నీళ్లు.. నిధులు.. | Sakshi
Sakshi News home page

నీళ్లు.. నిధులు..

Published Tue, Sep 15 2015 2:56 AM

నీళ్లు.. నిధులు..

‘సాక్షి’తో టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యురాలు, ప్రొఫెసర్ ఇ.రేవతి
-      గ్రూప్స్ సహా పోటీ పరీక్షల జనరల్ స్టడీస్‌లో ఇవే ప్రధానం
-    అభ్యర్థులు వీటిపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలి
 -       గ్రూప్స్ -1లో లోతైన అధ్యయనం అవసరమని సూచన

 
సాక్షి, హైదరాబాద్: నీళ్లు.. నిధులు.. నియామకాలే ప్రధానంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపిరి పోసుకుంది. క్రమంగా ప్రజా ఉద్యమంగా మారి, చివరికి రాష్ట్రం అవ తరించింది. అలాంటి రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగం పొంది 20-30 ఏళ్ల పాటు సేవలందించాల్సిన అభ్యర్థులకు కచ్చితంగా వాటిపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ భావన. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏం కోల్పోయింది, ఆ ప్రభావం ఇక్కడి మానవ వనరులు, ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తి రంగాలపై ఎలా పడిందన్నది ఉద్యోగాల్లో చేరేవారు తెలుసుకోవాలి. అందులో భాగంగానే ఎకానమీలో దేశ ఎకానమీతోపాటు తెలంగాణ రాష్ట్ర ఎకానమీపై ప్రత్యేక దృష్టి పెట్టి సిలబస్‌ను రూపొందించారు.
 
 ఏ దేశమైనా, ఏ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అయినా భౌతిక వనరులు, మానవ వనరులు, ఉత్పత్తి రంగాలు, ఉత్పత్తి రంగాల వాటా, వృద్ధిరేటుపైనే ఆధారపడి ఉంటుంది. వీటితో ముడిపడి ఉన్నవే నీళ్లు, నిధులు, నియామకాలు. అందుకే గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల్లో ఎకానమీది ప్రత్యేక స్థానం. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయబోయే వివిధ ఉద్యోగాల్లో అభ్యర్థులు ఎకానమీ సబ్జెక్టును ఎలా చూడాలి, ఏ కోణంలో చదవాలి, ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్న దానిపై టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యురాలు, ఎకనమిక్స్ ప్రొఫెసర్ రేవతి సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. ఆమె వెల్లడించిన వివరాలు, సూచనలు, సలహాలను ఉద్యోగార్థుల కోసం ‘సాక్షి’ అందిస్తోంది...
 
 ఏ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అయినా నాలుగు వనరులపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. అవి 1. భౌతిక వనరులు. 2. మానవ వనరులు. 3.  ఉత్పత్తి రంగాలు.
 4. ఉత్పత్తి రంగాల వాటా, వృద్ధిరేటు. వనరులు, ఆదాయం ఆధారంగా వృద్ధి ఎలా మారుతూ వస్తోందన్నది ప్రధాన అంశం.
 
 భౌతిక వనరులు
 రాష్ట్రంలో మొత్తం భూమి, అందులో సాగు భూమి, సాగుకు యోగ్యంగా లేని భూమి, సాగు చేస్తున్న భూమి, ముఖ్య నదులు, వాటి ప్రవాహ ప్రాంతాలు, పరిశ్రమలు, మైనింగ్, ఇతర అటవీ వనరుల లభ్యత ఉంటాయి.
 
 మానవ వనరులు
 స్త్రీ పురుష నిష్పత్తికి సంబంధించిన భావనను అర్థం చేసుకోవాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి తెలుసుకోవాలి. అభివృద్ధికి సూచి కగా పట్టణీకరణను చెబుతాం. కాబట్టి పట్టణాలు, నగరాల నిర్వచనాలు, గ్రామీణ ప్రాంత పరిస్థితులపై దృష్టిపెట్టాలి. 0-6 వ యస్సును ఒక విభాగం, 7 ఏళ్లకంటే ఎక్కువ వున్నవారిని ఒక విభాగంగా చూడాలి. సామాజిక వర్గాల వారీగా కూడా ప్రధానమే. ఇందులో మరో ప్రధాన అంశం అక్షరాస్యత. ఇదే సామాజిక సూచీగా ఉంటుంది. అక్షరాస్యతను రెండు భాగాలుగా చూడాలి.
 
 ఆరేళ్లలోపు వారిని పరిగణనలోకి తీసుకోరు. ఏడేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు ఒక విభాగంగా, 15 ఏళ్ల పైబడిన వారిని మరో గ్రూప్‌గా తీసుకోవాలి. ఇందులో గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ఎలా ఉంది. స్త్రీ పురుషుల్లో ఎలా ఉందన్న అంశాలు చూసుకోవాలి. విద్యలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఇంటర్, డి గ్రీ, పీజీ చదువుకున్న వారి రేటు ఎంతన్నది తీసుకోవాలి. స్థూల నమోదు రేటులో వయసుతో సంబంధం లేకుండా చదువుకుంటున్న వారు... నికర నమోదు రేటులో నిర్ణీత వయస్సులో చదుతున్న వారి నమోదును చూడాల్సి ఉంటుంది. పైతరగతికి వెళ్తున్న వారు, డ్రాపవుట్స్‌పై సామాజిక వర్గాలు, బాల బాలికలల్లో వేర్వేరుగా చూసుకోవాలి.
 
 శ్రామిక శక్తి (వర్క్‌ఫోర్స్): ఇందులో 15 ఏళ్ల నుంచి 57 ఏళ్ల వారిని తీసుకుంటాం. ఇందులో స్త్రీల వాటా చూడాలి. ఉద్యోగులు, నిరుద్యోగుల నిర్వచనాలు, గణాంకాలపై దృష్టిపెట్టాలి. ప్రాథమిక ఆరోగ్య స్థాయి, మాతా, శిశు మరణాల రేటు, సగటు జీవిత కాలం, సగ టున 30 వయస్సు వారు అత్యధికంగా ఉన్న దేశం మనది. దీనిపెనా దృష్టి పెట్టాలి.
 
 ఇతర అంశాలు..
 భూమి బదలాయింపు విధానాలపై స్పష్టత అవసరం. పెద్ద, మధ ్య, చిన్న, ఉపాంత రైతు విధానంపై అవగాహన ఉండాలి. ఎంత భూమి ఉంటే ఏమంటారన్నది తెలుసుకోవాలి. 2.47 ఎకరాలు ఉంటే ఉపాంత రైతులని, 2.5-5 ఎకరాలు ఉంటే చిన్న రైతులని, 5-10 ఎకరాలు ఉంటే దిగువ మధ్యతరహా రైతులని, 10-25 ఎకరాలు ఉంటే మధ్యతర హా రైతులుగా, 25 ఎకరాల కంటే ఎక్కువుంటే పెద్ద రైతులుగా పరిగణిస్తారన్న అవగాహన ఉండాలి. వీటితోపాటు రాష్ట్రంలో పంటలు, వాటి పరిస్థితులు, సాగునీరు, వర్షపాతం, భూగర్భ జలాలు వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి.
 
 భూగర్భ జలాలపై ఆధారపడటం వల్ల పెట్టుబడులు పెరిగి, ఆదాయం రాక, అప్పులపాలై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయాలపైనా అవగాహన పెంపొందించుకోవాలి. ముల్కనూర్ వంటి సహకార వ్యవస్థ, ఉమ్మడి రాష్ట్రానికంటే ముందు ఇక్కడ జరిగిన పారిశ్రామిక అభివృద్ధి (ఉదాహరణకు డీబీఆర్ మిల్స్, ఆజంజాహీ మిల్స్) వంటి తెలుసుకోవాలి. దీంతోపాటు ప్రస్తుత పారిశ్రామిక విధానం (టీఎస్‌ఐపాస్)పై పట్టు సాధించాలి.
 
 గ్రూప్-2, గ్రూప్-3లో..
 గ్రూప్-2, గ్రూప్-3లో ఇదే తరహాలో ఎకానమీ సిలబస్ ఉన్నప్పటికీ ఇంత విస్తృతంగా ఉండదు. 1956 కంటే ముందు కాలంనాటి పరిస్థితులపై సిలబస్‌లో లేదు. ఆ తరువాత పరిస్థితులపైనే ఉన్నాయి. మానవ వనరులకు సంబంధించిన అంశాలు ఉండవు. ఇక గ్రూప్-4, ఇతర పరీక్షల జనరల్ స్టడీస్‌లో ఎకానమీపై ప్రశ్నలు ఉంటాయి.
 
 ఉత్పత్తి రంగాలు
 ఇందులో 1. వ్యవసాయం, 2. పారిశ్రామిక రంగం,  3.    సేవా రంగం ప్రధానమైనవి.
 -    వ్యవసాయంలో ఉప రంగాలు ఉంటాయి. అవి వ్యవసాయం, పశుపోషణ, అటవీ, మత్స్య సంపద గురించి తెలుసుకోవాలి.
 -    పారిశ్రామిక రంగంలో క్వారీ, మైనింగ్, తయారీ, నిర్మాణ రంగాలు, విద్యుత్, గ్యాస్, నీటిపారుదల వంటివి చదువుకోవాలి.
 -    సేవారంగంలో ఆరు ఉప రంగాలు ఉంటాయి. అందులో 1.రవాణా, స్టోరేజ్, సమాచార వ్యవస్థ, రైల్వేలు; 2.ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్లు; 3.బ్యాంకింగ్, ఇన్సూరెన్స్; 4.రియల్ ఎస్టేట్, ఓనర్స్ ఆఫ్ డ్వెల్లింగ్, బిజినెస్ సేవలు; 5.పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్; 6.ఇతర సేవలు ఉంటాయి. వీటికి సంబంధించిన అంశాలను చదువుకోవాలి.
 
 ఉత్పత్తి రంగాల వాటా
 తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన రంగాల వాటా ఇలా ఉంది. ప్రస్తుతం వ్యవసాయ రంగం వాటా 14 శాతం కాగా సేవా రంగం వాటా 59 శాతం. పారిశ్రామిక రంగం వాటా 27 శాతం. పారిశ్రామిక రంగం వాటా 2000వ సంవత్సరం నుంచి స్థిరంగా ఉండగా, 2000-01లో 25.8 శాతం ఉన్న వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గింది. తగ్గిన మేర సేవారంగం వాటా పెరిగింది.
 
 గ్రూప్-1కు లోతైన అధ్యయనం
 గ్రూప్-1 అభ్యర్థులు మరింత లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 1956 కంటే ముందు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తరువాతి ఆర్థిక వ్యవస్థగా రెండు భాగాలుగా తీసుకోవాలి. 1956 కంటే ముందు ఆర్థిక వ్యవస్థలో 1853-1883 మధ్యకాలంలో వచ్చిన భూసంస్కరణలు కీలకాంశాలే. సాలార్జంగ్ హయాంలో వచ్చిన భూసంస్కరణలు, రెవెన్యూ, వ్యవసాయ సంస్కరణలు ప్రధానమైనవి. వాటిని 6, 7వ నిజాంలు కొనసాగించిన తీరు, వాటివల్ల తెలంగాణలో ఆయా రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
 
 1911-1948లో పారిశ్రామిక అభివృద్ధి
 తెలంగాణలో 7వ నిజాం కాలంలోనే పారిశ్రామిక అభివృద్ధికి బీజాలు పడ్డాయి. పరిశ్రమలను స్థాపించారు. మౌలిక సదుపాయాల కల్పన కు చేపట్టిన చర్యలపై (పోచంపాడు వంటి ప్రాజెక్టు) అధ్యయనం చేయాలి.
 ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ
 1956-2014 మధ్యకాలంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందన్నకోణంలో చదవడం ముఖ్యం.
 
 ఎలా చదవాలంటే..
 ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక స్థితిపై ప్రత్యేకంగా పుస్తకాలు లేవు. ప్రస్తుతం తెలుగు అకాడమీ వాటి ముద్రణను చేట్టింది. రెఫరెన్స్ మెటీరియల్ ఉంది. 2010-2015 మధ్యకాలంలో ఎలా ఉందన్న వివరాలు తెలంగాణ సోషియో ఎకమిక్ ఔట్‌లుక్‌లో ఉన్నాయి. అందులో ఉత్పత్తి రంగాలు, వాటి వాటా వివరాలను జాతీయ స్థాయిలో కేంద్రం విడుదల చేసిన ఎకనమిక్ సర్వేలో... రాష్ట్రానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన సోషియో ఎకనమిక్ ఔట్‌లుక్‌లో లభిస్తాయి. వృద్ధిరేటు, తలసరి ఆదాయం, జిల్లాల ఆదాయం, ఆదాయ వనరులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, తెలంగాణలోని అటవీ వనరులు, బొగ్గు, నీరు వంటివి తెలంగాణకు ఎలా ఉపయోగపడలేదన్నది తెలుసుకోవాలి. అంతేకాదు తెలంగాణలో పన్నులు వసూలు చేసి ఇతర ప్రాంతాలకు ఎలా తరలించారన్నది, నీళ్లు ఎలా తరలించుకుపోయారన్నది, నియామకాల్లో ఎలా నష్టం జరిగిందన్న కోణంలో కచ్చితంగా అవగాహన పెంచుకోవాలి.
 
 మూడు కాలాలుగా విభజన..
 పై అంశాలను చదువుకునే క్రమంలో 1956 నుంచి ఇప్పటివరకు మూడు దశలుగా విభజించుకోవాలి. 1956 నుంచి 1971 వరకు ఒకటి; 1972 నుంచి 1992 వరకు రెండో దశ; 1993 నుంచి 2014 వరకు మూడో దశగా విభజించుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. వీటిలో మూడో దశకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. అంతకుముందు దశలకు సంబంధించిన సమాచారం పూర్తిగా లేదు. కానీ వీటికి సంబంధించిన అధ్యయనాలు ఉన్నాయి. వాటి ఆధారంగా నోట్స్ సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు 1969లో వచ్చిన ‘ది తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్’; 2009, 2014ల్లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ-ప్రాంతీయ అసమానతల పరిణామక్రమం, డెవలప్‌మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956-2001 ఏ స్టడీ ఆఫ్ రీజనల్ డిస్పారిటీస్ అనే అధ్యయనాల ఆధారంగా నోట్స్ రాసుకోవాలి.
 
 కీలకంగా భూసంస్కరణలు..
 -    తెలంగాణలో భూసంస్కరణలు ఎంతో కీలకమైనవి. ఎక్కువ సంస్కరణలకు చట్టాలు ఇక్కడే వచ్చాయి. ఆ చట్టాలతోపాటు వాటి అమలును తెలుసుకోవాలి. మొదటి తరం భూసంస్కరణలు 1948 నుంచి 1973 మధ్యకాలంలో వస్తే.. ఆ తరువాత వచ్చినవి రెండో తరం సంస్కరణలు. మొదటి తరంలో 1948లో జాగీర్దారీ విధానం రద్దు చట్టం, 1949లో వచ్చిన జమీందారీ విధానం, 1954లో వచ్చిన ఇనాందారీ విధానాల రద్దు, 1950లో వచ్చిన కౌలుదారీ చట్టం వంటివి ప్రధానమైనవి. ఈ చట్టాలన్నీ తెలంగాణకు సంబంధించినవే.
 
 -    రెండో తరంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్-1973, అసైన్డ్‌భూముల చట్టం, 2011లో వచ్చిన ల్యాండ్ లెసైన్ ్సడ్ కల్టివేషన్ యాక్ట్ ప్రధానమైనవి. ఇందులో కౌలుదారునికి పం టపై హక్కువంటి అంశాలపై దృష్టి పెట్టాలి. ఆదివాసీ, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూ బదలాయింపు,  నియంత్రణ చట్టాలపై అవగాహన అవసరం. నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి ధర్ కమిటీ, వాంఛూ కమిటీ, ఫజల్ అలీ కమిషన్, కుమార్ లలిత్, విశిష్ట్ భార్గవ, రోశయ్య కమిటీ, 14 ఆర్థిక సంఘం, ముల్కీ నిబంధనలకు సంబంధించిన నివేదికలను చదువుకోవాలి. పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు, 12వ పంచవర్ష ప్రణాళిక, నీతి ఆయోగ్ వంటి వాటిని చదువుకోవాలి.

Advertisement
Advertisement