అజేయం... ఆ వ్యక్తిత్వం! | Sakshi Editorial On ys jagan mohan reddy Invincible Personality | Sakshi
Sakshi News home page

అజేయం... ఆ వ్యక్తిత్వం!

Mar 22 2026 3:20 AM | Updated on Mar 22 2026 3:20 AM

Sakshi Editorial On ys jagan mohan reddy Invincible Personality

జనతంత్రం

సీనియర్‌ పాత్రికేయులు మోతడక సుధాకర్‌ శనివారం నాడు ఫోన్‌ చేసి ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అన్న మీద షర్మిల చెరిగిన అవాకులు, విజయమ్మ లేఖ నేపథ్యంలో ఆయనీ సంగతిని పంచుకున్నారు. ఆయన రెండు దశాబ్దాలకు పైగాకాంగ్రెస్‌ వ్యవహారాలు కవర్‌ చేసిన సీనియర్‌ రిపోర్టర్‌. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకు మర్యాదపూర్వకంగా ఆయన్ను కలవడానికి మరో సీనియర్‌ పాత్రికేయుడు, దివంగతులైన కృష్ణారావుతో కలిసి వెళ్లారట!

మాటల సందర్భంలో జగన్‌ ప్రస్తావన వచ్చిందట! జగన్‌ చాలా చిన్న వయసులోనే విజయవంతమైన వ్యాపార వేత్తగా రాణిస్తున్నారనీ, తనకు అండగా నిలబడ్డారనీ వైఎస్సార్‌ చాలా గర్వంగా వారితో చెప్పారట! కొడుకు ప్రయోజకత్వంపట్ల ఆ తండ్రి కనబరిచిన పుత్రోత్సాహాన్ని తాము అప్పట్లోనే పలువురు మిత్రులతో పంచుకున్నామని సుధాకర్‌ చెప్పారు.

వైఎస్సార్‌ 1999లో పీసీసీ అధ్యక్షునిగా ఉండి శాసనసభ ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటికి జగన్‌ వయసు 27 సంవత్సరాలు కూడా నిండలేదు. అంతకుముందు పదేళ్లపాటు వైఎస్సార్‌ ఎంపీగా ఉన్నారు. ఆ సమయంలో తన సహచరుడు, మిత్రుడైన రాజంపేట ఎంపీ సాయిప్రతాప్‌తో మాట్లాడుతూ ‘నా కొడుకు వ్యాపార రంగంలో యోగ్యుడయ్యాడు, ఆర్థికంగా ఇబ్బందిపడే పరిస్థితి ఉండ’దని అన్నారట! 

ఈ సంగతిని స్వయంగా ఏబీఎన్‌ రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిప్రతాప్‌ వెల్లడించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో అందుబాటులోనే ఉన్నది. జగన్‌ మోహన్‌రెడ్డి చిన్న వయసులోనే సమర్థుడైన వ్యాపారవేత్తగాతన కాళ్లపై తాను నిలబడటమే కాకుండా తండ్రికి కూడాఅండగా నిలబడ్డాడనేందుకు ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.

చంద్రబాబు చాలాకాలంగా నిర్వహిస్తున్న జగన్‌ వ్యక్తిత్వ హనన హవనంలో తాజాగా షర్మిల మరో సమిథను విసరడం, దరిమిలా విడుదలైన విజయమ్మ లేఖ, అది రాజేసిన ఆస్తుల రచ్చ నేపథ్యంలో ఈ పూర్వరంగాన్ని గమనంలో ఉంచుకుంటే మరింత స్పష్టత వస్తుంది. ఆస్తుల పంపకం పూర్తికాలేదంటూ విజయమ్మ లేఖలో పేర్కొనడంపై ఆ కుటుంబ వ్యవహారాలు తెలిసినవారు అవాక్కయ్యారు. శత్రువు చేతిలో పావులా మారి అన్న మీద షర్మిల విషం కక్కుతున్నదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. 

‘అటువంటి పావుకోసం కన్న కొడుకు మీదే అభాండాలు వేస్తావా తల్లీ’ అని విజయమ్మను ఆయన ప్రశ్నించారు. 2009లో వైఎస్సార్‌ జీవించి ఉండగానే షర్మిలకు పంచి రిజిస్టర్‌ చేసిన ఆస్తుల చిట్టాను రాచమల్లు చదివి వినిపించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌2 లోని ఇల్లు, ఇడుపులపాయ ఎస్టేట్‌లో 51 ఎకరాలు సహా తొమ్మిది ఆస్తుల జాబితాను ఆయన చదివారు. షర్మిల పేరు మీద ఈ ఆస్తులన్నీ రిజిస్టర్‌ అయ్యాయన్న విషయాన్ని అంగీ కరిస్తూనే, పంపకాలు పూర్తికాలేదన్న విజయమ్మ లేఖలోని డొల్లతనాన్ని ఆయన ఎండగట్టారు.

షర్మిలకు పంచినట్టే జగన్‌కు కూడా కొన్ని ఆస్తులను వైఎస్సార్‌ పంచి ఇచ్చారనీ, జగన్‌ సొంతగా సంపాదించుకున్న ఆస్తులను అవి జగన్‌ ఆస్తులుగానే వైఎస్‌ పరిగణించినందువల్లనే వాటిలో వాటాలను కూడా షర్మిలకు పెట్టలేదనీ రాచమల్లు వివరించారు. అయినా జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత చెల్లెలి మీద ప్రేమతో సొంత ఆస్తి సరస్వతీ పవర్‌లో తల్లి పేరుపై పెట్టుకున్న 51 శాతం షేర్లు భవిష్యత్తులో షర్మిలకు చెందేలా (ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న కారణంగా) ఎమ్‌ఓయు రాసిచ్చారని గుర్తుచేశారు. 

జగన్‌ మీద కాంగ్రెస్‌ – టీడీపీలు జాయింటుగా బనాయించిన తప్పుడు కేసుల ఫలితంగా సరస్వతీ పవర్‌ సహా జగన్‌ ఆస్తులన్నీ ఈడీ అటాచ్‌మెంట్‌లోకి వెళ్లాయి. ఈ ఆస్తులను అమ్మినా, షేర్లు బదలాయించినా జగన్‌ బెయిల్‌ రద్దవుతుంది. ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సంగతి తెలిసినా తల్లి పేరుతో ఉన్న షేర్లను బదలాయించేందుకు షర్మిల వెనుకాడలేదు. ఒరిజినల్‌ సర్టిఫి కెట్లు జగన్‌ వద్దనే ఉన్నా తప్పుడు అఫిడవిట్‌ సమర్పించి మరీ షేర్లను బదలాయించారంటే షర్మిల ఉద్దేశమేమిటో స్పష్టంగా తెలుస్తున్నదని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఈ కుట్రపూరిత వ్యవహారం తెలిసిన వెంటనే అనివార్య పరిస్థితుల్లో జగన్‌ ఎన్‌సీఎల్టీని ఆశ్రయించవలసి వచ్చింది. దీని మీద యెల్లో మీడియా, కూటమి పార్టీలు నానా రాద్ధాంతం చేశాయి. తల్లి మీద, చెల్లి మీద జగన్‌ కోర్టుకెక్కారని విషప్రచారం చేశాయి. జగన్‌ను మరోమారు జైలుకు పంపాలన్న కుట్ర విఫలమైనందుకు వారి ఏడుపును ఆర్థం చేసుకోవచ్చు. మరి చెల్లెలికేమైంది? తెలిసి తెలిసి ఈ కుట్రలో ఎందుకు భాగస్వా మయ్యారు? బాబాయి హత్యను కూడా అన్న మెడకు చుట్టాలని చూస్తున్న శత్రువు ప్రయత్నాలకు తందానా అనే చెల్లెళ్లు ఏం చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదేమో!

షర్మిలకు వివిధ సందర్భాల్లో జగన్‌ స్వార్జితంలోంచి 230 కోట్ల రూపాయలు ఇచ్చారని రాచమల్లు చెప్పారు. ఆమె ఎన్నికల అఫిడవిట్‌లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినట్టున్నారు. ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఖర్చులకు ఈ నిధులను ఉపయోగించారేమో తెలియదు కానీ, ఇప్పుడు ఒక అనుమానం బలంగా కలుగుతున్నది. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలన్నది ఆమె స్వతంత్ర నిర్ణయం కాదేమో! అప్పటికే ఆమె చంద్రబాబు ప్రభావంలోకి వెళ్లి ఉండాలి. 

తెలంగాణలో కొంతకాలం ప్రాక్టీస్‌ చేయించి, తనకు గిట్టని కేసీఆర్‌నునానా తిట్లు తిట్టించి, ఆ తర్వాత ఇచ్చిన హామీ మేరకు ఆంధ్ర కాంగ్రెస్‌ నాయత్వాన్ని చంద్రబాబు ఆమెకు కట్టబెట్టించిఉండవచ్చు. తెలంగాణ, ఆంధ్ర కాంగ్రెస్‌ ఫ్రాంచైజీలు చంద్ర బాబు చేతిలోనే ఉన్నాయనేది విశ్వసనీయ సమాచారం. ఆయన కనుసన్నల్లోనే ఈ రెండు రాష్ట్రాల పార్టీ యూనిట్లు పని చేస్తున్నా యని కొందరు కాంగ్రెస్‌ నేతలే అంగీకరిస్తున్నారు.

జగన్‌ బలం ఆయన క్యారెక్టర్‌. ఆ బలాన్ని బలహీన పరచకుండా ఆయన్ని ఎదుర్కోవడం కష్టం. కుటుంబ విలువలను పాటించడంలో గానీ, ఆడిన మాటపై నిలబడటంలో గానీ, మానవీయ విలువల్లో గానీ, బడుగు జన పక్షపాతంలో గానీ, ఔదార్యంలో గానీ, దాతృత్వంలో గానీ, విలువలు – విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు నడపడంలో గానీ జగన్‌కు సాటిరాగల నాయకుడు సమకాలీన రాజకీయరంగంలో ఎవ్వరూ లేరు. 

జగన్‌ను సన్నిహితంగా చూసిన వాళ్లెవరైనా చెప్పే మాట ఇదే! ఇందులో రెండో అభిప్రాయానికి తావే లేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఈ నెలలోనే పదిహేనేళ్లు నిండాయి. పార్టీ స్థాపించవలసి రావడానికి దారితీసిన పరిస్థితులేమిటి? ఆ ఘడియల్లో ఆవిష్కృతమైన సన్నివేశాలు ఎటువంటివి? ఎంత ఉద్వేగం... ఎంత ఉత్తేజం ఉరకలెత్తిందో! ఎన్ని లక్షల హృదయ స్పందనలు వినిపించాయో! ఎన్ని దోసిళ్ల కన్నీళ్లు ఆ క్షణాలను అభిషేకించాయో!

ముప్ఫయ్యేడేళ్లు ఇంకా నిండని యువకుడు, మేరు నగధీరుడైన తండ్రి హఠాన్మరణంతో తల్లడిల్లిపోయాడు. ఈ మేరుపర్వతం ఇక లేదని తెలిసిన వందలాదిమంది గుండెపగిలి చనిపోయారు. ఈ పరిణామం జగన్‌ను మరింత శోకమూర్తిని చేసింది. అతని హృదయం ద్రవించింది. ఆ చనిపోయిన వాళ్లంతా తన ఆత్మబంధువులని ప్రకటించు కున్నాడు. వారి కుటుంబాల వద్దకు వెళ్లి వారి బాధను పంచుకుంటానని ప్రతిన బూనాడు. ఓదార్పు యాత్రను ప్రారంభించాడు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం అడ్డుచెప్పింది. 

ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశమివ్వాలని కుటుంబంతో సహా వెళ్లి అధినేత్రిని ఆ యువకుడు అభ్యర్థించాడు. ఆమె ససేమిరా అన్నది. అప్పుడు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీకి ఆమె తిరుగులేని నాయకురాలు. ఆ సమయంలో ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఒకరైన అధినేత్రి ఆజ్ఞను ఆమె పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనాఉల్లంఘించగలడా? ఉల్లంఘించి నిలబడగలడా? ఒక్క జగన్‌ మోహన్‌రెడ్డి తప్ప!

ఎక్కడి నుంచి వచ్చింది జగన్‌మోహన్‌రెడ్డికి ఈ బలం. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న విశ్వసనీయతలోంచి! తమకోసం దుఃఖిస్తున్న బాధితుల కన్నీళ్లు స్వయంగా తుడవడం బాధ్యతని భావించే విలువల్లోంచి! విలువలు – విశ్వసనీయత పునాదిగా ఏర్పడిన ఆ సంకల్పం ఆ క్షణాల్లోనే వెయ్యేనుగుల బలాన్ని సంతరించుకున్నది. కాంగ్రెస్‌ పార్టీకి, ఆ పార్టీ తరఫున గెలిచిన ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా నిలబడితే ఐదున్నర లక్షల ఓట్ల మెజారిటీతో రికార్డులు బద్దలు చేసిన ఆ శబ్దం దేశమంతటా ప్రతిధ్వనించింది. 

సొంత పార్టీ స్థాపిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరికలు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటే అప్పుడో ఇప్పుడో ముఖ్యమంత్రిని చేస్తామనే బుజ్జగింపులు వినిపించాయి. బెదిరింపులూ, బుజ్జగింపులూ ముఖ్యం కాదు. ఇచ్చిన మాటను నిల బెట్టుకోవడమే ముఖ్యమనే సంకల్పంతోముందడుగు వేశాడు. ఆ సంకల్పానికి ఉన్న బలం వల్ల కొన్ని వేల జతల కాళ్లు ఆయన్ను అనుసరించాయి. కొన్ని వేళ గళాలు ఆయన గొంతుకతో శ్రుతి కలిపాయి. ఈ పదిహేనేళ్ల ప్రస్థానం గురించి తెలిసిందే! 

మొదటి ఎన్నికల్లోనే ఒంటరిగా తలపడిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. తలపండిన చంద్రబాబు మోదీతో, పవన్‌ కల్యాణ్‌తో చేతులు కలిపి వచ్చినా ఎదిరించిన వ్యక్తి జగన్‌. చంద్రబాబు చేసిన అలవికాని హామీలకు పోటీగా నెరవేర్చలేని హామీలు ఇవ్వలేననీ, అంతకన్నా ఓడిపోవడానికైనా సిద్ధమేననీ ప్రకటించిన నాయకుడు సమకాలీన భారత రాజకీయ చరిత్రలో ఇంకెవరైనా ఉన్నారా? ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి తప్ప? గద్దెనెక్కగానే ఎన్నికల హామీలను బుట్టదాఖలు చేసే రోజుల్లో మేనిఫెస్టోకు పట్టాభిషేకం చేసి, అనునిత్యం దానిలో ఎన్ని హామీలు అమలు చేశామో, ఎన్ని మిగిలి ఉన్నాయోనని లెక్కలు వేసుకున్న పాలకుడిని ఇంకెవరినైనా చూశామా? ఒక్క జగన్‌మోహన్‌రెడ్డిని తప్ప. 

మహిళల సాధికారతకోసం తపించి, ఎక్కడా లేని పథకాలు ప్రవేశపెట్టి, వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంలో జగన్‌ కంటే మిన్నగా నిలబడిన నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా? కష్టజీవుల బిడ్డలు కూడా కోటీశ్వరుల పిల్లలతో సమానమైన చదువులు చదవాలని తపించి సీబీఎస్‌ఈ, ఇంగ్లిష్‌ మీడియం, డిజిటల్‌ ఎడ్యుకేషన్, బడుల ఆధునీకరణ వంటి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వాధినేతను ఇంకెవరినైనా చూశామా? ఒక్క జగన్‌మోహన్‌రెడ్డిని తప్ప! బీదా–బిక్కీ ఇళ్లకు కూడా ఫ్యామిలీ డాక్టర్‌ ఉండాలని కలలుకని ప్రణాళికను రచించిన ముఖ్యమంత్రిని మరొకరెవరినైనా చూశామా, జగన్‌మోహన్‌రెడ్డిని తప్ప! ఇదీ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వం. 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆ వ్యక్తిత్వం ఒక శత్రు దుర్భేద్యమైన కవచం. ఆ కవచాన్ని ఛేదించడానికి పదిహేనేళ్లుగా టీడీపీ కూటమి కుట్రలు చేస్తూనే ఉన్నది. కష్టాల కొలిమిలో కాలమే సానబట్టిన ఖడ్గం జగన్‌. అధర్మ యుద్ధాలతో ఎల్లకాలం దాన్ని ఓడించలేరు. అగ్ని సరస్సున వికసించిన వజ్రపు కాంతిని పిడికిట్లో ఎంతోకాలం దాచి ఉంచలేరు.
 


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement