breaking news
Cattle health
-
పశువుల్లో యాంటీబయాటిక్స్ లేని పాల ఉత్పత్తికి కొత్త పద్ధతులు..
యాంటీబయాటిక్ ఔషధాలను మనుషులకు చికిత్సలో, పశు వ్యాధుల చికిత్సలో నిర్దేశిత మోతాదుల కన్నా అధికంగా, విచక్షణా రహితంగా వినియోగిస్తున్నందు వల్ల కొన్ని సూక్ష్మక్రిములు ఈ మందులకు అలవాటు పడిపోయి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. మొండికేసిన క్రిములు (సూపర్ బగ్స్) తయారవుతున్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీబయాటిక్స్కూ లొంగటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న ఈ సమస్యను యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.)గా వ్యవహరిస్తున్నాం. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారిని అరికట్టడానికి తక్షణం స్పందించకపోతే 2050 నాటికి ఏటా కోటి మంది (ఇందులో 20 లక్షల మంది భారతీయులే) ఎ.ఎం.ఆర్. సమస్యతో చనిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎ.ఎం.ఆర్. సమస్య వల్ల యాంటీబయాటిక్ మందులు అసమర్థంగా మారడంతో శరీరం నుంచి ఇన్ఫెక్షన్లను తొలగించడం కష్టతరంగా మారుతోంది. ఉపయోగించిన యాంటీబయాటిక్స్ పరిమాణంలో 90% విసర్జితాల ద్వారా పర్యావరణంలోకి చేరి నీరు, నేల కలుషితమవుతుంది. ఎ.ఎం.ఆర్. సమస్యను పరిష్కరించాలంటే.. మనుషులతోపాటు పాలు, గుడ్లు, మాంసం కోసం పెంచే పశుపక్ష్యాదుల కోసం యాంటీబయాటిక్స్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. పాడి పశువులకు వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటించడం, జబ్బులు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్కు బదులు సంప్రదాయ మూలికలతో కూడిన పశు ఆయుర్వేద పద్ధతులు అనుసరించడం ద్వారా ఎ.ఎం.ఆర్. సమస్య నుంచి సమర్థవంతంగా బయటపడవచ్చని శాస్త్రీయంగా రుజువు కావటం సంతోషదాయకం. బెంగళూరులోని యూనివర్సిటీ ఆఫ్ ట్రాన్స్–డిసిప్లినరీ (యు.టి.డి.) హెల్త్ అండ్ టెక్నాలజీ, తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులు గత పదేళ్లుగా ఈ దిశగా చేస్తున్న విశేష కృషి సత్ఫలితాలనిచ్చింది. 10 రాష్ట్రాల్లో సంప్రదాయ పశువైద్య పద్ధతులను అధ్యయనం చేసి 441 మూలికా వైద్య మిశ్రమాలను గుర్తించారు. వీటిని పరీక్షించి 353 మందులు సురక్షితమైనవని, ప్రభావవంతమైనవని నిర్థారించారు. జాతీయ పాడి అభివృద్ధి బోర్డు (ఎన్.డి.డి.బి.) ఈ పశు ఆయుర్వేద పద్ధతులను ఐదేళ్లుగా సహకార సంఘాల ద్వారా పాడి రైతులకు పరిచయం చేసి అద్భుత ఫలితాలను రాబడుతున్నది. 24 రకాల పశు వ్యాధులను నివారించడంలో, నిరోధించడంలోనూ సంప్రదాయ మూలికా మిశ్రమాలు అత్యంత సమర్థవంతంగా పని చేస్తున్నాయని ఎన్.డి.డి.బి. నిర్థారణకు వచ్చింది. ఈ పద్ధతులను పాడి సంఘాల ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు పరిచయం చేస్తోంది. ఏటా యాంటీబయాటిక్ మందుల కొనుగోలుకు రూ. 1.86 కోట్లు ఖర్చు పెట్టే ఎన్.డి.డి.బి. ఈ ఖర్చును సంప్రదాయ మూలికా వైద్యం అనుసరించడం ద్వారా రూ. 50 లక్షలకు తగ్గించుకోగలిగింది. 1,500 గ్రామాల్లో పాడి రైతులకు ఈ మూలికా చికిత్సను ఇప్పటికే నేర్పించింది. తమ పరిసరాల్లోని ఔషధ మొక్కలు, దినుసులతోనే పశు వ్యాధుల నివారణకు, చికిత్సకు ఉపయోగించుకుంటూ శాస్త్రీయంగా యాంటీబయోటిక్ మందుల వాడకాన్ని 80% తగ్గించామని ఎన్.డి.డి.బి. చైర్మన్ మీనెష్ షా ప్రకటించారు. పొదుగువాపు వ్యాధి, గాలికుంటు వ్యాధులను రసాయనిక యాంటిబయాటిక్స్ వాడకుండా నూటికి నూరు శాతం పూర్తిగా తగ్గించగలిగామని ఆయన తెలిపారు. పాలలో యాంటీబయాటిక్స్ను 88% తగ్గించగలిగాం: ప్రొ. నాయర్ యూనివర్సిటీ ఆఫ్ ట్రాన్స్–డిసిప్లినరీ (యు.టి.డి.)లోని మూలికా పశువైద్య పరిశోధనా విభాగం అధిపతి ప్రొ. ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్, తన సహచరులు డా. ఎన్. పుణ్యమూర్తి, ఎస్.కె. కుమార్తో కలిసి పశు ఆయుర్వేద పద్ధతులపై పరిశోధనలు చేస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో 140 మంది పాడి రైతులతో కలసి మూడేళ్లు ప్రయోగాత్మకంగా మూలికా వైద్యంపై అధ్యయనం చేశారు. పాలలో యాంటీబయాటిక్స్ అవశేషాలను 88% తగ్గించగలిగామని ప్రొ. నాయర్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఎన్.డి.డి.బి.తో కలసి ఏపీ, తెలంగాణ సహా 14 రాష్ట్రాల్లోని 30 పాల సంఘాలలో 1750 మంది పశువైద్యులకు, 30 వేల మంది పాడి రైతులకు, 560 మంది గ్రామ రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. తమ యూనివర్సిటీలో రైతుల కోసం 4 రోజుల సర్టిఫికెట్ కోర్సు, పశువైద్యుల కోసం 7 రోజుల సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపెట్టామన్నారు. ఎమ్మెస్సీ, పిహెచ్డి కూడా పెట్టామన్నారు. సిక్కిం, హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకొని రసాయనిక యాంటీబయాటిక్స్ అవసరంలేని పశుపోషణపై శిక్షణ ఇస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు ముందుకొస్తే స్వల్ప ఫీజుతోనే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకందారులకు పశు ఆయుర్వేద పద్ధతులపై శిక్షణ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. వివరాలకు.. ప్రొ. ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్ – 63602 04672. nair.mnb@tdu.edu.in చదవండి: World's Largest Cemetery: ఇది నగరంలోని శ్మశానం కాదు.. శ్మశానమే ఓ మహానగరంగా! ఎక్కడుందో తెలుసా? -
పాలు పితికే వేళ.. జాగ్రత్తలు పాటించాలి
కందుకూరు: పశువుల నుంచి పాలు పితికే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే అటు పశువుల ఆరోగ్యంతో పాటు ఇటు పాలను స్వచ్ఛంగా ఉంచవచ్చు. దీంతో ఎక్కువ సమయం పాలు చెడిపోకుండా ఉంటాయి. వీటి నుంచి తీసిన వెన్న, నెయ్యి, మంచి రుచి, వాసన కలిగి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పాల శుభ్రత అనేది పశువుల ఆరోగ్య స్థితి, పశుశాలలు, పాలు పితికే మనిషి, పాలు నిల్వ ఉంచే పాత్రల శుభ్రత మీద ఆధారపడి ఉంటుందంటున్నారు మండల పశువైద్యాధికారి రవిచంద్ర . పాలు పితికే సమయంలో పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఆయన పలు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. పశువుల ఆరోగ్య స్థితి... పాలిచ్చే పశువుల ఆరోగ్యం పట్ల రైతులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. అంటువ్యాధులతో బాధపడే పశువులను మంద నుంచి వేరు చేసి పశువైద్యుల సలహా మేరకు అవసరమైన చికిత్సను అందించాలి. పశువు శరీర భాగాలైన కడుపు, డొక్కలు, పొదుగు పాలు పితికే ముందు శుభ్రంగా కడిగి తడి బట్టతో తుడవాలి. డొక్కలకు పొదుగుకు మధ్య ఉండే వెంట్రుకలను పొడవు పెరగనీయకుండా కత్తిరించాలి. పొదుగును శుభ్రపరిచి పొడిబట్టతో తుడవాలి. ఆ తర్వాత పాలు పితకాలి. పాలు తీయడం పూర్తయిన తర్వాత యాంటీసెప్టిక్ ద్రావణం (ఉదాహరణకు కోర్సలిన్ ద్రావణం లీటర్ నీటికి 2 మి.లీ కలపాలి)తో కడగాలి. అదే నీటితో పిండిన వ్యక్తి తన చేతులను కడుక్కోవాలి. పితికిన వెంటనే నేలపై పశువును అరగంట వరకు పడుకోనీయవద్దు. అప్పుడే పాలు పిండటంతో చను రంధ్రాలు తెరచుకోని ఉంటాయి. దీంతో ఒక వేళ పశువు పడుకుంటే ఆ రంధ్రాల నుంచి నేలపై ఉన్న బ్యాక్టీరియా త్వరగా పొదుగులోకి చేరి పొదుగు వాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. పాలు పితికిన వెంటనే పశువు పడుకోకుండా ఉంచాలంటే వాటి ముందు గడ్డి కాని లేదా దాణా పెట్టాలి. పశువుల షెడ్లో... పశువుల షెడ్లను ఎత్తయిన, నీరు నిల్వ ఉండని ప్రాంతంలో నిర్మించుకోవాలి. దీంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వీలవుతుంది. షెడ్ లోపలఙగడ్డి గాని లేదా ఇటీవల మార్కెట్లో ప్రత్యేకంగా వస్తున్న రబ్బర్ షీట్లను గాని పరుచుకోవచ్చు. షెడ్లో దోమలు, ఈగలు రాకుండా జాగ్రత్త వహించాలి. అవసరాన్ని బట్టి క్రిమి సంహారక మందులను పిచికారీ చేయాలి. దుమ్ము లేచే నేల అయితే పాలు తీసే ముందు కొద్దిగా నీరు చల్లాలి. పాలు తీసే వ్యక్తి... పశువుల నుంచి పాలు తీసే వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి. అంటువ్యాధులు, చర్మ వ్యాధులతో బాధపడేవారిని పాలు తీయడానికి ఉపయోగిం చవద్దు. పాలు తీసే వారి చేతి గోర్లు పెరగకుండా కత్తిరించుకునేలా చూడాలి. పాలు తీసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కుని పొడి గుడ్డతో తుడుచుకోవాలి. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకుని మరొక దాని పాలు తీయాలి. లేకపోతే ఆ పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. వేడినీటితో పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.