నేరస్తులకు ప్రభుత్వ రక్షణ | rk roja fires on cm chandra babu naidu | Sakshi
Sakshi News home page

నేరస్తులకు ప్రభుత్వ రక్షణ

Sep 8 2015 2:20 AM | Updated on Sep 3 2017 8:56 AM

నేరస్తులకు ప్రభుత్వ రక్షణ

నేరస్తులకు ప్రభుత్వ రక్షణ

మహిళలపై దౌర్జన్యాలు చేసి వారి మరణాలకు కార కులైన నేరస్తులను చంద్రబాబునాయుడి ప్రభుత్వం వెనకేసుకొస్తోందని

సాక్షి, హైదరాబాద్: మహిళలపై దౌర్జన్యాలు చేసి వారి మరణాలకు కార కులైన నేరస్తులను చంద్రబాబునాయుడి ప్రభుత్వం వెనకేసుకొస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. నేరస్థులకు అండగా నిలిచి మహిళా వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపాల్ బాబూరావు పాత్ర  ఉందని సాక్షాత్తూ మృతురాలి తండ్రి మొరపెట్టుకుంటున్నా నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

అసెంబ్లీలో తాము బాబూరావు పేరు ప్రస్తావించగానే టీడీపీ నేత ధూళి పాళ్ల నరేంద్ర, మంత్రి గంటా శ్రీనివాసరావు ఉలిక్కిపడ్డారన్నారు. బాబూరావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలేవీ లభించలేదని డీజీపీ జేవీ రాముడు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు.
 
దర్యాప్తులు లేవు, నివేదికలు రావు..
తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేసిన కేసులో విచారణే ముందుకు సాగడంలేదని విమర్శించారు. నారాయణ విద్యాసంస్థల్లో ఇద్దరమ్మాయిల మరణంపై త్రిసభ్య విచారణ కమిటీ నివేదిక రాలేదని, పుష్కరాల్లో మహిళల మరణాలపై ఏం దర్యాప్తు చేస్తున్నారో తెలియదని, రిషితేశ్వరి మృతిపై విచారణ జరిపిన బాలసుబ్రమణ్యం కమిటీ నివేదికను ప్రభుత్వం ఆమోదించలేదని రోజా ధ్వజమెత్తారు.

2014 ఎన్నికల్లో మంత్రి నారాయణ టీడీపీకి మద్దతునిచ్చారు కాబట్టే ఆయన విద్యాసంస్థల్లో 11 మంది మృతి చెందినా సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించకుండా అండగా నిలిచారన్నారు. మంత్రి గంటాకు నారాయణ వియ్యంకుడు కావడంతో అక్కడ ఎంత మంది చనిపోయినా విచారణకు ఆదేశించరన్నారు.

కడప నారాయణ కాలేజీలో ఒకే రూంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మృతదేహాలపై గాయాలున్నందున రీపోస్ట్‌మార్టం జరపాలని ఆ విద్యార్థినుల కుటుంబాలను పరామర్శించే సందర్భంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అన్యాయాలపై మహిళలు స్పందించాలని, మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నపుడు వారిని నిలదీయాలని రోజా పిలుపు నిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement