రసవత్తరంగా బ్యాడ్మింటన్ పోటీలు
కడప స్పోర్ట్స్, న్యూస్లైన్ : నగరంలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆలిండియా బ్యాడ్మింటన్ పోటీలు నువ్వా.. నేనా అన్న రీతిలో సాగుతున్నాయి. ఈ మ్యాచ్లను తిలకించడానికి తల్లిదండ్రులతో పాటు స్థానికులు సైతం పెద్దఎత్తున తరలివస్తున్నారు. రెండోరోజైన బుధవారం 216 మ్యాచ్లు నిర్వహించారు. అండర్ 13 బాలికల విభాగం పోటీలను నగరంలోని ఆఫీసర్స్ క్లబ్లో 3, 4 రౌండ్లు నిర్వహించారు.
అనంతరం 8 మంది క్రీడాకారులను మెయిన్డ్రాకు ఎంపికచేశారు. సింగిల్స్ విభాగంతో పాటు డబుల్స్ విభాగం పోటీలు ప్రారంభం అయ్యాయి. గురువారం అన్ని విభాగాలకు ఫైనల్ రౌండ్ పోటీలు నిర్వహించనున్నారు. అండర్ 13 బాలుర విభాగంలో పుల్లెల గోపీచంద్ తనయుడు పుల్లెల సాయివిష్ణు మహారాష్ర్టకు చెందిన శాంతన్పవార్పై 15-6, 15-10 సెట్ల తేడాతో విజయం సాధించాడు. అండర్ 15 విభాగంలో కడపకు చెందిన దత్తాత్రేయరెడ్డి సైతం రాణించి రెండవ, మూడవ రౌండ్లలో ప్రత్యర్థులపై విజయం సాధించి మెయిన్డ్రాకు ఒక్క అడుగుదూరంలో నిలిచాడు. క్యాలిఫైయింగ్ మ్యాచ్లకు 546 మంది క్రీడాకారులు హాజరుకాగా మెయిన్డ్రా పోటీల్లో 394 మంది తలపడనున్నారు.
మెయిన్ డ్రా పోటీల్లో గత యేడాది ఇండోనేషియాలో నిర్వహించిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో స్వర్ణపతక విజేత ఉత్తరాఖండ్కు చెందిన లక్ష్యసేన్, పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె పుల్లెల గాయత్రి గోపీచంద్తో పాటు పలువురు ర్యాం కింగ్ క్రీడాకారులు హాజరుకానున్నారు. మ్యాచ్లను ఆద్యంతం రెఫరీలు మంజుషాసహస్త్రబుద్ది, సతీష్మా ల్యా, ఫణిరావు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు.