22 కోట్ల రూపాయల ఆస్తులు పోగేసుకున్న ఐఏఎస్ దంపతులను ఉద్యోగాల నుంచి తొలగించాలని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
అవినీతి ఐఏఎస్ దంపతుల డిస్మిస్ కు రంగం సిద్ధం
Sep 2 2013 2:02 PM | Updated on Jul 29 2019 5:53 PM
వాళ్లిద్దరూ ఆదర్శ దంపతులు. భర్త అడుగుజాడల్లోనే భార్య నడిచింది, భార్య చూపిన బాటలోనే భర్త వెళ్లారు. చివరకు వాళ్లిద్దరూ కలిసి జైలుకు వెళ్లారు. వీళ్లేదో మామలు చిల్లర దొంగలు అనుకుంటున్నారేమో.. కాదు కాదు.. సాక్షాత్తు ఐఏఎస్ అధికారులు!! వాళ్ల పేర్లు అరవింద్ జోషి, టిను జోషి. లంచాలు తెగ మెక్కి, దాదాపు 22 కోట్ల రూపాయల ఆస్తులు పోగేసుకున్న వీరిని ఉద్యోగాల నుంచి తొలగించాలని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు పంపగా, కేంద్రం కూడా అందుకు పచ్చజెండా ఊపింది. ఇప్పటికే సస్పెండైన వీరిని డిస్మిస్ చేయాలన్న ప్రతిపాదనలను యూపీఎస్సీ ఆమోదం కోసం కేంద్రం పంపింది.
రెండు రోజుల్లోనే వీరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు రావచ్చిన తెలుస్తోంది. వీరిపై విచారణ కూడా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అనుమతి కోరింది.
2011లో జోషి దంపతుల ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేయగా, మూడు కోట్ల రూపాయల నగదు, మరన్ని కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలు దొరికాయి. మొత్తం ఆస్తుల విలువ 22 కోట్లుగా తేలడంతో, ఐఏఎస్ దంపతులు, వారి బంధువులకు ఏసీబీ కోర్టు నోటీసులిచ్చింది.
Advertisement
Advertisement