breaking news
datta jayanthi
-
తలిస్తే... అనుగ్రహిస్తాడు
మనిషిని సంస్కరించి, కుటుంబ వ్యవస్థను చక్కదిద్ది, ఇంటిని ప్రశాంత నిలయంగా మార్చి తద్వారా యావత్ మానవ సమాజాన్నీ స్వర్గ ధామంగా, కలియుగ వైకుంఠంగా, ఆనంద నిలయంగా మార్చుకోవడానికి మార్గదర్శకమైనది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించటం కోసమే దత్తప్రభువు వివిధ కాలాల్లో వివిధ గురు స్వరూపాలుగా వెలుస్తూ, లోకులకు జ్ఞానబోధ కావిస్తూనే ఉన్నారు. శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీనృసింహసరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, అక్కలకోట మహరాజు, షిరిడి సాయిబాబాలను దత్త పంచకమంటారు. నేడు మార్గశిర పౌర్ణమి... దత్తులవారి అవతరణ దినోత్సవం సందర్భంగా... అత్రి, అనసూయల తపస్సునకు మెచ్చి దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో రూపుదిద్దుకున్నాడు. అత్రి వరదునిది దైవ, గురు స్వరూపాల కలయిక. అందుకే దత్తాత్రేయుడు ఆదిగురువయ్యాడు. మాయా ప్రభావంతో దారితప్పుతున్న మానవులకు జ్ఞానబోధలకు, ఆచార వ్యవహారాల అనుసరణకు, ధర్మాధర్మ విచక్షణకు, శిష్టరక్షణతోబాటు, మానవాళి విధ్యుక్త ధర్మాల ప్రబోధకే ప్రాధాన్యతనిచ్చాడు. ఇదే ఆయన గురుతత్త్వం. జ్ఞానజ్యోతులు వెలిగించి, ప్రజల అజ్ఞానపు చీకట్లు తొలగించేందుకు వెలసిన దత్తస్వామి రూపం నయన మనోహరం, భద్రపదం, భవ బంధ నాశనం, భవసాగరతారకం. సర్వసృష్టినీ ప్రేమించే ఆ కరుణామూర్తి అనేక విశిష్టతలకు కాణాచి. దత్తావతార ముఖ్యోద్దేశం భిన్నత్వంలో ఏకత్వసాధన. అన్ని సాధనలను ఏకం చేసి, తనలో కలుపుకోవడమే ఈ అవతార తత్త్వం. కర్మ, భక్తి, జ్ఞానాలను ఒక్కొక్క దానిని ఒక్కొక్క యోగంగా మలచి, వాటినన్నింటినీ జ్ఞానంతో సంలీనం చేసి, సాధకులను బ్రహ్మజ్ఞాన విధులుగా పరిగణింపజేయడం... సాధనలో పరిపూర్ణ స్థితిని అందుకునేటట్లు అనుగ్రహించడం దత్తాత్రేయుడి తత్వం. సంసారంలో ఉంటూనే, స్వధర్మపాలన చేసుకుంటూ తరించవచ్చని, ముక్తిని సాధించవచ్చన్నదే దత్తసాంప్రదాయం. దత్తాత్రేయుని స్వభావంలో మూడు ముఖ్య లక్షణాలు గోచరిస్తాయి. మెుదటిది ఆయన తమ నామ స్మరణతో సంతుష్ఠులై స్మరించగానే కదలి వస్తారు. అందుకే ఆయనను స్మర్తృగామిగా కీర్తిస్తారు. రెండవది వారు భక్తులకు ఇహ పర సౌఖ్యాలను ఇస్తూ, యోగశక్తిని ప్రసాదించి, జీవన్ముక్తులుగా చేస్తారు. మూడవ లక్షణం... భక్తుల వెన్నంటే ఉంటూ, వారి మంచి చెడ్డలు చూస్తూ, వారికి దత్తమౌతాడు. ఈ మూడు లక్షణాలు వారిలోని దైవ, గురు లక్షణాలను సూచిస్తాయి. ఈ స్వభావం ఆధారంగానే లక్షణాలను, లక్ష్యాలను గుర్తించవచ్చు. దత్తునిది జ్ఞానతత్త్వం. ఆయన బ్రహ్మవిద్యను, శ్రీవిద్యను, యోగవిద్యను లోకానికి ప్రసాదించిన విశ్వగురువు. దత్తుడు బ్రహ్మకు వేదవిద్య, మంత్రవిద్య, బ్రహ్మవిద్యలను ఉపదేశించాడు. అలాగే ప్రహ్లాదునికి ఆథ్యాత్మిక విద్య, వశిష్టునికి యోగవిద్య, పరÔ]æురామునికి శ్రీవిద్య, కార్తవీర్యునికి ఆత్మవిద్య, అలర్కునికి యోగవిద్య... ఇలా ఎంతోమంది మహానుభావులకు జ్ఞానామృతాన్ని పంచాడు. ఇందులో సంతులు, సాధువులు, అవధూతలు ఎందరో వున్నారు. దత్తాత్రేయునిది నిత్యం ఆసేతు హిమాచలం చుట్టివచ్చే తత్త్వం. ప్రతి ఉదయం కాశీలో గంగాస్నానం, గాణుగాపురంలో ధ్యానం, కొల్హాపురంలో భిక్ష, కురుక్షేత్రంలో ఆచమనం... ఇలా వివిధ ప్రాంతాలలో సంచరిస్తూ భక్త జనావళిని జాగృతపరుస్తూ ఉంటాడు. దత్త జయంతికి ఒక విశిష్టత ఉంది. ఆకాశంలోని నక్షత్ర మండలంలో దత్తుడు జన్మించిన మార్గశిర మాసంలో పూర్ణిమనాడు మానవులు నివసించే భూమి తిరుగుతూ, తిరుగుతూ, విశ్వాంతరాళంలో దత్తుని స్థానానికి అతి సమీపంగా వస్తుంది. ఆ సమయానికి సూర్యచంద్రులతో బాటు, మానవులు కూడా ఒõ సరళరేఖలో దత్తునికి చేరువగా ఉంటారు. అందువల్ల దత్తజయంతినాడు అసంకల్పితంగా మానవులలోనికి దత్తశక్తి ప్రవేశిస్తుంది. ఆ రోజు దత్తుని విశేషంగా పూజించినవారు ఆయన అనుగ్రహానికి పాత్రులు కాగలరు. దత్తాత్రేయునిది శివకేశవుల అభేద తత్త్వం. జ్ఞానం కోసం పరమేశ్వరుని, మోక్షం కోసం విష్ణువును ప్రార్థించి, పూజాపురస్కారాలు లేని బ్రహ్మతోకలసి, బ్రహ్మవిష్ణువుల రూపంతో వెరసి దత్తాత్రేయావతారం భువిపైకి వచ్చింది. శైవం, వైష్ణవం వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని తెలిపేందుకే దత్తతత్త్వం ఉదయించింది. దత్తుని పూజిస్తే మోక్షం, జ్ఞానం ఒకేసారి పొందవచ్చు. ఈ దత్తావతారాల విశిష్టత ఏమిటంటే, వీరి భౌతికదేహాలు అంతమైనా, వీరి ఉనికికి భంగం రాదు. దేహంతో ఉన్నప్పుడు కూడా వీరు ఆపదలో ఉన్నవారిని అనేక విధాలుగా కాపాడారు. వీరి భౌతిక శరీరాలు గుప్తమైనా వీరి లీలలు కొనసాగుతూనే వుంటాయన్నది వీరి వాగ్దానం. అందుకే శిరిడీసాయి ‘‘నా సమాధి అనంతరం నా మట్టే మీ కోర్కెలకు ప్రతిస్పందిస్తుంది’’ అని అన్నారు. వీరి చరిత్రల పారాయణల ద్వారా దత్తరూపాలన్నింటిని ఏదో విధంగా సేవించి, తరించే దారి దొరుకుతుంది. చింతనం, నామస్మరణం వీరి అనుగ్రహం సంపాదించేందుకు సులభమైన, శ్రేష్ఠమైన మార్గాలు. దత్తాంశతో వారి అవతారాలుగా జన్మించిన వారందరి అవతారలక్ష్యం ప్రజలకు చేరువగా ఉంటూ, వారి సమస్యలకు పరిష్కారం తెలుపుతూ, నడిపించటమే. ప్రతి అవతారంలో సారూప్య, స్వభావాలు ఇంచుమించు ఒకేవిధంగా ఉండటం విశేషం. గురుపరంపరలో దత్తాత్రేయుడు ఒక అవతారం పరి సమాప్తి అయిన తరువాత మరొక నామధేయంతో వేరొక అంశావతారంతో కాలానుగుణంగా తన ప్రవర్తనను సమన్వయ పరుస్తూ జనులను ఉద్ధరించారు. అందుకే దత్త జయంతిని గురుప్రచార తత్త్వానికి అంకితం చేస్తూ, ఆ రోజు, జప, తపాలతో ధ్యానించి తరించాలి. – దువ్వూరి భాస్కరరావు -
వైభవంగా దత్తాత్రేయ జయంతి
పిఠాపురం : పాదగయ క్షేత్రంలో మంగళవారం దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. భక్తులతో క్షేత్రం కిటకిటలాడింది. దత్త దీక్ష చేపట్టిన స్వాములు ఇరుముడులు సమర్పించారు. మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, హోమం నిర్వహించారు. పలువురు దంపతులు సామూహిక దత్త సత్య వ్రతాలు చేశారు. స్వామివారికి పల్లకీ సేవ వైభవోపేతంగా సాగింది. ఆలయ ఈఓ చందక దారబాబు, దత్తాత్రేయస్వామి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు వాడ్రేవు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా దత్త జయంతి
పింప్రి, న్యూస్లైన్: పుణే నగరంలోని దత్తాత్రేయ మందిరాల్లో దత్త జయంతి సోమవారం ఘనంగా జరిగింది. భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు బారులు తీరారు. వివిధ ఆలయాలలో అఖండ గురుచరిత్ర పారాయణం, హారతి, జన్మోత్సవాలను జరిపారు. పుణేలోని మండాయి దత్తమందిర్, కసబాపేట్లోని కాళదత్తమందిర్, నారాయణ్పూర్లోని దత్త మందిర్, నవీపేట్లోని లోకమాన్య నగర్ దత్తమందిర్లతోపాటు వివిధ మండళ్లు దత్త జయంతి సందర్భంగా తాత్కాలిక మండపాలను ఏర్పాటు చేశాయి. భక్తులు ఔదాంబిర వృక్షాలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అప్పా బల్వంత్ చౌక్లోని ఆనందాశ్రమములో భజనలు, ప్రవచనాలు, కీర్తనలు ఆలపించారు. అదేవిధంగా నాటకాలు ప్రదర్శించారు. వాసుదేవానంద సరస్వతి టేంబేస్వామి సమాధి 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గురుచరిత్ర పారాయణం చేశారు. వార్జేలోని చిదానంద ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో భగవతితాయి సతార్కర్ కీర్తనలు ఆలపించారు. అలీబాగ్ నుంచి వచ్చిన పల్లకీ యాత్రకు శ్రీ క్షేత్రనారాయణ్పూర్లో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దీపక్ పాయేగుడే, నిలేష్ కణసే, ఉమేష్ శేడగే, జితేంద్ర బోత్రే తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయుడిని దర్శించ్జుకునేందుకు భక్తులు బారులు తీరారు. సుతార్వాడి మహాదేవ్ మందిరంలో దత్త జయంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయాలలో తీర్థ ప్రసాదాలు పంచారు.