
బ్రెగ్జిట్ కు పోటీగా కొత్త నినాదం వచ్చేసింది!
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలగాలన్న తాజా రెఫరెండం తీర్పును చాలామంది బ్రిటన్ వాసులు జీర్ణించుకోవడం లేదు.
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలగాలన్న తాజా రెఫరెండం తీర్పును చాలామంది బ్రిటన్ వాసులు జీర్ణించుకోవడం లేదు.ఈయూను వీడాలన్న బ్రెగ్జిట్కు వ్యతిరేకంగా కొత్తగా ‘బ్రిమెయిన్’ నినానాదాన్ని తెరపైకి వచ్చారు. బ్రిటన్ ఈయూలోనే ఉండాలన్న ఈ నినాదంతో ‘మార్చ్ ఫర్ యూరప్’ పేరిట శనివారం వేలమంది ప్రజలు లండన్లో ఓ పెద్ద నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులు ‘బ్రిమెయిన్’ , ‘వుయ్ లవ్ ఈయూ’ ప్లకార్డులు ప్రదర్శించారు. కొందరు వ్యక్తుల తప్పుడు ప్రచారం ఆధారంగానే బ్రెగ్జిట్ రిఫరెండం జరిగిందని, అది పూర్తిగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిఫలించలేదని ఈ ర్యాలీలో ప్రధాన పాత్ర పోషించిన కామెడియన్ మార్క్ థామస్ పేర్కొన్నారు.
మరోవైపు తాజా రెఫరెండం తీర్పు ఎలా ఉన్నా.. బ్రిటన్ మాత్రం ఈయూలోనే ఉంటుందని మూడోవంతు మంది ఆ దేశ ప్రజలు భావిస్తున్నట్టు తేలింది. బీబీసీ, ఐపీఎస్వోఎస్ 1077 మందితో నిర్వహించిన సర్వేలో 22శాతం మంది ఈయూ నుంచి బ్రిటన్ వీడుతుందని తాము చెప్పలేమని పేర్కొనగా, 16శాతం మంది బ్రిటన్ ఈయూలోనే ఉంటుందని తెలిపారు. కాగా, 50శాతం మంది సార్వత్రిక ఎన్నికలు నిర్వహించిన తర్వాతే ఈయూ నుంచి బ్రిటన్ వీడే ప్రక్రియను చేపట్టాలని అభిప్రాయపడ్డారు.