నేటినుంచి షర్మిల పరామర్శ | Sharmila paramarsha yatra to be started from today | Sakshi
Sakshi News home page

నేటినుంచి షర్మిల పరామర్శ

Sep 21 2015 1:55 AM | Updated on Jul 25 2018 4:07 PM

నేటినుంచి షర్మిల పరామర్శ - Sakshi

నేటినుంచి షర్మిల పరామర్శ

వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సోమ, మంగళవారాల్లో వరంగల్ జిల్లాలో చివరి విడత పరామర్శ యాత్ర చేపట్టనున్నారు.

నేడు, రేపు వరంగల్‌లో చివరి దశ
అనంతరం కరీంనగర్ జిల్లాలోకి.. మొత్తం 23 కుటుంబాలకు పరామర్శ

 
సాక్షి ప్రతినిధి, వరంగల్/కరీంనగర్/హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సోమ, మంగళవారాల్లో వరంగల్ జిల్లాలో చివరి విడత పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. మహానేత మరణాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలోనే ఎక్కువ మంది చనిపోయారు. మృతుల కుటుం బాలకు అండగా ఉంటానంటూ కర్నూలు జిల్లా నల్లకాల్వ వద్ద వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు ఆ కుటుంబ ప్రతినిధిగా షర్మిల వరంగల్ జిల్లాలో ఆగస్టు 24-28 మధ్య 32 కుటుంబాలను, సెప్టెం బర్ 7-11 మధ్య 30 కుటుంబాలను పరామర్శించారు. సోమవారం నుంచి చివరి దశలో ములుగు, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 11 కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం మంగళవారం సాయంత్రం యాత్ర కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. వైఎస్ మృతిని తట్టుకోలేక జిల్లాలో 30 మంది మరణించారు. తొలి దశలో 12 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
 
 యాత్ర ఇలా...: సోమవారం ఉదయం 8.30కు హైదరాబాద్ లోటస్‌పాండ్ నుంచి షర్మిల పరామర్శ యాత్రకు బయల్దేరతారు. వరంగల్ జిల్లా మంగపేట మండలం బండారిగూడెంలో దోమగండి ముత్తయ్య, రాజుపేటలో దుబ్బ ముత్తయ్య కుటుంబాలను పరామర్శిస్తారు. తర్వాత ఏటూరునాగారంలో వలస చిన్నక్క, గోవిందరావుపేట మండలం దుంపెల్లిగూడెంలో దేవిరెడ్డి రాంచంద్రారెడ్డి, చల్వాయిలో మేడపల్లి అమ్మాయమ్మ, బుస్సాపూర్‌లో బేతి వెంకట్‌రెడ్డి కుటుంబాలను ఓదారుస్తారు.
 
 మంగళవారం మరో ఐదు కుటుంబాలను పరామర్శించిన అనంతరం వరంగల్ జిల్లాలో యూత్ర ముగించుకుని సాయంత్రం కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశిస్తారు. కాటారం మండలం బొర్లగూడెంలో ఎ. రామయ్య కుటుంబాన్ని పరామర్శించి రాత్రి కాటారంలో బస చేస్తారు. బుధవారం ఆరు కుటుంబాలను పరామర్శించి రాత్రి ధర్మారంలో బసచేస్తారు. 24న గురువారం మరో ఐదు కుటుంబాలను పరామర్శించి రాత్రి హైదరాబాద్ పయనమవుతారు. జిల్లాలోని మంథని, పెద్దపల్లి, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో 371 కి.మీ. మేర యూత్ర జరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement