ఎఫ్‌ఎంసీజీ రంగంలో విస్తరిస్తాం.. | We will develop FMCG sector .. | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎంసీజీ రంగంలో విస్తరిస్తాం..

Apr 30 2015 1:45 AM | Updated on Oct 2 2018 8:16 PM

ఎఫ్‌ఎంసీజీ రంగంలో దేశంలో పెద్ద ఎత్తున విస్తరిస్తామని గ్లోబల్ కన్జూమర్ ప్రొడక్ట్స్(జీసీపీ) తెలిపింది.

జీసీపీ సీఎండీ మహేంద్రన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎఫ్‌ఎంసీజీ రంగంలో దేశంలో పెద్ద ఎత్తున విస్తరిస్తామని గ్లోబల్ కన్జూమర్ ప్రొడక్ట్స్(జీసీపీ) తెలిపింది. కన్ఫెక్షనరీ, పానీయాలు, స్నాక్స్ విభాగాల్లో విభిన్న ఉత్పత్తులను ప్రవేశపెడతామని సంస్థ సీఎండీ అరుముగం మహేంద్రన్ బుధవారం తెలిపారు. కంపెనీ తొలి ఉత్పాదన అయిన లవ్‌ఇట్ చాకొలేట్లను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ వాటర్, టీ, కాఫీ తదితర ఉత్పత్తులు త్వరలో మార్కెట్లోకి రానున్నాయని వివరించారు.

వచ్చే ఐదేళ్లలో రూ.1,250 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. గోద్రెజ్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్ మాజీ ఎండీ  అయిన మహేంద్రన్ కంపెనీకి గోల్డ్‌మన్ శాక్స్, మిత్సుయి వెంచర్స్ రూ.315 కోట్ల నిధులను అందించాయి. మంగళూరులో ఒకటి, హైదరాబాద్‌కు చెందిన రెండు తయారీ కంపెనీలతో కాంట్రాక్ట్ ఒప్పందాన్ని జీసీపీ కుదుర్చుకుంది. తొలుత దక్షిణాది రాష్ట్రాలపై కంపెనీ దృష్టిసారిస్తుంది.

రెండేళ్లలో దేశవ్యాప్తంగా విస్తరించడంతోపాటు ఇతర దేశాలకూ ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది. గోద్రెజ్ గ్రూప్‌లో 18 ఏళ్లపాటు వివిధ హోదాల్లో మహేంద్రన్ పనిచేశారు. రెండేళ్ల క్రితం గోద్రెజ్‌కు రాజీనామా చేశారు. కాగా, ఏటా 20 శాతం వృద్ధి నమోదు చేస్తున్న రూ.7,000 కోట్ల చాకొలేట్ పరిశ్రమలో దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతముంది.

Advertisement
 
Advertisement
Advertisement