
స్నేహితుడికి కాబోయే భార్యను బెదిరించి..
తన స్నేహితుడికి కాబోయే భార్యను ఆమె సెల్ఫీలతో బ్లాక్ మెయిల్ చేసినందుకు ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
అతడు బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన కుర్రాడు. ముంబైలో ఓ బడా వ్యాపారవేత్త కొడుకు. ఎంబీఏ చదువుతున్నాడు.. తన స్నేహితుడికి కాబోయే భార్యను ఆమె సెల్ఫీలతో బ్లాక్ మెయిల్ చేసినందుకు అతడిని అరెస్టు చేశారు. ఆమె ఫోన్ నుంచి దొంగిలించిన ఆమె వ్యక్తిగత ఫొటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి రూ. 5 లక్షలు డిమాండ్ చేసినందుకు పోలీసులు అతగాడిని పట్టుకున్నారు. అతడిపేరు వివేక్ అగర్వాల్. ఓ బ్యాంకులో చార్టర్డ్ అకౌంటెంటుగా పనిచేస్తున్న యువతి (23)ను అతడు బెదిరించాడు. తనకున్న అప్పులను తీర్చేందుకు అతడు ఇలా చేసినట్లు తెలుస్తోంది. ముందు డబ్బులు ఇస్తానని చెప్పిన ఆ అమ్మాయి.. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేయడంతో కుర్రాడి బండారం బయటపడింది.
ఆ అమ్మాయికి కొన్నిరోజుల క్రితం ఆఫీసుకు ఒక సీల్ చేసిన ఎన్వలప్ వచ్చిందని, అందులో ఓ పెన్ డ్రైవ్ ఉందని డీసీపీ అభిషేక్ త్రిముఖి తెలిపారు. అందులో ఆమె తీసుకున్న రకరకాల సెల్ఫీలు ఉన్నాయి. తర్వాత ఓ పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ వచ్చిందని, రూ. 5 లక్షలు ఇవ్వకపోతే ఆ ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడని చెప్పారు. తన ఫోన్ ఇటీవల రిపేరుకు ఇచ్చానని, అక్కడివాళ్లే ఈ పనిచేసి ఉంటారని ఆమె అనుమానించినా, అది తప్పని తేలింది. అసలు అలాంటి ఫొటోలు ఎందుకు తీసుకున్నారని పోలీసులు అడిగితే.. అవి తనకు కాబోయే భర్త కోసం అని చెప్పి, అతడికి తాను ఫార్వర్డ్ చేశానంది. దాంతో కాబోయే పెళ్లికొడుకు, అతడి స్నేహితులను పోలీసులు అనుమానించారు. అంతలో వివేక్ అగర్వాల్ ఆమెను డబ్బు ఇవ్వడానికి కుర్లాకు రమ్మన్నాడు. దాంతో అతడిని అక్కడే పట్టుకోడానికి పోలీసులు మఫ్టీలో వెళ్లారు. అది పనిచేసి, అతడు దొరికేశాడు. పెళ్లికొడుకు, తాను కలిసి థాయ్లాండ్ వెళ్లినపుడు అతడి ఫోన్లోంచి ఈ ఫొటోలు తీసుకున్నానని, తనకు రూ. 10-15 లక్షల వరకు అప్పులు ఉండటంతో ఇలా చేశానని అతడు చెప్పాడని పోలీసులు తెలిపారు.