తెలంగాణ సరే అంటోంది.. మీ సంగతేంటి? | From questioned AP Sarkar Power employees | Sakshi
Sakshi News home page

తెలంగాణ సరే అంటోంది.. మీ సంగతేంటి?

Oct 2 2015 2:54 AM | Updated on Aug 18 2018 8:05 PM

తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన ఏపీ స్థానికత గల విద్యుత్ ఉద్యోగుల వ్యవహారం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కోర్టులోకి మళ్లింది...

- ఏపీ సర్కార్‌ను ప్రశ్నిస్తున్న విద్యుత్తు ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్:
తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన ఏపీ స్థానికత గల విద్యుత్ ఉద్యోగుల వ్యవహారం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కోర్టులోకి మళ్లింది. ఉద్యోగుల బృందం తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును కలిశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. జీతాల చెల్లింపు విషయంలో ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తే, తాము స్పందిస్తామని ఆయన చెప్పినట్టు ఉద్యోగులు తెలిపారు.

న్యాయస్థానం ఉత్తర్వుల్లో 58 శాతం వేతనాలు ఆంధ్రప్రదేశ్, 42 శాతం తెలంగాణ చెల్లించాలన్న అంశాన్ని ఆయన గుర్తుచేశారని, ఏపీ సర్కారు నుంచి ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే, తమకు అభ్యంతరం ఉండబోదని చెప్పినట్టు సమాచారం.దీంతో ‘తెలంగాణ ఒప్పుకుంది కదా? మీరు కూడా సరే అనండి’ అని ఉద్యోగులు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌ను నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అయితే తాను నిర్ణయం తీసుకోలేనని, ప్రభుత్వమే ఇందుకు మొగ్గు చూపడం లేదని ఆయన సూచన ప్రాయంగా చెప్పినట్టు తెలిసింది. తెలంగాణలో పనిచేస్తున్న వారికి తామెలా వేతనాలు ఇస్తామని, అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్దామని సీఎం వ్యాఖ్యానించినట్లుగా సీఎండీ వివరించారని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement