
ఆశారాం కుమారుడు అరెస్టు
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కుమారుడు, అత్యాచారం కేసులో నిందితుడు నారాయణ సాయిని ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో బుధవారం వేకువ జామున పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కుమారుడు, అత్యాచారం కేసులో నిందితుడు నారాయణ సాయిని ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో బుధవారం వేకువ జామున పోలీసులు అరెస్టు చేశారు. 58 రోజులుగా పోలీసుల కళ్లుకప్పి తిరుగుతున్న సాయితో పాటు అతడి సహాయకుడు కౌశల్ ఠాకూర్ అలియాస్ హనుమాన్ (29), డ్రైవర్ రమేశ్ మల్హోత్రా (27) కూడా పట్టుబడ్డారు. వారిని రోహిణి మేజిస్ట్రేట్ ఎదుటహాజరుపరచగా, గుజరాత్ పోలీసులకు 24 గంటల ట్రాన్సిట్ రిమాండ్కు అప్పగించారు.
సిక్కుల మాదిరిగా తలపాగా ధరించి మారువేషంలో ఉన్న నారాయణ సాయిని, అతడి అనుచరులను కురుక్షేత్ర సమీపంలోని పిప్లి వద్ద అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నారాయణ సాయిపై రూ.5 లక్షలు, హనుమాన్పై రూ.లక్ష మొత్తాలను పోలీసులు ఇదివరకే రివార్డుగా ప్రకటించారు. సాయిని, అతడి అనుచరులను రోహిణి జిల్లా కోర్టుల కాంప్లెక్స్లో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచేందుకు పోలీసులు తీసుకు వచ్చిన సమయంలో సాయికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేస్తున్న వారిపై అతడి మద్దతుదారులు దాడి చేశారు. ఇద్దరు అక్కచెల్లెళ్ల ఫిర్యాదు ఆధారంగా ఆశారాం, ఆయన కుమారుడిపై సూరత్ పోలీసులు అత్యాచారం, లైంగిక వేధింపులు అభియోగాలపై కేసు లు నమోదు చేశారు. ఆశారాం ప్రస్తుతం జోధ్పూర్ జైలులో కస్టడీలో ఉన్నారు.