కోర్టుకు ముగ్గురే! | Pathankot attack: Questions that were never asked about the terror strike | Sakshi
Sakshi News home page

కోర్టుకు ముగ్గురే!

Jan 18 2016 1:41 AM | Updated on Sep 3 2017 3:48 PM

భారత్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి సంబంధించి పాక్‌లో ప్రారంభమైన ఉన్నతస్థాయి దర్యాప్తులో...

అదుపులో 30 మంది..
* పఠాన్‌కోట్ కేసులో పాక్ అధికారుల తీరు
లాహోర్: భారత్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి సంబంధించి పాక్‌లో ప్రారంభమైన ఉన్నతస్థాయి దర్యాప్తులో భాగంగా అదుపులోకి తీసుకున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల్లో ముగ్గురిని ఆదివారం కోర్టులో హాజరుపర్చారు. దర్యాప్తులో భాగంగా 31 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుండగా, వారిలో ముగ్గురినే సియాల్‌కోట్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో హాజరుపర్చడం విశేషం. వారిపై పఠాన్‌కోట్ దాడికి సంబంధించి కాకుండా.. జీహాదీ సాహిత్యాన్ని కలిగి ఉన్నారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురినీ విచారణ నిమిత్తం 3 రోజుల పోలీసు రిమాండ్‌కు జడ్జి ఆదేశించారు.

అయితే, పఠాన్‌కోట్ దాడిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతున్నందున.. ఆ దర్యాప్తు పూర్తయ్యేంతవరకు ఎవరిపైన కూడా ఆ ఘటనకు సంబంధించి కేసులు నమోదు చేయడం కుదరదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాడికి బాధ్యులంటూ ఎవరినీ కోర్టులో హాజరుపర్చడం కూడా సాధ్యం కాదని స్పష్టం చేశాయి. కాగా, జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ అరెస్ట్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో భారత్ ఒత్తిడి మేరకు ఆయనను అరెస్ట్ చేశారని పాక్ మీడియా చెబుతుండగా.. ఆయన భద్రత నిమిత్తమే అదుపులోకి తీసుకున్నాం కానీ అరెస్ట్ చేయలేదంటూ పంజాబ్ న్యాయశాఖ మంత్రి రానా సనావుల్లా స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement