సాక్షి, వైఎస్సార్ జిల్లా: కాంగ్రెస్ నాయకురాలు షర్మిలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానంద రెడ్డికి గుండెపోటు అన్న అంశం సాక్షిలోనే కాదు.. అన్ని మీడియా చానల్స్లోనూ వచ్చింది. షర్మిల ఎల్లో మీడియా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు దమ్ము, ధైర్యం లేక వేరే వారితో మాట్లాడించారని షర్మిల అన్నారు. దమ్ము, ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ వైఎస్ జగన్. వివేకానంద రెడ్డికి గుండెపోటు అన్న అంశంపై అన్ని మీడియా చానల్స్లోనూ వచ్చింది. ఎల్లో మీడియాలో కూడా గుండె పోటు అనే వచ్చింది. దాని గురించి ఎందుకు మాట్లాడం లేదు?. వివేకా మరణం గురించి ముందుగా ఆయన బావమరది శివప్రకాష్ రెడ్డే అందరికీ సమాచారం అందించారు. సంస్కారం, కుటుంబ గౌరవంతో వైఎస్ జగన్ ఈ అంశంపై స్పందించడం లేదు. మీరు తప్పుడు విమర్శలు చేస్తే మేం స్పందించకూడదా?. వాస్తవాలు ప్రజలకు తెలియాలి.


