మాతా అమృతానందమయికి కేంద్రం ‘జెడ్ కేటగిరీ’ భద్రతను కేటాయించింది.
న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఆధ్మాత్మిక ప్రబోధకురాలు మాతా అమృతానందమయికి కేంద్రం ‘జెడ్ కేటగిరీ’ భద్రతను కేటాయించింది. దీంతో అనుక్షణం ఆమె వెన్నంటి 24 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. యోగా గురువు బాబా రాందేవ్ తరువాత జెడ్ కేటగిరీ భద్రత పొందిన రెండో ఆధ్యాత్మిక వేత్త మాతానే. మాతాకు, ఆమె ఆశ్రమానికి ప్రత్యేక శిక్షణ పొందిన 40 మంది సీఆర్పీఎఫ్ కాపలాగా ఉంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మాతాకు ఆశ్రమం చుట్టుపక్కలే ముప్పు ఉందని కేంద్ర నిఘా వర్గాలు కేంద్రానికి నివేదిక సమర్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఎక్కడికైనా ప్రయాణిస్తే కాన్వాయ్లో రెండు ఎస్కార్ట్ వాహనాలుంటాయి. మరోవైపు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి విజయ్ సాంప్లాకు ‘వై ప్లస్’ భద్రతను కల్పించారు.