రింగు రోడ్డులో రూ. 184 కోట్ల స్కాం | Rs. 184 crore scam in delhi ring road construction | Sakshi
Sakshi News home page

రింగు రోడ్డులో రూ. 184 కోట్ల స్కాం

Feb 8 2014 11:05 AM | Updated on Sep 2 2017 3:29 AM

మరో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఢిల్లీ రింగురోడ్డు నిర్మాణంలో ఏకంగా రూ. 184 కోట్ల అవినీతి బయటపడింది.

మరో భారీ కుంభకోణం వెలుగుచూసింది. రింగురోడ్డు నిర్మాణంలో ఏకంగా రూ. 184 కోట్ల అవినీతి బయటపడింది. ఢిల్లీలోని షీలాదీక్షిత్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2010లో కామన్వెల్త్ క్రీడలకు ముందు రింగ్ రోడ్ బైపాస్ నిర్మాణంలో ఈ అవినీతి జరిగిందని, దీనిపై ఏసీబీ విచారణ జరిపించాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కోరింది. దీంతో ఏసీబీ ముందుగానే ఓ ఎఫ్ఐఆర్ దాఖలుచేసి విచారణ మొదలుపెట్టింది.

ఇందులో మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ పాత్రను కూడా శోధించనున్నారు. సాలింగఢ్ కోట నుంచి వెలోడ్రమ్ రోడ్డు వరకు నిర్మించిన రింగురోడ్డులో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్లు ప్రధానమంత్రి నియమించిన షుంగ్లు కమిటీ తేల్చిచెప్పింది. ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా చేసి ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీని మొత్తం విలువ రూ. 407 కోట్లు. ఈ ప్రాజెక్టులో సామగ్రితో పాటు కూలీల ఖర్చును కూడా కాంట్రాక్టర్లు ఎక్కువ చేసి చూపించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 184 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై ఏసీబీ విచారణతో నిగ్గుతేల్చాలని కేజ్రీవాల్ సర్కారు కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement