breaking news
Bread maker
-
ఈ డివైస్తో ఇంట్లోనే బ్రెడ్ తయారు చేసుకోవచ్చు
ఈమధ్య.. కిరాణా లిస్ట్లో బ్రెడ్ అనేది కామన్ అయిపోయింది. అయితే బయట కొనుక్కోవడం కంటే ఇంట్లో చేసుకుంటేనే హెల్దీ అండ్ టేస్టీ అంటుంటారు చాలామంది. ఈ బ్రెడ్ మేకింగ్ మెషిన్ 15 ఆటోమేటిక్ ప్రోగ్రామ్స్తో యూజర్ ఫ్రెండ్లీగా నిలుస్తోంది. క్విక్ బ్రెడ్, గ్లూటెన్–ఫ్రీ బ్రెడ్, ఫ్రెంచ్ హోల్ వీట్ బ్రెడ్, జామ్ బ్రెడ్ వంటివాటిని లైట్, మీడియం, డార్క్ కలర్స్తో అందిస్తుంది. ఆటోమేటిక్ మిక్స్, ఇంటెలిజెంట్ ఫ్రూట్, నట్ డిస్పెన్సర్.. ఇలా సులభంగా పదార్థాలను కలిపి ప్రోగ్రామింగ్ చేస్తుంది. టైమ్ సెట్టింగ్కి.. పిఫ్టీన్ అవర్స్ టైమర్తో, ట్వంటీ మినిట్స్ పవర్ ఇంటరప్షన్ రికవరీతో, వన్ అవర్ ఆటోమేటిక్ హీటింగ్ ఆప్షన్ తో ఇది రూపొందింది. నాన్–స్టిక్ పాన్, మెజరింగ్ కప్ మెషిన్ తో పాటు లభిస్తాయి. దీన్ని సులభంగా శుభ్రం చేయవచ్చు. డివైస్ మూతపైన బ్రెడ్ ఆప్షన్స్తో పాటు.. చిన్న ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటుంది. దీని ధర 189 డాలర్లు (రూ.15,742). -
లొట్టలేయించే రొట్టెలు!
భోజన ప్రియులను విభిన్న రుచులతో నోరూరిస్తుంది తూర్పు గోదావరి జిల్లా. కాకినాడ కోటయ్య కాజా, తాపేశ్వరం మడత కాజా, ఆత్రేయపురం పూత రేకులు, పెరుమాళ్లపురం పాకం గారెలు... అటువంటిదే ముక్కామల మినపరొట్టె. ఈ రొట్టెను ఏభైఏళ్లుగా లొట్టలేసుకుని తింటున్నారు. అమలాపురానికి 15 కిలోమీటర్ల దూరంలో చిన్న పల్లెటూరు ముక్కామల. తయారీ, రుచి, అన్నింటిలో అక్కడ వండే మినపరొట్టె అద్భుతంగా ఉంటుంది. ముక్కామల పంట కాల్వ గట్టుపై ఓ పూరి పాక... అందులో ఓ చెక్క పెట్టె. కూర్చునేందుకు ఇటుకలపై అమర్చిన రెండు నాపరాతి బల్లలు... పట్టుమని పది మంది కూడా కూర్చునేందుకు జాగా లేని ఆ పూరి పాకలో ఏడు పదుల నిండిన వృద్ధుడు ఇటుకల పొయ్యిపై మినప రొట్టెలు కాల్చుతూ ఉంటాడు. రోజూ సాయంత్రం మూడు గంటలైతే చాలు ఎక్కడికెక్కడి నుంచో ఈ కాకా హోటల్కు వచ్చేస్తారు. ఇక్కడి రొట్లెను అరిటాకులోనే అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం ముక్కామల గ్రామంలో అబ్బిరెడ్డి సత్యనారాయణ (తాత) కాకా హోటల్ అంటే కోనసీమ వ్యాప్తంగానే కాదు జిల్లాలోని పలు నగరాలు, పట్టణాలకు చెందిన వారికి కూడా సుపరిచితమే. అన్నీ ప్రత్యేకతలే తాత వేసే మినపరొట్టె చూసేందుకు సాదాసీదాగా ఉంటుంది. అయితే ఆ రొట్టెకు అన్నీ ప్రత్యేకతలే. దాని రుచి అమోఘం. కమ్మని వాసనతో ఆవిర్లు కక్కుతుంది. కొబ్బరి చట్నీ, సెనగ చట్నీలను నంజుకుంటూ రొట్టెను తింటుంటే మెత్తని కేక్ ముక్క నోట్లోకి జారుతున్నట్లే ఉంటుంది. మన కళ్ల ముందే సంప్రదాయ కట్టెల పొయ్యి మీద బాణలిలో కాల్చి వేడివేడి పొగలు కక్కుతున్న రొట్టెను అరటి ఆకులో ఇస్తారు. ఆరోగ్యం, అతి«థి మర్యాదలకు వేదికగా ఉంటుంది ఈ కాకా హోటల్. తాత వేసే రొట్టె తినేందుకు అంతస్తు, హోదా చూసుకోరు. రొట్టెలను కాల్చేందుకు... నేలపై కొన్ని ఇటుకలు పేర్చి దాని మీద ఓ రేకు, దాని మీద ఇటుకలతో రెండు పొయ్యిలు ఉంటాయి. ఆ రెండింటి మీద రెండు బాణలులు ఉంటాయి. వాటిలో రొట్టె పిండి వేస్తారు. పొయ్యిని కొబ్బరి డొక్కలతో మండిస్తారు. మొదటి పొయ్యి మీద ఉన్న బాణలిలో ఓ రొట్టె కాస్త దోరగా కాలిన తర్వాత, అదే రొట్టెను పక్కనున్న మరో పొయ్యిపై ఉన్న మూకుడులో వేసి, దాని మీద ఇనుప రేకు ఉంచి దాని మీద నిప్పుల సెగ ఉంచుతారు. కింద, పైన నిప్పులతో రొట్టె సమాంతరంగా కాలి కమ్మగా తయారవుతుంది. తాత వేసే రొట్టె రుచి వెనుక రహస్యం ఇదే. ఈ కాకా హోటల్ రోజూ మధ్యాన్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ ఉంటుంది. ప్రతిరోజూ దాదాపు 150 నుంచి 200 మంది ఈ కమ్మటి రొట్టె రుచి చూస్తారు. ఒకసారి ఈ రుచి చూసినవారు మళ్లీ ఇటుగా వచ్చినప్పుడు రొట్టె తినకుండా వెళ్లరు. పావలాతో మొదలైన ప్రస్థానం అబ్బిరెడ్డి తాత సొంతూరు ముక్కామల పక్కనే ఉన్న ఇరుసుమండ. రోజూ అక్కడ నుంచి ముక్కామల కాల్వ గట్టుకు వచ్చి, ఈ పాకలో కాకా హోటల్ నిర్వహిస్తున్నారు. 1969లో జీవనాధారం కోసం మినప రొట్టెలు వేయడం ప్రారంభించారు. పావలాతో ప్రారంభమైన రొట్టె ధర ఇప్పుడు ఇరవై రూపాయలు మాత్రమే. కస్టమర్ను తాత చిరునవ్వుతో ఆహ్వానించడంలో మర్యాద కనిపిస్తుంది. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, రాజమహేంద్రవరం ఫోటోలు: సుబ్బారావు పరసా తిన్న ప్రతి ఒక్కరూ బాగుందంటారు... నా హోటల్కు వచ్చి మినపరొట్టె తిని వెళ్లే వారంతా ‘రొట్టె చాలా బాగుంది, చట్నీల కాంబినేషన్ బాగుంది’ అని చెబుతుంటే ఆనందంగా ఉంటుంది. 50 ఏళ్లుగా రుచి అలాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. పిండి, ఉప్పు సమపాళ్లలో కలపడం, రొట్టెను కాల్చేటప్పుడు దోరగా ఉండేలా చూసుకోవటం వంటి కొన్ని కిటుకులు పాటించడం కారణంగానే ఇంత పేరు వచ్చిందనుకుంటాను. – అబ్బిరెడ్డి తాత -
బుల్లి మేకర్... బ్రెడ్ తయార్!
మనం తరచుగా తీసుకునే బలవర్ధకమైన ఆహారాల్లో బ్రెడ్ ఒకటి. ముఖ్యంగా పట్టణాల్లోని వారి దైనందిన ఆహారంలో బ్రెడ్ది ప్రధానమైన స్థానమని చెప్పాలి. బ్రెడ్ టోస్ట్, బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ బజ్జీ, బ్రెడ్ హల్వా అంటూ... దీనితో బోలెడన్ని వంటకాలు చేసుకుంటాం. ఇంతగా వాడుతున్నాం కాబట్టి, ప్రతిసారీ బ్రెడ్ని బేకరీకి వెళ్లి తెచ్చుకునే బదులు ఇంటిలోనే తయారు చేసుకుంటే మంచిది కదా! ఓసారి ఈ బ్రెడ్మేకర్ని కొని ఇంట్లో పెట్టేసుకున్నారనుకోండి... ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రెడ్ తయారు చేసుకోవచ్చు. దానితో నచ్చిన వంటకాన్నీ వండుకోవచ్చు. మార్ఫీ రిచర్డ్స్ కంపెనీవారు తయారుచేసిన ఈ బ్రెడ్ మేకర్ ధర నిజానికి రూ. 12,500. అయితే రెడిఫ్ లాంటి షాపింగ్ సైట్లలో రూ. 9000 లోపే లభిస్తోంది. ఇతర కంపెనీల మేకర్స్ కూడా ఉన్నాయి. నచ్చిన కంపెనీ మేకర్ ని, నచ్చిన ధరకు కొనుక్కోవచ్చు!