breaking news
cable stray bridge
-
కేబుల్ స్పీడ్
సాక్షి, సిటీబ్యూరో: దుర్గం చెరువుఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టే బ్రిడ్జి పనులుశరవేగంగా జరుగుతున్నాయి. దసరా వరకు పనులు పూర్తి చేయాలని భావిస్తున్న జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. రెండు పిల్లర్ల మధ్య వేసే మెయిన్ బ్రిడ్జిలో ప్రీకాస్ట్ సెగ్మెంట్ అలైన్మెంట్ ప్రక్రియను గురువారం విజయవంతంగా పూర్తి చేశారు. 160 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ భారీ సెగ్మెంట్ దేశంలోనే పెద్దది. ఇప్పటివరకు ఇంత బరువైన సెగ్మెంట్ను ఎక్కడా వినియోగించలేదు. ఇనార్బిట్మాల్ సమీపంలోనిప్రీకాస్టింగ్ యార్డులో తయారైన ఈ ప్రీకాస్ట్ సెగ్మెంట్ను తొలుత దుర్గం చెరువు వరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత పంటూన్ ద్వారా చెరువులోకి తీసుకెళ్లి పైకి లిఫ్ట్ చేశారు. ఈ బ్రిడ్జిని మొత్తం 52 సెగ్మెంట్లతో నిర్మించనుండగా... దేశీయ సాంకేతికతతోనే ఇంతటి భారీ సెగ్మెంట్ను విజయవంతంగా పైకి తీసుకెళ్లారు. చెరువుపై ఉండే బ్రిడ్జి స్పాన్ 234 మీటర్లు కాగా... ఇది దేశంలోనే అతి పొడవైనది. జపాన్లో ఇంతకంటే పొడవైన స్పాన్లతో కేబుల్ బ్రిడ్జీలు ఉన్నప్పటికీ.. వాటిల్లో స్టీల్ వినియోగించారని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీధర్ తెలిపారు. స్టీల్ లేకుండా ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టే ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్రిడ్జిలో మాత్రం ప్రపంచంలోనే ఇది పొడవైనదని పేర్కొన్నారు. ఇంత పొడవైన స్పాన్ ఇప్పటి వరకు ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఇక మన దేశానికి వస్తే గుజరాత్ బరూచ్ జిల్లాలోని 144 మీటర్ల కేబుల్ బ్రిడ్జే పెద్దదని చెప్పారు. మెయిన్ స్పాన్తో పాటు రెండువైపులా బ్యాక్ స్పాన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే పొడవు 426 మీటర్లు అవుతుందన్నారు. దీని అంచనా వ్యయం రూ.184 కోట్లు కాగా... నిర్మాణం పూర్తయితే జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి ఐకియా స్టోర్ వరకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యమవుతుందన్నారు. మొదటి సెగ్మెంట్ అమరిక పనులు మొత్తం ఐదారు రోజుల్లో పూర్తవుతాయని జీహెచ్ఎంసీ సూపరింటెండింగ్ ఇంజినీర్ వెంకటరమణ తెలిపారు. ఆ తర్వాత రెండు రోజులకో సెగ్మెంట్ చొప్పున పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 60 శాతం పూర్తి... దుర్గం చెరువుపై 20 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ కేబుల్ బ్రిడ్జి పనులు 65 శాతం పూర్తయ్యాయి. ఎక్స్ట్రా డోస్డ్ సాంకేతికత వినియోగిస్తున్నందున చెరువు మధ్యలో పిల్లర్ అవసరం లేకపోవడంతో పాటు వంతెనను 75 మీటర్లకు బదులు 57 మీటర్ల ఎత్తులోనే నిర్మిస్తున్నారు. హైదరాబాద్ హ్యాంగింగ్ బ్రిడ్జిగానూ ఇది గుర్తింపు పొందనుంది. బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాక జూబ్లీహిల్స్ నుంచి మైండ్స్పేస్, గచ్చిబౌలిలకు దాదాపు 2కి.మీ మేర దూరం తగ్గడంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, మాదాపూర్లపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. దసరా నాటికి ఈ కేబుల్ స్టే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. దీంతో పాటు రూ.333.55 కోట్ల వ్యయంతో చేపట్టిన షేక్పేట్ ఎలివేటెడ్ కారిడార్, రూ.263 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్తగూడ గ్రేడ్ సెపరేటర్, ఒవైసీ హాస్పిటల్ నుంచి బహదూర్పురా మార్గంలో రూ.132 కోట్ల వ్యయంతో కారిడార్, అంబర్పేట ఛే నంబర్ వద్ద రూ.270 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫ్లైఓవర్లు కూడా ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. -
‘దుర్గానికి’ కొత్త సొబగులు
ఐటీ కారిడార్కు ఆధునిక హంగులు సాక్షి, హైదరాబాద్: ఐటీ కారిడార్కు సరికొత్త సొబగులద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆధునిక హంగులతో కూడిన కేబుల్ స్ట్రేబిడ్జి (వేలాడే వంతెన)తో పాటు దుర్గం చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టనుంది. రూ.184 కోట్లతో నిర్మించనున్న కేబుల్ స్ట్రేబిడ్జి, రూ.3.5 కోట్లతో చేపట్టనున్న దుర్గం చెరువు సుందరీకరణ పనులకు మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. కేబుల్ స్ట్రే బ్రిడ్జి.. రెండేళ్లలో పూర్తికానున్న ఈ వంతెన వినియో గంలోకి వస్తే ఐల్యాబ్స్ జంక్షన్(ఇనార్బిట్మాల్ చివర) నుంచి అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గర జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 45 వరకు కొత్త అనుభూతితో కూడిన ప్రయాణ సదుపాయం కలగనుంది. బ్రిడ్జి మొత్తం పొడవు దాదాపు కిలోమీటర్ కాగా.. 365.85 మీటర్ల మేర వేలాడే వంతెన ఉంటుంది. ఇది అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్ నుంచి హైటెక్సిటీ, మాదాపూర్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ జంజాటం తప్పుతుంది. పర్యాటక కేంద్రంగానూ సందర్శకులను ఆకట్టుకోనుంది. ముంబై, గోవా, కోల్కతా, జమ్మూకశ్మీర్, జైపూర్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి బ్రిడ్జిలు అందుబాటులో ఉన్నా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రథమం. -ఈ బ్రిడ్జి వల్ల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి హైటెక్సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు వెళ్లే వారికి సదుపాయంగా ఉంటుంది. - జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, మాదాపూర్ మార్గాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. - రోడ్ నంబర్ 45 వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్తో బ్రిడ్జిని అనుసంధానించడం వల్ల రోడ్ నంబర్ 45, హైటెక్సిటీ మధ్య ఇబ్బందుల్లేని సాఫీ ప్రయాణం అందుబాటులోకి రానుంది. - ఈ బ్రిడ్జి డిఫెక్ట్ లయబిలిటీ పదేళ్లు. ఆలోగా ఎలాంటి మరమ్మతులు అవసరమైనా కాంట్రాక్టు సంస్థే చేయాల్సి ఉంటుంది. సుందరీకరణ.. పలు ఆక్రమణలతోపాటు కాలుష్య కాసారంగా మారిన దుర్గం చెరువు సుందరీకరణలో భాగంగా గుర్రపుడెక్క తొలగింపు, శుద్ధి కార్యక్రమాలకు రూ.50.80 లక్షలు ఖర్చు చేయనున్నారు. సీఎస్సార్లోభాగంగా రహేజా ఐటీ పార్కు ఈ నిధుల్ని కేటాయించింది. ఇప్పటికే పనులు ప్రారంభమైనా ఇప్పుడు లాంఛనంగా శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.2 కోట్లతో దుర్గం చెరువు చుట్టూ 2.2 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే పార్కు, యోగా కేంద్రం తదితర పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసింది. వీటితోపాటు రూ.90 లక్షలతో గణేశ్ నిమజ్జనాలకు ప్రత్యేక కొలను నిర్మించనున్నారు. దీనిలో 3 వేలకు పైగా చిన్న విగ్రహాలను నిమజ్జనం చేయవచ్చు. బ్రిడ్జి ముఖ్యాంశాలు.. అప్రోచ్లతోపాటు బ్రిడ్జి పొడవు 1,048 మీ. కేబుల్ స్ట్రేబిడ్జి 365.85 మీ. అప్రోచ్ వయడక్ట్ పొడవు 300 మీ. సాలిడ్ అప్రోచెస్ 1,048 మీ. నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్కు టెండర్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి దుర్గం చెరువు వరకు నాలుగు లేన్ల ఫ్లై ఓవర్(ఎలివేటెడ్ కారిడార్)కు జీహెచ్ఎంసీ మంగళవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే దుర్గం చెరువు వరకు సులభంగా వెళ్లవచ్చు. ఈపీసీ పద్ధతిలో జాతీయస్థాయి టెండర్లను ఆహ్వానించారు. ఏడాదిన్నర కాలంలోగా నిర్మాణాన్ని పూర్తిచేయాలి. డిఫెక్ట్ లయబిలిటీ రెండేళ్లు. కాంట్రాక్టులో భాగంగా సర్వే, ఇన్వెస్టిగేషన్, సమగ్ర డిజైన్లతోపాటు నిర్మాణ పనులు పూర్తిచేయాలి. అంచనా వ్యయం రూ.82.14 కోట్లు. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి బిడ్ డాక్యుమెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివరాలిలా ఉన్నాయి. టెండర్ ప్రారంభం: 26–04–2017(సాయంత్రం 5 గంటల నుంచి) ప్రీ బిడ్ సమావేశం: 04–05–2017(మధ్యాహ్నం 3 గంటలు) టెండర్ చివరి తేదీ: 22–05–2017(మధ్యాహ్నం 2 గంటల వరకు డౌన్లోడ్. 3 గంటలలోపు బిడ్ల దాఖలు) టెక్నికల్ బిడ్ల ఓపెనింగ్: 22–05–2017(సాయంత్రం 4 గంటల తర్వాత) ప్రైస్ బిడ్ల ఓపెనింగ్: 25–05–2017(సాయంత్రం 4 గంటల తర్వాత)


