పుష్కరఘాట్లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో దుర్మరణం పాలైన 27 మందీ ఊపిరి ఆడనందువల్లనే మృతి చెందారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
పుష్కరఘాట్ దుర్ఘటనపై వెల్లడించిన పోస్టుమార్టం నివేదిక
సాక్షి, రాజమండ్రి: పుష్కరఘాట్లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో దుర్మరణం పాలైన 27 మందీ ఊపిరి ఆడనందువల్లనే మృతి చెందారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మృతదేహాలపై ఎటువంటి గాయాలూ లేవని నివేదికలో పేర్కొన్నారు. పుష్కరాల ప్రత్యేక వైద్యాధికారి నాయక్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
అనారోగ్యంతో నలుగురి మృతి
అనారోగ్యంతో నలుగురు యాత్రికులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మంగళవారం మరణించగా, రెండో రోజైన బుధవారం పుష్కరఘాట్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన జల్లు అప్పలనర్సమ్మ(70) సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
మృతదేహాలపై ఆభరణాల తస్కరణ
పుష్కరఘాట్ తొక్కిసలాటలో నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన బొమ్మిశెట్టి అనసూయమ్మ మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. ఆమె కుమారులు ‘మా అమ్మ వంటిపై ఆరు కాసుల బంగారం ఉండాలి. అది ఇప్పుడు కనిపించడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కూడా మృతుల బంధువులు పలువురు తమ వారి ఆభరణాలు కానరావడంలేదని చెప్పారు. విషాదంలో ఉన్న బంధువులెవరూ నగల కోసం ఆరాటపడకపోవడంతో ఎలాంటి ఫిర్యాదులూ రాలేదు.