి నుంచి ఈసారి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా టీడీపీకి దొరకలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన బొల్లినేని రామారావు 2019లో ఓడిపోయారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. ‘ఎటూ గెలవలేం.. పైగా టీడీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు.. ఇలాంటప్పుడు ఎంత ఖర్చు చేసినా ఏం లాభం?’ అని పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో వ్యాపారవేత్త కావ్య కృష్ణారెడ్డి, ఎన్ఆర్ఐ కాకర్ల సురేశ్లను బరిలోకి దింపేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. కందుకూరులో 2019 ఎన్నికల్లో ఓడిపోయిన పోతుల రామారావు పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావును ఇన్చార్జ్గా నియమించారు. పోతుల రామారావు కూడా రియల్టరే. మధ్యలో నాగేశ్వరరావు హ్యాండిస్తే మరో రియల్టర్ రాజేశ్కు టికెట్ ఇవ్వాలని ఆప్షన్గా పెట్టుకున్నారు. మచ్చుకు ఈ మూడు ఉదాహరణలు పరిశీలిస్తే ‘గ్రేటర్ రాయలసీమ’లో టీడీపీ పరిస్థితి ఏంటో, ఆ పార్టీ నేతల మనుసులో ఎలాంటి భావన ఉందో స్పష్టమవుతోంది. ప్రత్యామ్నాయం వైపు పార్టీ శ్రేణులు గ్రేటర్ రాయలసీమలో 74 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 67 మంది వైఎస్సార్సీపీ, ఏడుగురు మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఏడుగురిలో నలుగురు ప్రకాశం జిల్లాలో, మిగిలిన ఐదు ఉమ్మడి జిల్లాల్లో ముగ్గురు (కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్) గెలిచారు. ప్రకాశం జిల్లాలోని నలుగురిలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆ పార్టీని వీడారు. ఎన్నికల తర్వాత సింహభాగం నియోజకవర్గాల్లో ఇప్పటికీ టీడీపీ నేతలు ప్రజలకు కన్పించడం లేదు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో అత్యధికులు ప్రత్యామ్నాయాలు చూసుకున్నారు. ఎక్కువ మంది సీఎం వైఎస్ జగన్ పథకాలు నచ్చి వైఎస్సార్సీపీలో చేరారు. మేమేం చేసేది..? ‘రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు?’ అని ఓ మాజీ ఎమ్మెల్యేను ఆయన ముఖ్య అనుచరుడు ప్రశ్నిస్తే.. ‘ఇటీవల రోజుకు 10 మంది చొప్పున పది రోజులపాటు 100 మందితో ఫోన్లో, ప్రత్యక్షంగా మాట్లాడాను. వారిలో 94 మంది జగన్ ప్రభుత్వం వల్ల తమకు మేలు జరిగిందని చెప్పారు. ఇంత కచ్చితంగా వారు ఆ మాట చెప్పినప్పుడు వారంతా నా వెంటే నడుస్తారన్న గ్యారంటీ ఏముంది? ఏం చూసుకుని ఎన్నికల్లో పోటీ చేయాలి? పరిస్థితి ఇలా ఉంటే మేమేం చేసేది?’ అని ఎదురు ప్రశ్న వేశారట. ప్రజల నాడి ఇలా ఉన్నందుకే టీడీపీ నేతలు పోటీ చేయడానికి విముఖత చూపుతున్నారు. ఇన్చార్జ్ల కోసం వెంపర్లాట ► నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థులు పోటీ అంటేనే జంకుతున్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో ఓడిపోయిన కృష్ణయ్య వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు. కావలిలో కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. సర్వేపల్లిలో మూడు పర్యాయాలు ఓడిపోయిన సోమిరెడ్డి మళ్లీ ఓటమి తప్పదని.. నెల్లూరు రూరల్ ఆశిస్తున్నారు. ► తిరుపతి నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఖర్చులు పార్టీ భరించాలని కండీషన్ పెట్టింది. చంద్రగిరిలో ఇందు శేఖర్ను కాదని పులివర్తి నానికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే చంద్రగిరిలో చెవిరెడ్డిని ఎదుర్కోవడం అంత సులువు కాదని నాని చిత్తూరు టికెట్ ఆశిస్తున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్రెడ్డి ఖర్చు భరించలేనంటున్నారు. ► పుంగూరులో పోటీ చేసేందుకు అభ్యర్థే లేరు. ఖర్చు పార్టీ చూసుకుంటే పోటీ చేస్తానని చల్లా రామచంద్రారెడ్డి తేల్చి చెప్పాడు. పూతలపట్టులో అభ్యర్థే దొరకని పరిస్థితి. ఖర్చు పార్టీ భరించాలని వెంకటగిరిలో కురగొండల రామకృష్ణ తేల్చి చెప్పారు. నగరిలో గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాశ్ కూడా ఇదే విషయం చెప్పాడు. దీంతో సిద్ధార్థ విద్యా సంస్థల చైర్మన్ అశోక్రాజ్కు టికెట్ ఇవ్వాలన్న యోచనలో టీడీపీ ఉంది. ► ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో ఎన్నికల ఖర్చులు పూర్తిగా భరిస్తేనే పోటీ చేస్తానని ఇన్చార్జ్ ఈరన్న చెబుతున్నారు. పెనుకొండలో పార్థసారథి, రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు, గుంతకల్లులో జితేంద్రగౌడ్తో పాటు చాలా చోట్ల నాయకుల మాట ఇదే! దీంతో బీజేపీ నేత సూరికి ధర్మవరం టికెట్ ఇస్తే.. మరో మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చు భరించాలని చెప్పినట్లు సమాచారం. పార్టీ గెలిచే అవకాశాలు లేనందున ఇంత ఖర్చు చేయాలా? వద్దా? అనే ఆలోచనలో సూరి ఉన్నారు. ► ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో టీడీపీకి ఎప్పుడూ గడ్డుకాలమే. ప్రొద్దుటూరు, బద్వేలు, రాజంపేట, కడప, జమ్మలమడుగుతో పాటు చాలా నియోజకవర్గాల్లోని అభ్యర్థులు అన్ని ఖర్చులు పార్టీ భరిస్తేనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఆర్థికంగా లబ్ధి పొంది, తర్వాత బీజేపీలోకి వెళ్లిన సీఎం రమేశ్ను తిరిగి రప్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. మొత్తంగా ఈ పరిస్థితిలో చాలా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి ఇన్చార్జ్లను నియమించేందుకు బాబు తల పట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా వార్ వన్సైడే! ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 సీట్లలో గత 20 ఏళ్లలో టీడీపీ నేతలు అత్యధికంగా గెలిచిన అసెంబ్లీ సీట్లు కేవలం నాలుగే. 2004లో 3, 2009లో 4, 2014లో 3, 2019లో సున్నా. ఈ గణాంకాలు చూస్తే ఇక్కడ టీడీపీ పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో పోటీ చేసేందుకు అభ్యర్థులు జంకుతున్నారు. కర్నూలు అసెంబ్లీ ఇన్చార్జ్గా టీజీ భరత్ ఉన్నారు. ఇతని తండ్రి టీజీ వెంకటేశ్ బీజేపీ నేత. ఒకే ఇంట్లో ఉంటూ, రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న వీరు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. దీంతో భరత్కు టికెట్ ఇచ్చినా ఓడిపోతారని తెలిసి, మైనార్టీ కోటాలో అహ్మదుల్లాఖాన్కు టికెట్ ఇవ్వాలని భావించారు. డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఖాన్, ఆ తర్వాత సర్వేలు చేయించుకుని టీడీపీ తరఫున బరిలో నిలిస్తే ఓటమి తప్పదని తేలడంతో పార్టీలో చేరకుండా మొహం చాటేశారు. డోన్ అభ్యర్థిగా కేఈ కుటుంబాన్ని కాదని ధర్మవరం సుబ్బారెడ్డిని అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. అయితే కేఈ ప్రభాకర్ మాత్రం డోన్లో తమ కుటుంబం పోటీలో ఉంటుందని, అన్ని రకాలుగా తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మరవొద్దని నేరుగా చంద్రబాబును ఉద్దేశించి స్పష్టం చేశారు. అంటే తమకు టికెట్ ఇవ్వకపోతే మరో పార్టీలోనో, స్వతంత్ర అభ్యర్థిగానో బరిలోకి దిగి.. టీడీపీని ఓడిస్తామనే భావన స్పష్టమవుతోంది. ఆదోనిలో మీనాక్షి నాయుడు పోటీకి అయిష్టంగా ఉన్నారు. దీంతో బీసీ వర్గానికి చెందిన ఎన్ఆర్ఐ, రియల్టర్ కోసం టీడీపీ అన్వేషిస్తోంది. ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ కేసులు, ఇతర వ్యవహారాల్లో తరచూ వివాదాల్లో ఉన్నారు. అక్కడ ఆమె ఏ లెక్కనా గెలిచే పరిస్థితే లేనందున, భూమా కిషోర్రెడ్డికి టికెట్ ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. నంద్యాలలో అఖిలకు, ఆమె సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. చివరకు గత నెల భూమా జయంతిని కూడా వేర్వేరుగా జరిపారు. మూడేళ్లు.. ముగ్గురు ఇన్చార్జ్లు ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ ఇన్చార్జిగా 2019 ఎన్నికల వరకు శిద్ధా రాఘవరావు ఉన్నారు. ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల సమయంలో దర్శి ఇన్చార్జిగా వచ్చిన కదిరి బాబూరావు.. 2019లో పోటీ చేసి ఓడిపోయాక వైఎస్సార్సీపీలో చేరారు. ఆ తర్వాత ఇన్చార్జిగా వచ్చిన పమిడి రమేశ్బాబు కూడా గతేడాది జూలైలో ‘సైకిల్’ దిగేశాడు. దీంతో ఇక్కడ ఎవరిని ఇన్చార్జ్గా నియమించాలో తెలియని పరిస్థితి. కనిగిరి టీడీపీ ఇన్చార్జ్ ఉగ్రనరసింహారెడ్డిని అక్కడి నేతలు పోకానాయుడు, హుస్సేర్యాదవ్, గంగరాజు, మాల్యాద్రి వ్యతిరేకిస్తున్నారు. మార్కాపురంలో టీడీపీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి ఉన్నారు. ఇక్కడ కీలక నేతలుగా ఉన్న డీవీ కృష్ణారెడ్డి, షేక్షావలి, మక్బుల్బాషా, బీఎల్పీ యాదవ్ ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. పొదిలికి చెందిన శ్రావణి వెంకటేశ్వర్లు, జి.భాస్కర్ పార్టీకి దూరంగా ఉన్నారు. -
‘పట్టిసీమ వల్ల సీమకు ఉపయోగం లేదు’
సాక్షి, కడప: గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించే ప్రతిపాదనలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చలను స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ మైసూరా రెడ్డి అన్నారు. త్వరలోనే గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి సంఘం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదనగుప్తాలతో కలిసి మైసూరా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమలోని 7 ప్రాజెక్ట్లకు నీటిని తరలించాలని ఏపీ విభజన చట్టంలో ఉందన్నారు. రాయలసీమకు 150 టీఎంసీల నీటిని కేటాయించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల సీమకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు మైసూరా రెడ్డి. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల జరుగుతున్న అన్యాయంపై ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు చర్చించాలని కోరారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్ట్లకు పుష్కలంగా నీరు చేరాలంటే కృష్ణా నదిపై సిద్ధేశ్వరం అలుగును త్వరగా పూర్తి చేయాలని కోరారు. శ్రీశైలంలో 885 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలన్న అంశంలో ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాలని సూచించారు. -
'సీమాంధ్రను పాక్, చైనా మాదిరిగా చూస్తోంది'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హడావిడిగా విభజించాలని చూస్తే మరిన్ని తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని విభజించి తెలుగు ప్రజలు కొట్టుకొవాలని చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం,నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పరిష్కరించకపోతే భవిష్యత్తులో విభేదాలు తలెత్తుతాయని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలను సంతృప్తి పరచకుండా విభజించడం సరికాదని ప్రతాప్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర ప్రాంతాన్ని చైనా, పాకిస్థాన్ దేశాలాగా చూస్తుందని ఆయన కేంద్రం వైఖరిని తప్పుపట్టారు. రాష్ట్ర విభజన జరిగితే గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని గతంలో కేంద్రానికి విన్నవించిన సంగతిని ఈ సందర్బంగా ఏరాసు ప్రతాప్ రెడ్డి గుర్తు చేశారు. విభజన అనివార్యమైతే రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కర్నూలు, అనంతపురం జిల్లా ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. -
సీమను చీల్చే కుట్ర : గడికోట శ్రీకాంత్రెడ్డి
వైఎస్సార్సీపీ నేత గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజం బాబు రాజగురువే చీల్చాలని చెప్పారు సీమను విడదీస్తుంటే కిరణ్, చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా? నేతలు మౌనం దాలిస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి విపత్కర పరిస్థితులను సృష్టించిన కాంగ్రెస్ అధిష్టానవర్గం.. రాయలసీమ జిల్లాలను కూడా చీల్చాలన్న దుర్మార్గానికి ఒడిగట్టడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గపు పనికి రాయలసీమ ప్రాంతానికే చెందిన కొందరు నేతలను పావులుగా వాడుకుంటోందని.. విభజించు-పాలించు అనే బ్రిటిష్ విధానాన్ని అమలుచేస్తోందని విమర్శించారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్లి.. రాష్ట్రాన్ని విభజిస్తే తమను తెలంగాణతో కలపాలని సోనియాగాంధీని అడిగారని, ప్రధాని మన్మో హన్నూ అదే కోరబోతున్నారని శ్రీకాంత్రెడ్డి చెప్పారు. మంత్రి రఘువీరారెడ్డి కూడా తాను సోనియాను కలిసి రాష్ట్రాన్ని విభజిస్తే గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలని చెబుతానని చెప్పారు. ఈ నేతలు రాష్ట్ర సమైక్యత కోసం పాటు పడుతున్నామని బయటకు చెబుతూ... తెరవెనుక సోనియా తో రాయలసీమను చీల్చే ప్రతిపాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతినిధి బృందంలో వెళ్లిన కాంగ్రెస్ నేతలే ఈ విషయాలను బయటకు చెబుతున్నారన్నారు. రాజకీయంగా తాను పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్ రాయలసీమను చీల్చాలనుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రాంతా ల మధ్య చిచ్చు పెట్టింది చాలక.. జిల్లాల వారీగా కూడా చిచ్చుపెట్టే దౌర్భాగ్య స్థితికి కాంగ్రెస్ పార్టీ చేరుకుందని శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. ‘‘శతాబ్దాల చరిత్ర ఉన్న రాయలసీమను చీల్చాలనే కుట్ర జరుగుతున్నా.. అదే ప్రాంతానికి చెందిన సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రులు గల్లా అరుణ, రామచంద్రయ్య, అహ్మదుల్లా వంటి వారు ఎందుకు స్పందించడం లేదు. కాంగ్రెస్ దుర్బుద్ధిని ఎందుకు ప్రశ్నించ లేకుండా ఉన్నారు? వారంతా గాడిదలు కాస్తున్నారా? లేక తాము పదవుల్లో ఉంటే చాలనుకుంటున్నారా?’’ అని గడికోట ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీకి స్వతహాగానే ప్రజాదరణ ఉండేదని, ప్రస్తుతం సోనియాకు ఏమాత్రం ప్రజాదరణ లేకపోవడంతో.. ఏ రాష్ట్రంలోనైనా ఒక ప్రజాదరణ గలిగిన బలమైన నాయకుడు ఎదుగుతూ ఉంటే ఓర్వడం లేదని శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. ‘‘2009 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు 33 లోక్సభ స్థానాలు గెలిపించి ఇస్తే... కాంగ్రెస్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టింది. రాష్ట్రాన్ని, జిల్లాలను చీలికలు చేసి తగవు పెడుతోంది. గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతగా కాంగ్రెస్ ఇచ్చే బహుమతి ఇదా!’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ మంచి సంక్షేమ పథకాలు అమలు చేసి, ఒంటరి పోరాటం చేసి 33 స్థానాలు గెలిపించి ఇస్తే... ఆయనను కూడా బలహీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు జగ న్మోహన్రెడ్డి బలమైన నాయకుడవుతాడనే భయం కాంగ్రెస్కు పట్టుకుందని, 30, 40 లోక్సభ సీట్లు గెలుచుకుని ఆయన తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవిస్తే తమకు సమస్యలు వస్తాయనే కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పారు. బాబు, రాజగురువు ఆస్తుల కోసమేనా!? ‘‘చంద్రబాబు తన ఆస్తులు, తన రాజగురువు ఆస్తులు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతోనే మాట్లాడడం లేదు.. చంద్రబాబు రాజగురువే సాక్షాత్తు గవర్నర్ వద్దకు వెళ్లి రాష్ట్రాన్ని ఎలా విభజించాలో చెప్పి వచ్చారట.. ఈ రాష్ట్రం, తెలుగు ప్రజలు ఏమైపోయినా ఆ రాజగురువుకు పట్టలేదు. తెలుగు ప్రజల బలీయమైన ఆకాంక్షలు, మనోభావాలు ఆయనకు పట్టలేదు..’’ అని శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదని, ఏ ప్రాంతం ఎటుపోయినా ఫర్వాలేదని మౌనంగా ఉంటే నష్టం జరుగుతుందన్నారు. నేతలు ఇప్పటికైనా నోరు విప్పాలని లేదా తమకు పదవులు, స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం కనుక మాట్లాడబోమని చెప్పాలని తాను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. నోరు మెదిపితే సీబీఐ కేసులు పెడతామని చంద్రబాబును కాంగ్రెస్ బెదిరించిన మాట వాస్తవం కాదా? అని కూడా ఆయన ప్రశ్నించారు. వారికి లొంగి మౌనంగా ఉంటే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడితే ప్రజలు తిరుగుబాటు చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తీరు నాజీయిజమే ! కాంగ్రెస్ వ్యవహారం చూస్తోంటే జర్మనీలో నాజీ నియంతల తీరును గుర్తుకుతెస్తోందని శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. నాజీలు ప్రజలను ఎలా విభజించి హతమార్చిందీ రచయిత మార్టిన్ నిలోమర్ చెప్పిన మాటలను ఆయన ఉదహరించారు. ‘‘వాళ్లు (నాజీలు) ముందుగా కమ్యూనిస్టులను చంపాలని వచ్చారు.. మేం కమ్యూనిస్టులం కాదు కనుక ఏమీ మాట్లాడలేదు.. వారిని నరికేశారు. రెండోసారి సోషలిస్టులను హతమార్చాలని వచ్చారు.. మేం సోషలిస్టులం కాదు కనుక పట్టించుకోలేదు.. వారినీ చంపేశారు. ఆ తరువాత వాళ్లు ట్రేడ్ యూనియన్ నేతల కోసం వచ్చారు. నేను ట్రేడ్ యూనియన్ నేతను కాదు కనుక జోక్యం చేసుకోలేదు.. అనంతరం క్యాథలిక్ల కోసం వచ్చారు.. మళ్లీ యూదుల కోసం వచ్చారు.. ఎప్పుడూ అంతే. చివరిగా వాళ్లు నాకోసమే వచ్చామన్నారు. అపుడు నా వెనుక ఎవరైనా ఉన్నారేమోనని చూశాను.. అప్పటికి ఎవరూ మిగల్లేదు. నా గురించి మాట్లాడేవారే లేకుండా పోయారు..’’ అని ఆ రచయిత వాపోయారని చెప్పారు. రాష్ట్రంలో పరిణామాలు కూడా అలాగే ఉన్నాయని గడికోట వ్యాఖ్యానించారు. ‘‘తొలుత జగన్పైకి వచ్చారు.. ‘ఆయన మా పార్టీ కాదు కదా, మేమెందుకు మాట్లాడాలి’ అని వేరే పార్టీల వారు భావించారు. తరువాత కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు పూనుకుంది. ‘ఈ ప్రాంతం మాది కాదు కదా, ఎందుకు మాట్లాడాలి’ అనుకున్నారు. ఈ రోజు జిల్లాల వారీగా చీలికలు తెస్తున్నారు. ఇంకా మేమెందుకు మాట్లాడాలని నాయకులు మౌనంగా కూర్చోవడం చూస్తోంటే ఆనాడు నాజీల సమయంలోలాగే అందరూ బలికావాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు. -
గ్రేటర్ రాయలసీమ కోసం పోరాడుతాం