
మమ్మీలతో పండగ చేసుకుంటారు!
ఇండోనేసియాలోని దాని గిరిజనులు చనిపోయిన పెద్దలను మమ్మీలుగా మార్చే సంస్కృతి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
వమేన: మరణించిన వారిని మమ్మీలుగా మార్చే సంస్కృతి ఎక్కడుందంటే 'ఈజిప్ట్' అని ఠక్కున చెప్పేస్తాం. అయితే ఈజిప్టులో ఆ సంస్కృతికి ఎప్పుడో కాలం చెల్లింది. కాగా, ఇండోనేసియాలో మాత్రం నేటికీ మమ్మిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. పశ్చిమ ఇండోనేసియా జయవిజయ రీజెన్సీలోని కొన్ని కొండ ప్రాంత గ్రామాల్లో 'దాని' అనే గిరిజన తెగలు జీవిస్తున్నాయి. చనిపోయిన గ్రామపెద్దలను మమ్మీలుగా మార్చే సంస్కృతి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు దాని ప్రజలు.
1938లో ఓ అమెరికన్ జువాలజిస్టు 'దాని'తెగ ఉనికిని ప్రపంచానికి పరిచయం చేశాడు. అప్పటి నుంచి వందల ఏళ్లుగా వారి జీవన విధానాలపై అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలోనే అరుదైన ప్రక్రియగా భావించే స్మోక్ మమ్మిఫికేషన్(పొగద్వారా మృతశరీరాన్ని మమ్మీగా మార్చే ప్రక్రియ) ద్వారా దానిలు తమ పూర్వీకుల శరీరాలను భద్రపరుస్తారు. ఒక గుడిసెలో మృతదేహాన్ని ఉంచి నెల రోజుల పాటు పొగరాజేస్తారు. అలా తయారైన మమ్మీలను ఏటా ఆగస్టులో జరిగే తెగ ఉత్సవాల్లో ప్రదర్శింస్తారు. అంతేకాదు పక్క ఊళ్లలోని ఇతర తెగలతో బాణాలు, ఇతర ఆయుధాలతో తలపడతారు. వీళ్ల పోట్లాటను చూసేందుకు చాలా మంది అక్కడికి వెళుతుండటం ఈ మధ్యే పెరిగింది. ప్రభుత్వం కూడా టూరిస్టులను ఆకర్శించడానికి గిరిజనుల పోట్లాలకు ప్రచారం కల్పించింది. ఈ ఏడాది ఉత్సవాలు ఇలా జరిగాయి..